దర్శకుడిగా ఆయనది డిఫరెంట్ స్టయిల్ !

Sharing is Caring...

Films with social consciousness ………………

జన్మతః తమిళుడే అయినా తెలుగులో ఆయన చాలా పాపులర్ డైరెక్టర్. చాలామంది బాలచందర్ తెలుగు వాడే అనుకుంటారు. ఆయన తీసిన సినిమాలన్నీ సామాజిక స్పృహ గల కథాంశాలే. తాగునీటి సమస్య, నిరుద్యోగం,మధ్యతరగతి జీవితాలే ఆయన కథల నేపధ్యాలు. ఆయన చిత్రాల్లొ మహిళలే హీరోలు. ఆడవారి కష్టాలను ఎంతో హృద్యంగా తెరకెక్కించిన ఖ్యాతి ఆయనది.

సింధు భైరవి,తొలి కోడి కూసింది,అంతులేని కథ,ఆడవాళ్ళూ మీకు జోహార్లు, ఇది కథకాదు. గుప్పెడు మనసు . ఇలా ఆయన చిత్రాలన్ని మహిళల సమస్యలపై స్పందించి  తీసినవే. ఆయన  కథలు ఒక ప్రాంతానికి పరిమితమైనవి కావు. ఒక చిత్రానికి మరొక చిత్రానికి సంబంధంలేని కధాంశాలు ఎన్నుకోవడం బాలచందర్ ప్రత్యేకత. ఇక ఆయన తీసిన ‘తన్నీర్ తన్నీర్’ అప్పట్లో పెద్ద సంచలనం. ‘ఆకలి రాజ్యం’ అంతే.

బాలచందర్ సినిమాల్లో ‘అపూర్వ రాగంగళ్’ ఒకటి. 1975లో విడుదలైన ఈ తమిళ సినిమా 
‘తూర్పు పడమర’ పేరిట తెలుగులో నిర్మితమైంది.దాసరి నారాయణ రావు తెలుగు సినిమాకు దర్శకత్వం వహించారు.రెండు భాషల్లో హిట్ అయింది.తమిళ్ లో రజనీ కాంత్ కి ఇది తొలి సినిమా. కమల్ హీరో. తెలుగు లో నరసింహరాజు చేశారు.

తెలుగు తెరకు హీరోలు కమల్‌హాసన్, రజనీకాంత్ లను పరిచయం చేసింది ఆయనే. టీవీ సీరియల్‌నుంచి వెండితెరకు ఎదిగిన ప్రకాష్‌రాజ్, పృధ్వీరాజ్‌లు కూడా బాలచందర్ ద్వారానే చిత్ర పరిశ్రమకు వచ్చారు. సుజాత, సరితలు కూడా అంతే. ‘అవళ్‌ఒరు తొడర్‌ కదై’ చిత్రం ద్వారా 1974లో హీరోయిన్ సుజాత తమిళ చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు . ఇదే చిత్రం తెలుగులో 1976లో ‘అంతులేని కథ’గా జయప్రదతో నిర్మితమైంది.

ఈ సినిమాతో అక్కడ సుజాత ఇక్కడ జయప్రద టాప్ పొజిషన్ కు చేరుకున్నారు..’మరో చరిత్ర’ ద్వారా పరిచయమైన సరిత అప్పట్లో కుర్రకారు గుండెలను పిండేసింది. సినీ లోకానికి స్వరమాంత్రికుడు ఏఆర్ రెహమాన్ ను  పరిచయం చేసిన ఘనత కూడా బాలచందర్‌దే. ‘డ్యూయెట్’ చిత్రం ద్వారా ప్రకాశ్‌రాజ్‌ను వెలుగులోకి తెచ్చారు.

మన్మధలీల ,సత్తెకాలపు సత్తయ్య, అంతులేని కథ, మరో చరిత్ర, ఆకలి రాజ్యం, ఆడవాళ్లూ మీకు జోహార్లు,భలేకోడళ్ళు, తొలికోడి కూసింది, గుప్పెడు మనసు, కోకిలమ్మ, రుద్రవీణ, అందమైన అనుభవం లాంటి చిత్రాలెన్నోఆయన దర్శకత్వం లో వచ్చాయి.

ఆయనకు 1987లో ‘పద్మశ్రీ’ అవార్డు లభించింది. తమిళనాడు ప్రభుత్వం ఇచ్చే అత్యుత్తమ అవార్డు ‘కలై మా మణి’ బాలచందర్‌కు 1973లోనే లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులు ఆయన పలుసార్లు అందుకున్నారు. బాలచందర్ ప్రతిభను గుర్తించి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. 

ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ అన్ని వర్గాలను ఆకట్టుకున్నాయి. ఆయన సినిమాల్లో పాటలన్ని హిట్ సాంగ్స్. ఒకటి అరా సినిమాలు తప్పితే ఎమ్మెస్ విశ్వనాథన్ ఆయనకు పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్. తెలుగులో ఆత్రేయ చేత పాటలు, గణేష్ పాత్రో చేత మాటలు రాయించుకునే వారు.

బాలచందర్ తీసిన తెలుగు సినిమాలన్నీ దాదాపు తమిళంలో ఆయన తీసినవే. రీమేక్ చేసేవారు ఆయన. నేరుగా తెలుగులో తీసిన సినిమాలు తక్కువే. అందులో ఒకటి మరో చరిత్ర. ఆ సినిమా ను హిందీలో’ ఏక్ దూజేకేలియే’ గా తీశారు.రెండు భాషల్లోనూ సూపర్ హిట్ అయింది.

ఇక చిరంజీవి బాలచందర్ తో తీసిన ‘రుద్రవీణ’ పెద్దగా ఆడలేదు. కోకిలమ్మ అంతే. ‘రుద్రవీణ’ తమిళ్ లో కమల్ హాసన్ తో తీశారు. అక్కడ జనానికి ఎక్కలేదు. బాలచందర్ 1930 సంవత్సరంలో తంజావూరు దగ్గర  గ్రామంలో జన్మించారు. తొలుత అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలో పనిచేసేవారు.  

అక్కడ ఉద్యోగం చేస్తూనే పలు నాటకాలు రాశారు.ఎంజీఆర్‌ కథానాయకుడిగా నటించిన దైవతాయ్‌ చిత్రానికి సంభాషణల రచయితగా చలనచిత్ర రంగంలో ప్రస్థానం ప్రారంభించాడు. 45 ఏళ్లలో తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో 100కు పైగా చిత్రాలను రూపొందించారు. 2014 లో ఆయన కన్నుమూసారు. 

—–KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!