Historical Movie………………………………….
తమిళ హీరో అజిత్ చారిత్రక కథా చిత్రంలో నటించబోతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవల తమిళ దర్శకులు చారిత్రక కథాచిత్రాలపై కన్నేశారు. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం ఇటీవల పొన్నియిన్ సెల్వన్ 1, 2 చిత్రాలను రూపొందించి సక్సెస్ అయ్యారు. ఇందులో నటుడు జయం రవి రాజ రాజ చోళుడుగా నటించి మెప్పించారు.
చాలా కాలం క్రితమే దివంగత నడిగర్ తిలకం శివాజీ గణేషన్ రాజ రాజ చోళన్ చిత్రంలో తన గంభీరమైన నటనా కౌశలంతో ఆ పాత్రకు వన్నె తీసుకొచ్చారు. ప్రేక్షకులను మెప్పించారు. కాగా తాజాగా దర్శకుడు శంకర్ కూడా అదే బాటలో పయనించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈయన వెళ్పారి అనే చారిత్రాత్మక కథా చిత్రాన్ని తెరకెక్కించనున్నారనే ప్రచారం సాగుతోంది. రచయిత బాలకుమార్తో కలిసి కథా చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే హీరో అజిత్ కూడా చారిత్రక కథా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈయన ప్రస్తుతం విడాముయిర్చి చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. దీని తర్వాత రాజరాజ చోళన్ చిత్రంలో నటించవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి విష్ణువర్ధన్ దర్శకత్వం వహించనున్నారు.
అజిత్, విష్ణువర్దన్ కాంబినేషన్లో ఇంతకుముందు బిల్లా, ఆరంభం వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. కాగా ప్రస్తుతం దర్శకుడు విష్ణువర్దన్ హిందీలో సల్మాన్ ఖాన్ బంధువు ఒకరికి చిత్రం చేయడానికి కమిట్ అయ్యారని సమాచారం. అదే విధంగా అజిత్ తన 62వ చిత్రం విడాముయిర్చి చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఆ తరువాత రాజ రాజ చోళుడు ప్రాజెక్టు సెట్స్ పై వెళ్లవచ్చని అంటున్నారు.ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తారని అంటున్నారు.
దక్షిణ భారత దేశంలోని కావేరీ నది ఒడ్డున ఈ చోళ సామ్రాజ్యానికి పునాదులు పడ్డాయి. చోళ సామ్రాజ్యానికి తిరుచురాపల్లి రాజధాని కేంద్రం గా వెలుగొందింది. దక్షిణ భారత దేశంలో చోళ రాజులు ఎన్నో దేవాలయాలను నిర్మించారు.అద్భుత శిల్పసంపదకు అఆలయాలు నిలయాలు. చోళ వంశానికి చెందిన గొప్ప పాలకుడు రాజరాజ చోళుడు.

