Opertion Sindoor ……………………….
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత భద్రతా దళాలు ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట జరిపిన ప్రతీకార దాడుల్లో జైష్-ఎ-మొహమ్మద్ అధిపతి మౌలానా మసూద్ అజార్ కి వ్యక్తిగతంగా నష్టం జరిగింది.
ఈ దాడుల్లో తన కుటుంబ సభ్యులు పది మంది, నలుగురు సన్నిహితులు మరణించారని మసూద్ అజార్ అంగీకరించారని వార్తా సంస్థలు చెబుతున్నాయి. ఈ దాడులు పక్క వ్యూహంతోనే జరిగాయి.ఈ దాడులు పాకిస్తాన్లోని బహవల్పూర్ లోని జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కార్యాలయం,జామియా మసీదు ను లక్ష్యంగా చేసుకున్నాయి.
మరణించిన వారిలో మసూద్ అజార్ అక్క, ఆమె భర్త, మేనల్లుడు,అతని భార్య, మేనకోడలు, వారి కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు ఉన్నారు.ఇండియా మోస్ట్ వాంటెడ్ పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజార్కు బలమైన స్థావరం బహవల్పూర్.
రా ఏజంట్ల ద్వారా సమాచారం సేకరించి దాడులకు ఆర్మీ అధికారులు ప్లాన్ చేశారు.పహాల్గామ్ దాడుల తర్వాత లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్ సంస్థల స్థావరాల సమాచారం తెప్పించుకుని .. నేతల కదలికలను గమనిస్తూ ఈ దాడులకు వ్యూహ రచన చేశారు.
మసూద్కు పాకిస్తాన్ లోని బహవల్పూర్లో రెండు ఇళ్ళు ఉన్నాయి. ఒకటి ఉస్మాన్-ఓ-అలీ మసీదు పక్కనే ఉంది. మసూద్ రెండవ ఇల్లు కూడా మొదటి ఇంటి నుండి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది జామియా మసీదు పక్కనే ఉంది. అంతేకాకుండా, బహవల్పూర్లో ఉగ్రవాద సంస్థకు నాలుగు శిక్షణా కేంద్రాలు ఉన్నాయని సమాచారం.
బహవల్పూర్లో పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం,వైమానిక స్థావరం కూడా ఉన్నాయి. ఇక్కడికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ శిక్షణా శిబిరం ఉంది. ఇవన్నీ తెలుసుకునే వ్యూహాత్మకంగా దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో అత్యంత కచ్చితంగా లక్ష్యాలను ఛేదించే 24 రకాల ఆయుధాలను ఆర్మీ వినియోగించింది.
వీటిల్లో క్షిపణులు, బాంబులు, ఆత్మాహుతి డ్రోన్లు ఉన్నాయి. ఈ దాడులలో మొత్తం మీద తొమ్మిది ఉగ్రక్యాంప్లను ఏకకాలంలో ధ్వంసం చేశారు . దాదాపు 70 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని సమాచారం. మరో 60 మంది వరకు గాయపడ్డారు.
ఈ దాడి కోసం భారత్ ఇంటెలిజెన్స్ అధికారులు ఉపగ్రహ చిత్రాలను, హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఉగ్రవాదులు వాడే కమ్యూనికేషన్ పరికరాలను విశ్లేషించి.. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా స్థావరాలను గుర్తించారు.
ఇక మసూద్ అజార్ గురించి చెప్పుకోవాలంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఇతగాడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. 56 ఏళ్ల మసూద్ అజార్, 2001 పార్లమెంటు దాడి, 2008 ముంబై దాడులు, 2016 పఠాన్కోట్ దాడి, 2019 పుల్వామా బాంబు దాడితో సహా భారతదేశంలో జరిగిన అనేక ప్రధాన ఉగ్రవాద దాడులలో కీలక పాత్ర పోషించారు.
పాకిస్తాన్లో ఇతను ఉంటున్నప్పటికీ ఇస్లామాబాద్ అతని ఆచూకీ గురించి ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు. పహల్గామ్ దాడుల తరువాత మసూద్ అజార్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లారని అంటున్నారు. భారత్ తదుపరి టార్గెట్ అతనే. భారత్ దాడుల లక్ష్యంలో మసూద్ కూడా ఉన్నారు. జస్ట్ మిస్ అయ్యాడు అంతే.