Down Trend ……………………….
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కి చెందిన హెరిటేజ్ కంపెనీ షేరు ప్రస్తుతం 239 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి జైలుకి వెళ్ళాక హెరిటేజ్ షేర్ డౌన్ ట్రెండ్ లో పడింది.
సెప్టెంబర్ 8 న ఈ షేర్ ధర రూ 275 వద్ద కదలాడింది. బాబు అరెస్ట్ అయ్యాక రెండు రోజుల్లో దాదాపు 20% డౌన్ అయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ షేర్లలో మదుపు చేయడం రిస్క్ తో కూడిన వ్యవహారం.. ఏమాత్రం లాభదాయకం కాదు. అతి తక్కువ ధరల్లో గతంలో కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడం మంచిది.
ఈ కంపెనీలో ప్రమోటర్ల వాటా 41.58 శాతం మేరకు ఉంది. మంగళవారం ఒక్కరోజే 12.5 శాతం (రూ.32) క్షీణించి రూ.221 వద్ద ముగిసింది. దాదాపు 24 లక్షల షేర్లు చేతులు మారాయి. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ షేర్ల ధరపై తీవ్రప్రభావం చూపుతోంది. చంద్రబాబు కేసు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేవరకు షేర్ ధర పెరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
కాబట్టి ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించాలి. ధర బాగా తగ్గాక అప్పటి పరిస్థితులను బట్టి కొనుగోలు చేసే యోచన మంచిది. 1992లో ప్రారంభమై హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న హెరిటేజ్ సంస్థ.. దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఢిల్ల్లీ తదితర కేంద్రాల్లో వ్యాపారాలను నిర్వహిస్తోంది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2.25 వేల కోట్లు.