అనంత రూపాల్లో ఆదిశక్తి ! (1)

Sharing is Caring...

Kanchi Kamakshi  …………………………………………..

కామాక్షి దేవీ ఆలయం  అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతోంది.ఈ కామాక్షి దేవీ ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో ఉంది.  కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అని కూడా  అంటారు.   కా అంటే లక్ష్మీ మా అంటే సరస్వతి అక్షి (అంటే కన్ను)….  కామాక్షి దేవి అంటే లక్ష్మీదేవి, సరస్వతీ దేవిని  కన్నులు గా కలది అని అర్థం.

తమిళనాడులోని కాంచీపురం ఆలయాల నగరంగా ప్రసిద్ధి కెక్కింది. పుష్పేషు మల్లి.. పురుషేషు విష్ణు.. నారీషు రంభ.. నగరేషు కంచి.. అని మహాకవి కాళిదాసు వర్ణించారని చెబుతారు. పువ్వులలో అత్యున్నతమైనది మల్లె అని, పురుషులలో ఉత్తమోత్తముడు శ్రీ మహా విష్ణువు,  స్త్రీలలో అందమైన వనిత రంభ అని, నగరాల్లో మహోన్నతమైనది కాంచీపురం అని అర్ధం.

ఇక్కడ  శ్రీ కామాక్షి అమ్మవారికి కుడి ఎడమలుగా లక్ష్మీ, సరస్వతులు వింజామరలు వీస్తూ ఉంటారు.  పద్మాసనంలో కూర్చున్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం.అమ్మవారు కంచిలో మట్టితో చేసిన శివుని విగ్రహానికి పూజ చేయగా ..  అప్పుడు శివుడు పెద్ద అలలతో కంబనది రూపంలో వచ్చాడని పురాణ కథనం.

దేవిని పరీక్షించేందుకు అలల ఉద్ధృతిని పెంచగా ఆ దేవి తన రెండు చేతులలో విగ్రహాన్ని ఉంచుకుని అలల నుంచి కాపాడింది.   దేవి సూది మొనపై కూర్చొని పంచాగ్నుల మధ్య నిలబడి శివుడిని పూజించగా దానికి సంతసించి ఆమె ఎదుట ప్రత్యక్షమై దేవి ని వివాహమాడినట్టు చెబుతారు.

కామాక్షి దేవి ఆలయాన్ని గాయత్రీ మండపంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీకామాక్షి, శ్రీబిలహాసం, శ్రీచక్రం అనే మూడు రూపాలలో దర్శనమిస్తారు. ఆలయంలోని అమ్మవారి విగ్రహం పద్మాసనంపై కూర్చొనట్లు మలిచారు. దేవి తన చేతులలో  పాశం, అంకుశం, పుష్పబాణం, చెరకుగడలతో దర్శనమిస్తుంది. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం.

ఇక్కడి అమ్మవారు చాలా ఉగ్రరూపంలో బలి కోరుతుండటంతో.. ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు.  ఆ శ్రీచక్రానికి పూజలు జరుగుతాయి.అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం వీడి వెళ్లొద్దని ఆదిశంకరాచార్యులు అభ్యర్థించిన కారణంగా ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న ఆయన అనుమతి తీసుకుని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుందని మరో కథ ప్రాచుర్యంలో ఉంది.

ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో ఉంది. ఇక్కడ ప్రతిరోజూ ప్రాతఃకాలంలో శ్రీకామాక్షి దేవి ఉత్సవమూర్తిని మేలుకొలిపి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి ఉత్సవమూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకుని వస్తారు. ఆ తర్వాత అమ్మవారి ఎదురుగా గోపూజ చేస్తారు.ఈ కార్యక్రమం చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

గోపూజ అనంతరం అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతి ఇస్తారు. ఆ సమయంలో భక్తులు అమ్మవారి  దర్శనం చేసుకోవచ్చు. కామాక్షీదేవి ఇక్కడ ఐదు రూపాల్లో కొలువై ఉన్నారు. గాయత్రీ మంటపంలో కొలువై ఉన్న అమ్మవారిని మూలదేవతగా పరిగణిస్తారు. ఈ మండపంలో నాలుగు గోడలను నాలుగా వేదాలుగా, 24 స్తంభాలను గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలుగా భావిస్తారు. తపో కామాక్షి, అంజనా కామాక్షి, స్వర్ణ కామాక్షి, ఉత్సవ కామాక్షి అనే మరో నాలుగు రూపాల్లో ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్నారు.

అమ్మవారికి పౌర్ణమి రోజున నవావర్ణ పూజ, ప్రతీ బుధవారం చందనకాపు పూజలు చేస్తారు.  రోజూ మూడు సార్లు అభిషేకం నిర్వహిస్తారు. కుంకుమార్చన, దేవి అలంకరణ చేస్తారు. నవరాత్రులను మూడు విభాగాలుగా విభజించి అమ్మవారిని పూజిస్తారు. మొదటి మూడు రోజులు దుర్గాదేవిని,తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవిని, చివరి మూడు రోజులు సరస్వతీ దేవిని శాస్త్రోక్తంగా ఇక్కడ  ఆరాధిస్తారు. ఆ స‌మయంలో కన్య, సుహాసిని పూజ‌ల‌ను నిర్వహిస్తారు.

వీరిని పూజిస్తే అమ్మవారిని పూజించినట్లే అని భావిస్తారు. దేవీ నవరాత్రులలో ఏ కొత్త కార్యక్రమం మొదలుపెట్టినా అది విజయవంతం అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.కామాక్షి అమ్మవారికి ప్రతి ఏటా మార్చి నెలలో పెద్దఎత్తున రథోత్సవం నిర్వహిస్తారు. చుట్టుపక్కల నుంచి  భక్తులు తరలి వస్తుంటారు.

Pl.Read It Also…………..అనంత రూపాల్లో ఆదిశక్తి (2)https://tharjani.in/adishakti-in-many-forms/

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!