Great research………………….
మధ్యధరా సముద్రం దిగువన మట్టి నిక్షేపాల క్రింద ఉన్న రహదారి బయట పడింది. క్రొయేషియా తీరానికి ఆవల ఉన్న ఆడ్రియాటిక్ సముద్రగర్భంలో శాస్త్రవేత్తలు కొన్నాళ్ల క్రితం అన్వేషణలు జరుపుతున్నప్పుడు ఆశ్చర్యకరంగా ఈ పురాతన రహదారి కనిపించింది.
మధ్యధరా సముద్రంలో కోర్కులా ద్వీపం సమీపంలో మునిగిపోయిన క్రోయులా దీవిని అనుసంధానిస్తూ ఈ పురాతన రహదారిని నిర్మించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ఇది కొత్తరాతి యుగంలోని మంచుయుగం చివరి రోజులకు చెందినది కావచ్చని, కనీసం ఏడువేల ఏళ్ల కిందట దీనిని నిర్మించి ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ రహదారిని నాలుగు మీటర్ల వెడల్పు లో జాగ్రత్తగా పేర్చబడిన రాతి పలకలతో రూపొందించారు. సముద్ర గర్భానికి పదహారు అడుగుల లోతున దీనిని కనుగొన్నారు. జదార్ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజిస్ట్ మేట్ పారికా నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం సముద్రంలో దాగి ఉన్న ఈ పురాతన రహదారిని కనుగొన్నది.
అలాగే ఈ రహదారిపై రాతి గొడ్డళ్లు, పలుగులను,తిరుగలి రాళ్ల శకలాలు దొరికాయి. వాటిని కార్బన్ డేటింగ్ ద్వారా పరీక్షించి, ఇవి క్రీస్తుపూర్వం 4,900 నాటివని శాస్త్రవేత్తలు తేల్చారు. రాతి గొడ్డళ్లను ఉపయోగించి జంతు బలులు ఇచ్చిన ఆనవాళ్లు కూడా ఇక్కడ లభించాయి.
ఈ రహదారి నియోలిథిక్ స్థావరంలో భాగం, ఇక్కడ 5000 BCE ప్రాంతంలో హ్వార్ సంస్కృతి కి చెందిన ప్రజలు నివసించారని అంటున్నారు. అక్కడి ప్రజలలో నైపుణ్యం కలిగిన రైతులు, పశువుల కాపరులు ఉన్నారని చెబుతున్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో ప్రజలు వ్యవసాయం చేసిన జాడలున్నాయని కనుగొన్నారు.పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. ముందు ముందు మరిన్ని విశేషాలు వెలుగు చూడవచ్చు.


