సాని దానికి మాత్రం నీతుండొద్దా ?

Sharing is Caring...

Abdul Rajahussain …………………………………………………

‘మధురవాణి ‘ నోట గురజాడ పలికించిన ‘సుభాషితం’ అది. గురజాడ వారు ఏ ముహూర్తాన “ కన్యాశుల్కం “నాటకం రాశాడో కానీ ఆంధ్రదేశంలో దాని ప్రకంపనలు ఇంతవరకూ తగ్గలేదంటే అతిశయోక్తికాదు. అందుకే ‘కన్యాశుల్కం‌ ”నాటికీ .. నేటికీ దృశ్యకావ్యంగా నిలిచి వుంది. మరోవందేళ్ళయినా ఈ నాటకం సజీవంగానే వుంటుంది. నాటకంలోని నాటి సామాజిక సమస్య ఇప్పుడు లేదు. ఈ సమస్య సమసి పోయి చాలా కాలం అయింది.అయినా ఈ నాటకం ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్ గా వుందంటే దానికి ప్రధాన కారణం నాటక కర్త . ఇందులోని పాత్రల్ని మలిచిన తీరు అద్భుతం అని చెప్పుకోవాలి. 

కన్యాశుల్కం అనగానే నిలువెత్తు గిరీశం పాత్ర మన కళ్ళముందు నిలుస్తుంది.అయితే “మధురవాణి “పాత్రే ఈ నాటకంలో సూత్రధారిలా కనిపిస్తుంది. గిరీశం మాయలో పడి గురజాడ మధురవాణిని కాస్తంత నిర్లక్ష్యం చేశారనిపిస్తుంది. నాటకం ఆసాంతంలో ఆమె వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించలేక పోయారు గురజాడ. అలాగని‌ పూర్తిగా నిర్లక్ష్యం కూడా చేయలేదు.మన చేతికి “తీగ”ఇచ్చి,ఇక మీ ఓపిక.(లాగినోళ్ళకి లాగినంత ) ఊహించుకున్నోళ్ళకి ‘ఊహించుకున్నంత’ అన్నట్లు మధురవాణిని తాకీ తాక కుండా చిత్రించారనిపిస్తోంది.

ఏదైతేనేం ?…..నా దృష్టిలో మధురవాణి “జీనియస్ “ లోకం తీరు తెలిసిన జాణ.కరటక శాస్త్రి ఆమెను “త్రిలోక సుందరి “ గా వర్ణించడాన్ని బట్టి ఆమె అందచందాల్ని అంచనా వెయ్యొచ్చు”. సొగసుకత్తెల అలకలో కూడా అదో శృంగారం “ అని రామప్ప పంతులన్నాడంటే మధురవాణి ఎంత “ సొగసైనదో ” ఊహించుకోవచ్చు. ఆమె అంత అందగత్తె కాబట్టే  మధురవాణి  నవ్వులో పట్టుబడాలని శిష్యుడు కోరుకోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు.

ఇక మధురవాణికి చదువు కూడా వుంది.గిరీశం దగ్గర కొంతకాలం ఇంగ్లీషు నేర్చుకోవడం వల్ల ఆమెకు విద్య కూడా వుందని నిర్థారించొచ్చు. ఆమెకు కేవలం ఇంగ్లీషే కాదు..సంస్కృతంలోని ‘ మృచ్ఛకటికం ‘కూడా తెలుసన్న విషయం నాటకం చదివిన వారికెవరికైనా తెలుస్తుంది. బుద్ధిమంతురాలైన తల్లి తర్ఫీదు వల్ల ఆమె విద్యావతి అయిందన్న ప్రస్తావన వుంది.” మా తల్లి ధర్మమా అని ,ఆమె నా చెవిలో గూడు కట్టుకొని బుద్ధులు చెప్పబట్టి “ తానింత దానైనట్లు” మధురవాణే చెబుతుంది.ఇవన్నీ ఓ ఎత్తయితే .. మధురవాణి వ్యక్తిత్వం ఒక యెత్తు.కన్యాశుల్కం నాటకంలో కులానికి తక్కువైనా గుణానికి ఎంతో యెక్కువ. ఈ నాటకంలో మధురవాణి కీలకమైన పాత్రే కాదు. మొత్తాన్నిఓ మలుపు తిప్పిన పాత్ర. ముఖ్యంగా ఆమె లౌక్యం గురించి చెప్పుకోవాలి.

గిరీశం కథను తారుమారు చేయాలని చూసినపుడు ఆమె చక్రం అడ్డువేసి బుచ్చమ్మను ప్రమాదం నుంచి కాపాడుతుంది.మరో మాట నాటకంలో పాత్రల మధ్య ‘చిక్కు ‘ వేసేది ఆమే, చిక్కు విడగొట్టేది ఆమే.రామప్ప పంతులు లౌక్యాన్ని,  కరటక శాస్త్రి కార్యాలోచనను,గిరీశం సమయ స్ఫూర్తిని మిక్స్ చేసి గ్రైండర్ లో వేసి నూరితే వచ్చిందే ‘ మధురవాణి ‘ పాత్ర.

‘వేశ్య ‘ అనగానే చులకన,హేయ భావం స్ఫురిస్తుంది. సమాజంలో వేశ్యలది అథమస్థానం. అయితే మధుర వాణిని చూసిన వారు ‌మాత్రం ‌ఈ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మార్చుకుంటారు.మధురవాణి వృత్తి చేత వేశ్య. అవకాశం వున్న మేరకు విటులవద్ద నుంచి‌ సొమ్ము లాగుతుంది.అది వేశ్యాధర్మం.అంత మాత్రం చేత మధురవాణికి దయాదాక్షిణ్యాలు సున్న అని తలవరాదు వేశ్యల్ని చులకనగాక చూసేవాళ్ళకు మధురవాణి మంచి చురకే అంటించింది.

“వేశ్య అనగానే అంత చులకనా ! పంతులు గారు .? సానిదానికి మాత్రం నీతి వుండొద్దా ? అంటూ…ఎదురు ప్రశ్నిస్తుంది.అసలు ఈ పాత్ర సృష్టి కర్త గురజాడ వారి అభిప్రాయం ఇది.గురజాడ వారు 1909 లో వంగవోలు ముని సుబ్రహ్మణ్యం కు రాసిన లేఖలో వేశ్యల పట్ల తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.”వేశ్యలో మానుషత్వాన్ని మరిచిపోకండి.ఆమె సుఖదుఃఖాలు మీవిగాని,నావిగాని అయిన సుఖదుఃఖాలకు ప్రాముఖ్యతలో తీసిపోవు.

సంఘంలో లెక్కలేని వ్యభిచారులైన ….భర్తలు,భార్యలూ వున్నారు.స్పష్టంగా తన వృత్తిని తెలియబరిచే వేశ్య వారందరికన్నా అథమురాలెట్లా అవుతుంది? పైగా వేశ్య ఏ వివాహ ప్రమాణాన్నీ భగ్నం చేయడం లేదు వీళ్ళవలె.”ఈ అభిప్రాయంతోనే మధురవాణి పాత్రను గురజాడ సృష్టించారు.అంతే కాదు కన్యాశుల్కంనాటకంలోమధురవాణి పాత్రకు ఎంత పెద్ద పీట వేశారో చూడండి.

“మధురవాణి అంటూ ఒక వేశ్యాశిఖామణి  ఈ కళింగ రాజ్యంలో వుండకపోతే భగవంతుడి సృష్టికి ఎంత లోపం వచ్చి వుండును‌”. అని ఓ సందర్భంలో… కరటక శాస్త్రి చేత చెప్పిస్తాడు గురజాడ. మరి సానిది అంటే ఒళ్ళమ్ముకునేదేనా? సాని దానికి మాత్రం ప్రేమ, వలపు వుండదా? అంటేదానికీ మధుర వాణినే ఉదాహరణగా నిలబెట్టాడు గురజాడ. సౌజన్యారావును మనసు పడుతుంది.ప్రేమిస్తుంది‌ మధురవాణి. అయితే తన ప్రేమను వలపును వ్యక్తీకరించడానికి వృత్తి న్యూనత అడ్డొస్తుంది.

అందుకే మనసులో ఇలా అనుకుంటుంది మధురవాణి.” సానిదాని వలపు మనసులోనే మణగాలి “ మధురవాణికి మనసూ,రూపం మాత్రమే కాదు.స్నేహం ,ప్రేమా కూడా వున్నాయి.శృంగారం వన్నెచెడిన దగ్గర్నుంచి బంగారం కదా తేటు తేవాలి? ఆ బంగారాన్ని కరటక శాస్త్రికి ధారపోసింది.ఆమె స్నేహం ఎన్ననేల? ఇక వలపా?పాపమామెకి బ్రతుకే లేదు.హెడ్డు కానిస్టేబుల్ దగ్గర్నుంచి సౌంజ్ఞ చేసేవాడే.అసిరిగాడి దగ్గర్నుంచి పంతులు ఇంట్లో లేనప్పుడల్లా కనిష్టీబు మధురవాణితో వుంటాడని చెప్పి నానా… యాగీ పెట్టే వారే.

ఈగల్లాగ ముసిరే మగరాజులందరిలోనూ ఆమె హృదయాన్ని చూరగొన్నది ఒక్క కరటకుడి శిష్యుడు మాత్రమే “ఈ చిల్లంగి కళ్ళు నీకేదేవుడిచ్చాడని ” వాడ్ని ముద్దు పెట్టుకుంటుంది మధురవాణి. సౌజన్యారావును పట్టి మంచి దాన్ననిపించుకుంది. మొత్తానికి ‘ సాని దానిక్కూడా నీతి వుంటుందన్న’ విషయాన్ని గురజాడవారు. ‘మధురవాణి ‘ పాత్ర ద్వారా బహుచక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు గురజాడ. దటీజ్ గురజాడ !!

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!