ఆ ముగ్గురూ రెండేసి చోట్ల పోటీ చేశారా ?

Sharing is Caring...

The family is not new to competing in two seats………………

నెహ్రు కుటుంబ సభ్యుల్లో … ఇందిర, సోనియా ..రాహుల్ గాంధీ రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేశారు. 1977లో ఇందిరాగాంధీ రాయబరేలీలో రాజ్‌నారాయణ చేతిలో ఓడిపోయిన తరువాత 1980 ఎన్నికల్లో ఆమె జాగ్రత్త పడ్డారు. నాటి  ఎన్నికల్లో ఆమె రాయబరేలీతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్ లోకసభ స్థానం నుంచి బరిలో దిగారు.

రెండు చోట్ల నుంచీ విజయం సాధించిన ఆమె రాయబరేలీ వదులుకుని మెదక్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఇందిర కోడలు  సోనియా గాంధీ 1999లో  రాజకీయాల్లో అడుగుపెట్టారు. అమేధీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు.

1998 ఎన్నికల్లో అమేధీ లో బీజేపీ విజయం సాధించింది.ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా సోనియా అమేధీ తో పాటు కర్నాటకలోని బళ్లారిని ఎంచుకుని బరిలోకి దిగారు.రెండు చోట్లా ఒక మోస్తరు మెజారిటీతో గెలిచిన సోనియా గాంధీ తన అత్త ఇందిర బాటలోనే సాగారు.

అమేధీ కి  ప్రాతినిధ్యం వహించడానికే నిర్ణయించుకుని బళ్లారిని వదులుకున్నారు. నాటి ఎన్నికల్లో బీజేపీ లోని కీలక నేత,ఆనాటి విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మ స్వరాజ్ బళ్లారిలో సోనియాపై పోటీ చేశారు. 56 వేల ఓట్ల తేడాతో సుష్మ ఓటమి పాలయ్యారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2019 లో తొలిసారి రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగారు. వాటిలో ఒకటి అమేధీ కాగా రెండోది కేరళ లోని వయనాడ్. అయితే అనూహ్యంగా అమేధీ లో ఓడి పోయారు. వయనాడ్ లో 4.31 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

2024 ఎన్నికల్లో వయనాడ్ తో పాటు సోనియా ప్రాతినిధ్యం వహించిన రాయబరేలీ నుంచి పోటీ చేశారు. సోనియా రాజ్యసభ కు వెళ్లిన నేపథ్యంలో రాయబరేలీ ని నిలుపుకోవాలని రాహుల్ అక్కడ పోటీ కి దిగారు. గాంధీ కుటుంబానికి అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాలతో భావోద్వేగ సంబంధాలున్నాయి.  

రాయ్‌బరేలీతో నెహ్రూ కుటుంబానికి నాలుగు తరాల బంధం ఉంది. అమేథీ సీటుతో నెహ్రూ కుటుంబానికి ఉన్న అనుబంధం ఈనాటిది కాదు.రాహుల్ తాత  ఫిరోజ్ గాంధీ రాయ్ బరేలీ నుండి 1952,57 ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు.

1967,71 ఎన్నికలలో ఇందిరా గాంధీ పోటీ చేసి గెలిచారు. 1977 లో అక్కడే ఓడిపోయారు.  1980లో తిరిగి గెలిచారు. మొదటి నుంచి ఇందిరా గాంధీ రాయ్ బరేలీని తన కార్యక్షేత్రంగా మలచుకున్నారు.

ఇక అమేధీ విషయానికొస్తే సంజయ్ గాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ, సోనియా ఇక్కడనుంచి పోటీ చేసి గెలిచారు. 2004.2009,2014 ఎన్నికల్లో పోటీ చేసిన గెలిచిన రాహుల్ గాంధీ 2019లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఆ ఓటమి మిగిల్చిన గాయం నుంచి కోలుకోవడానికి కొంత కాలం పట్టింది.

2024 ఎన్నికల విషయానికొస్తే రాహుల్ రాయబరేలీ, వాయనాడ్ లో పోటీ చేశారు. రాయబరేలీ లో 390,౦౩౦ ఓట్ల ఆధిక్యతతో,వయనాడ్ లో 364,422 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు. తర్వాత రాయబరేలీ ని ఉంచుకుని వయనాడ్ ని వదిలేశారు. ఆ పిదప జరిగిన ఉప ఎన్నికల్లో వయనాడ్ నుంచి రాహుల్ సోదరి ప్రియాంక 4,10,931ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు.

———- KNM

post up dated on may 29-2025

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!