These stations are run by women………………………
రాజస్థాన్లో జైపూర్లోని గాంధీ నగర్ రైల్వేస్టేషన్ భారతదేశంలోనే మొట్టమొదటి నాన్-సబర్బన్ రైల్వే స్టేషన్గా నిలిచింది. ఈ రైల్వే స్టేషన్ ను 24×7 పూర్తిగా మహిళా సిబ్బంది నిర్వహిస్తున్నారు.
స్టేషన్ కార్యకలాపాలు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ను కూడా వారే నిర్వహిస్తున్నారు. మహిళలకు సాధికారత కల్పించడం, మహిళల పట్ల సమాజం లో సానుకూల మార్పు తీసుకురావడం లక్ష్యంగా రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ రైల్వే స్టేషన్లో 40 మంది మహిళా సిబ్బంది పనిచేసున్నారు. పురుషుల కంటే సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. ఒక నెలలో టిక్కెట్లు లేని 520 మంది ప్రయాణికులను పట్టుకున్నారు.ఒక రోజులో 50 రైళ్లు ఈ రైల్వే స్టేషన్ గుండా వెళతాయి. 24 రైళ్లు ఇక్కడ ఆగుతాయి.
ప్రతిరోజూ దాదాపు 7000 మంది ప్రయాణికుల రాకపోకలు ఇక్కడి నుంచి సాగుతాయి. మహిళా సిబ్బంది వేగవంతమైన సేవలు అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.స్టేషన్ లో చిన్న క్యూలు మాత్రమే కనిపిస్తాయి. CCTV కెమెరాల నిర్వహణ, మెరుగైన శుభ్రత అందించడంలో ప్రయాణికులను ఆకట్టుకుంటున్నారు.
మహిళా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి, ఇటీవల రైల్వే స్టేషన్లో మహిళా పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేశారు.మహిళా ఉద్యోగులను శక్తివంతం చేసే లక్ష్యంతో భారతీయ రైల్వే ఈ చొరవ చూపడం మంచి పరిణామమే.
మహిళలకు ఏ బాధ్యతలు అప్పగించినా చక్కగా నిర్వహించగలరని గాంధీ నగర్ రైల్వే స్టేషన్ మహిళా సిబ్బంది నిరూపించారు. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం కేవలం 27% మాత్రమే. మరిన్ని కీలక రంగాల్లో వారి పాత్రను పెంచడానికి ప్రభుత్వాలు పూనుకొవాలి.
ముంబై జోన్లోని ‘మాతుంగా’ రైల్వే స్టేషన్ను కూడా పూర్తిగా మహిళా సిబ్బంది నిర్వహిస్తున్నారు. ఇది సబర్బన్ కేటగిరీలో ఉంది. అలాగే దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ లో ‘గుండ్ల పోచంపల్లి’ రైల్వే స్టేషన్, ‘బేగంపేట’ రైల్వే స్టేషన్, ‘విద్యానగర్’ స్టేషన్, విజయవాడ డివిజన్లోని ‘రామవరప్పాడు’ రైల్వే స్టేషన్, గుంటూరు డివిజన్లోని ‘న్యూ గుంటూరు’ రైల్వే స్టేషన్, గుంతకల్ డివిజన్లోని ‘చంద్రగిరి’ రైల్వే స్టేషన్ ను మహిళా సిబ్బందే నిర్వహిస్తున్నారు.