లండన్ లో గాంధీని చూసేందుకు ఎగబడిన జనం!!

Sharing is Caring...

Gandhi London Tour ………………..

సెప్టెంబర్ 22 ..1931, తూర్పు లండన్ ప్రాంతం. తమ దేశ పరిపాలనను ధిక్కరిస్తున్న ఓ బానిస దేశం నుండి ఒంటి నిండా సరిగ్గా బట్టలు కూడా వేసుకోకుండా ఓ ముసలాయన వస్తే  నగరంలో ఆంగ్లేయులు ఆయన్ను చూడడానికి గుంపులు గుంపులుగా వచ్చారు. రోడ్ల మీద చాలా పద్ధతిగా ఉండే తమ బ్రిటీష్ కల్చర్ ను పక్కన పెట్టి ఆయన్ను జస్ట్ ఓసారి చూద్దాం అని తోసుకున్నారు.. ఆ ముసలాయనే గాంధీ. 

మహాత్మా గాంధీ 1931లో లండన్ పర్యటన సందర్భంగా తూర్పు లండన్ ప్రాంతాన్ని సందర్శించారు. భారత రాజ్యాంగ సంస్కరణలపై జరగనున్న రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం గాంధీని హిల్టన్ హోటల్ లో బస చేయమని కోరగా ఆయన సున్నితంగా తిరస్కరించారు.    

గాంధీ ఈస్ట్ ఎండ్‌లోని బ్రోమ్లీ-బై-బో కమ్యూనిటీ సెంటర్‌లోని కింగ్స్లీ హాల్‌లోని చిన్న రూమ్ లో బస చేశారు.కింగ్స్లీ హాల్ వద్ద, తూర్పు లండన్‌ లోని ఇతర ప్రాంతాలలో, కానింగ్ టౌన్ వంటి ప్రాంతాలలో, చార్లీ చాప్లిన్‌ను కలిసిన ప్రదేశంలో గాంధీని చూడటానికి పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. 

అప్పటికి సమాచార సాధనాలు లేవు. కానీ గాంధీ వచ్చాడన్న సమాచారం నగర ప్రజలకు తెలిసిపోయింది. దాంతో ఏ ప్రాంతానికి వెళ్లినా జనాలు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు.పేదలకు.. కార్మిక వర్గానికి దగ్గరగా ఉండటానికి .. వారి జీవితాలను అర్థం చేసుకోవడానికి గాంధీ ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఆ ప్రాంతంలో మార్నింగ్ వాక్ కి వెళ్లినపుడు పిల్లలతో..స్థానికులతో గాంధీ సంభాషించారు.

 ఆ ప్రాంత పేదరికాన్ని ప్రత్యక్షంగా గాంధీ చూసారు. కానింగ్ టౌన్ వంటి ప్రాంతాలలో భారత నాయకుడిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. పెద్ద సంఖ్యలో గాంధీని చూడటానికి జనాలు తరలి వచ్చారు.ఇక చార్లీ చాప్లిన్ తన సినిమా ‘సిటీ లైట్స్’ బ్రిటిష్ ప్రీమియర్ ప్రదర్శన కోసం ఆ నగరంలో ఉన్నాడు. అపుడే గాంధీ నగరానికి వచ్చారని తెలిసి .. ఆయనను కలవాలని అనుకున్నారు.

తెలిసిన వారి చేత గాంధీకి కబురు పంపారు.చాప్లిన్‌తో పరిచయం లేకపోవడం వల్ల మొదట్లో గాంధీ సంకోచించారు. కానీ చాప్లిన్‌ గురించి స్థానిక పెద్దలు గాంధీకి వివరించారు. గాంధీ ఒప్పుకోవడంతో తూర్పు లండన్‌లోని కానింగ్ టౌన్‌లోని ఒక సాధారణ గృహంలో వారిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు.   

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!