జంధ్యాల సినిమాల్లో మాస్టర్ పీస్ !!

Sharing is Caring...

Subramanyam Dogiparthi ……………………..

ఇది జంధ్యాల మార్కు హాస్యభరిత చిత్రం.పిసినారితనం పై ఫుల్ లెంగ్త్ నిఖార్సయిన హాస్యంతో సినిమా తీసి తెలుగు చలనచిత్ర రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయారు జంధ్యాల. ప్రముఖ రచయిత ఆదివిష్ణు నవల ‘సత్యం గారి ఇల్లు’ ఈ ‘అహ నా పెళ్ళంట’ సినిమాకు మాతృక . సినిమా కోసం కూర్పులు , చేర్పులు , మార్పులు చేసి తనదైన శైలిలో వండి ఫుల్ మీల్సుగా ప్రేక్షకులకు అందించారు. 

ఈ సినిమా అనగానే ఇప్పటికీ ఎప్పటికీ ఎవరికయినా చాలా పాత్రలు గుర్తుకొస్తాయి. వాటిల్లో సినిమా అంతా కనిపించే కొన్ని ప్రధాన పాత్రలు అయితే , మరి కొన్ని పాత్రలు కొన్ని సీన్లలో మాత్రమే కనిపించినా ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండిపోతాయి.

మచ్చుకు చివర్లో వచ్చే ‘చెవిటి మాలోకం’ పాత్రలో గుండు హనుమంతరావు..అంతా చెప్పించి ‘వినపడలే’ అంటూ కడుపుబ్బా నవ్వించే పాత్ర. విజయవాడ వాసి అయిన హనుమంతరావుకు ఇది రెండో సినిమా. గుర్తింపు వచ్చింది ఈ సినిమా ద్వారానే .

ముఖ్యంగా చెప్పుకోవలసింది పీనాసి లక్ష్మీపతి పాత్ర . అతనితో పాటు నౌకరు పాత్రలో అరగుండు గోవిందుగా బ్రహ్మానందం . కోట శ్రీనివాసరావు అప్పటికే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు . అయితే ఈ పాత్ర ఇంకెవరూ ఇలా వేయలేరు అన్నట్లుగా రక్తి కట్టించారు మాసిపోయిన పాత పంచె , చినిగిన బనీను , ఒకద్దం పగిలిపోయిన కళ్ళజోడు . ఆ ఆహార్యాన్ని డిజైన్ చేసిన జంధ్యాలకు హేట్సాఫ్ .

ఇంక మాతో పాటు చదువుకున్న బ్రహ్మానందం. విద్యార్ధిగా ఉన్నప్పుడే మిమిక్రి ఆర్టిస్టుగా పాపులరయిన బ్రహ్మానందం 1974 మే మాసంలో నా పెళ్లి రిసెప్షనుకు మా నరసరావుపేటలో మిమిక్రి ప్రోగ్రాం ఇచ్చారు . అత్తిలి కాలేజిలో తెలుగు లెక్చరరుగా , NSS ఆఫీసరుగా విద్యార్ధులలో పాపులర్ లెక్చరర్ అయి కూడా సినిమాల్లో చాన్సులు కోసం ప్రయత్నం ఆపలేదు .

ఈ సినిమాకు ముందు రెండు మూడు సినిమాల్లో దర్శనమిచ్చినా వెనక్కు తిరిగి చూసుకోవలసిన పరిస్థితి రాకుండా తెలుగు సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఈ సినిమా ద్వారానే పొందారు. ‘అరేయ్ పోతావురా , నాశనమైపోతావురా’ అంటూ ఎక్కడెక్కడి తిట్లని పోగేసి బుర్రలోనే తిట్టుకునే పాత్రను ఇరగతీసారు.. హేట్సాఫ్ .

హీరో రాజేంద్రప్రసాద్ . అప్పటికే సోలో హీరో అవతారంలో ప్రకాశిస్తున్న రాజేంద్రుడికి కూడా ఈ సినిమా చాలా గొప్ప పేరుని తెచ్చింది . కాలేజి కుర్రాడిగా,కోటీశ్వరుడి గారాల కొడుకుగా , గట్టి ప్రేమికుడిగా , తండ్రితో ఛాలెంజ్ చేసి అష్టకష్టాలు పడి ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవటానికి ఓ ప్రపంచ స్థాయి పీనాసి అవతారంగా, పలు షేడ్సులో అద్భుతంగా నటించారు రాజేంద్రప్రసాద్ .

కలెక్టర్ వెంకటరావుగా సుత్తి వీరభద్రరావు నటన అమోఘం . ముఖ్యంగా బావ లక్ష్మీపతి టీ అమ్ముకోవటం చూసి పిచ్చెక్కి బట్టలు చించుకుని సినిమా ఆఖరిదాకా పిచ్చోడిగానే చాలా బాగా నటించారు . మరో ప్రధాన పాత్ర కస్తూరి సత్యనారాయణ . మాట్లాడితే ‘మా తాతలు ముగ్గురు’ అంటూ ఫేమిలీ చరిత్ర మొదలు పెట్టి జనాన్ని విసిగించే పాత్రలో గొప్పగా నటించారు .

జంధ్యాల , విశ్వనాధ్ , వంశీ సినిమాల్లో నటులు కన్నా పాత్రలే ఎక్కువ గుర్తుండిపోతాయి . ఈ సినిమాలో అలాంటి పాత్రలు ఎన్నో తారసపడతాయి . అఖిల భారత పీనాసి సంఘం సభ్యులు , పెళ్ళి కొడుకులు , వాళ్ళ వెంట వచ్చే బంధువులు , వగైరా . జంధ్యాల ఈ సినిమా ద్వారా జనానికి చాలా ఊతపదాల్నే ఇచ్చారు . ముఖ్యంగా నాకేంటి , expect చేసా వంటి మాటలు . కాస్త అతిగా అనిపించినా పిసినారితనాన్ని చూపేందుకు జంధ్యాల తన మార్కు హాస్యాన్ని జొప్పించారు .

అగ్గిపుల్లలు ఏరుకోవటం , పేపర్లు చుట్టుకోవటం సీన్లు బాగుంటాయి. మరో హాస్యనటుడు బాబూ మోహన్ కి సాంకేతికంగా ఇది రెండో సినిమా అయినా బస్ డ్రైవర్ల యూనియన్ నాయకుడిగా బాగానే కనిపిస్తాడు .పాత్ర పరిధి తక్కువే అయినా నూతన ప్రసాద్ బాగా చేసాడు. ఇతర ప్రధాన పాత్రల్లో రాళ్ళపల్లి , డబ్బింగ్ జానకి , సుమిత్ర , సుత్తి వేలు , శుభలేఖ సుధాకర్ , విద్యాసాగర్ , సంధ్య , అశోక్ కుమార్ , మరెంతో మంది జూనియర్ ఆర్టిస్టులు నటించారు .

ఈ సినిమా అఖండ విజయానికి జంధ్యాల మాటలతో పాటు వేటూరి , జొన్నవిత్తుల , M R S శాస్త్రి పాటలు , రమేష్ నాయుడు సంగీతం,తార రఘుల నృత్య దర్శకత్వం,బాలసుబ్రమణ్యం సుశీలమ్మ వాణీజయరాం , నాగూర్ల గాత్రం దోహదపడ్డాయి . ముఖ్యంగా కస్తూరి రంగయ్య కరుణించవేమయ్యా డ్యూయెట్లో రాజేంద్రప్రసాద్ , రజనిల నృత్య సన్నివేశాలను చాలా అందంగా చిత్రీకరించారు.

అలాగే ‘ఇది శృంగార గంగావతరణం తొలి వలపు క్షీరాబ్ది మధనం ‘ డ్యూయెట్ కూడా చాలా బాగుంటుంది . ‘తిక్కన పాడింది భారతం మహాభారతం’ అంటూ సాగే డిస్కో డాన్సుని రాజేంద్రప్రసాద్ చక్కగా చేశారు. కుయిలీతో ‘స్వాగతం సంగీత సాధనం’ డ్యూయెట్ కూడా బాగుంటుంది . ఇంక పీనాసోళ్ళ గోల పాట పీనాసి అయినా సన్నాసి అయినా ఉన్నోడే మనిషి డబ్బున్నవాడే మనిషి గోలగోలగా సరదాగా ఉంటుంది.

మాయాబజార్ సినిమా అనగానే మనకు గుర్తుకొచ్చే పాటల్లో ఒకటి ‘అహ నా పెళ్ళంట’ . దాన్నే టైటిలుగా ఎంపిక చేసుకుని పూర్తి న్యాయాన్నిచేసారు జంధ్యాల . 16 లక్షల బడ్జెటుతో తీస్తే మూడు కోట్లో నాలుగు కోట్లో గ్రాస్ వచ్చిందని అంటారు. 15 సెంటర్లలో వంద రోజులు ఆడిన ఈ సినిమా కన్నడం లోకి కూడా ఛాలెంజ్ గోపాలకృష్ణ టైటిలుతో రీమేక్ అయింది . కన్నడంలో అనంత నాగ్ , అశ్విని , ముఖ్యమంత్రి చందు ప్రధాన పాత్రల్లో నటించారు.

సురేష్ ప్రొడక్షన్స్ బేనర్లో రామానాయుడు తీసిన ఈ సినిమా ఔట్ డోర్ షూటింగ్ అంతా షామీర్ పేటకు దగ్గరలో ఉన్న దేవర యంజాల్ అనే గ్రామంలో జరిగింది . సెట్లు వేయకుండా ఆ గ్రామంలో ఉన్న భవనాలను , దేవాలయ ప్రాంగణాలను వాడుకున్నారట .

1987 నవంబర్లో విడుదలయిన ఈ ఆల్ టైం కామెడీ సూపర్ హిట్టుకి ఇ వి వి సత్యనారాయణ అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసారు. మనకు ఇలాంటి పిసినారి సినిమా మరొకటి రేలంగి నరసింహారావు దర్శకత్వంలో రాజేంద్రప్రసాదే హీరోగా ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’ టైటిలుతో వచ్చి సక్సెస్ అయింది . సినిమాలు పిసినారితనం మీదే అయినా ప్రేక్షకులు ఆదరించారు వీటిని. 

 ఈ సినిమా యూట్యూబులో ఉంది . చూడండి , నవ్వండి , నవ్వించండి .. నవ్వు ఆరోగ్యకరం .

Tharjani ……………..

గయ్యాళి అనగానే నటి సూర్యకాంతం ఎలా గుర్తుకొస్తారో …. పిసినారి అనగానే ‘అహ నా పెళ్ళంట’లోని లక్ష్మిపతి పాత్ర గుర్తుకు వస్తుంది ఎవరికైనా. సినిమాలో ఎదురుగా కోడిని వేలాడ తీసి లొట్టలేసుకుంటూ అన్నం తినే పరమ పిసినారి పాత్రలో కోట జీవించారు.

ఆ సినిమాలో బ్రహ్మానందం ఒక చోట ‘పిసినారితనానికి పరాకాష్ట ఇది’ అని అంటాడు. నిజంగా అలాటి పాత్రే అది. పిసినారి పాత్రలు ఎన్ని వచ్చినా ఆ పాత్రదే అగ్రస్థానం. ఈ సినిమాలో పిసినారితనాన్ని ‘నభూతో న భవిష్యతి’ అన్న రీతిలో జంధ్యాల తెరకెక్కించారు. ఆ పాత్రను ఎప్పటికీ గుర్తుండి పోయేలా తీర్చిదిద్దిన క్రెడిట్, ఖ్యాతి జంధ్యాలదే. ఇక ఆపాత్రలో కోట కూడా జీవించారు.

చిన్ని క్రాఫ్ .. ముతకపంచె,మాసిన బనీను,పగిలిన కళ్ళద్దాలతో కోట వెరైటీ గెటప్ లో కనిపిస్తారు. జంధ్యాల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆ పాత్రకు అలా రూప కల్పన చేశారు. ఈ గెటప్ లో కోట కొంచెం రఫ్ గా కనిపించాలనే ఉద్దేశ్యంతో రోజూ మట్టిలో దొర్లించే వారట. మొదట్లో మామూలు కళ్ళద్దాలే కోట కు పెట్టాలనుకున్నారు.

పిసినారి తనం తాండవించాలంటే పగిలిన కళ్ళజోడు ఉంటే బాగుంటుందని భావించిన జంధ్యాల ఆ కళ్ళజోడుని తనే చిన్న రాయి పెట్టి పగలగొట్టారట. 20 రోజుల పాటు ఆ పగిలిన కళ్ళజోడుతోనే నటించారు కోట. అటు దర్శకుడు జంధ్యాల , ఇటు నటుడు కోట కష్టపడ్డారు కాబట్టి ఆ లక్ష్మిపతి పాత్ర చిరస్థాయిగా నిలిచి పోయింది.

పాత్ర ఏదైనా అందులో ఈజీగా ఇమిడిపోగల కొద్ది మంది నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు.అది గుర్తించారు కాబట్టే జంధ్యాల కోటను ఎంచుకున్నారు. ఈ పాత్రకు తొలుత రావుగోపాలరావు ను తీసుకోవాలని నిర్మాత రామానాయుడు భావించారు. అయితే కోట మాత్రమే కరెక్ట్ అని వాదించారు.చివరకు కోటనే ఎంపిక చేసుకున్నారు. జంధ్యాల అంచనా కరెక్ట్ అయిందని ఆరోజుల్లోనే రామానాయుడు మీడియాకు చెప్పారు.

ఇక ‘అహనాపెళ్ళంట’ సినిమాకు మూలం రచయిత ఆదివిష్ణు రాసిన నవల’సత్యం గారిల్లు’ . అందులో సత్యం పాత్రనే లక్ష్మీపతి గా మార్చారు జంధ్యాల. దానికి మెరుగులు దిద్దారు. సినిమాలో లక్ష్మీపతి ని చూడటానికి కొంతమంది వస్తారు.. వారు “అనంతపురం నుంచి వచ్చామండీ మిమ్మలను చూడటానికి” అంటారు. ‘అయితే నాకేంటి’ అంటాడు లక్ష్మీపతి . అంతలో బ్రహ్మానందం వచ్చి ‘చేతిలోబరువు పడితే కానీ మాట్లాడరండీ” అంటాడు.

ఇనుప ముక్కలు ఇంట్లోకి తేకండి అంటుంది భార్య. అపుడు లక్ష్మీ పతి ‘ఆ శని గాడు నా జోలికి రాడే’ అంటాడు. రాత్రిపూట బస్టాండ్లో టీ అమ్మే సీన్ సూపర్ కామెడీగా ఉంటుంది. అలాగే పేపర్ లుంగీ కట్టుకోవడం వంటి సన్నివేశాలు,డైలాగులు సినిమాలో బోలెడు. బ్రహ్మానందం., రాజేంద్రప్రసాద్. సుత్తి వీరభద్రరావు కాంబినేషన్ లో హాస్యం పొంగి పొర్లింది. అందుకే సినిమా సూపర్ హిట్ అయింది.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!