Govardhan Gande……………… …………………………….
డ్రాగన్ బుద్ధి ఎప్పటికి మారదు. మన ప్రయోజనాలకు భంగం కలిగించడం..అంతర్జాతీయంగా అడ్డుకునే యత్నాలు చేయడం, అందుకు అనుగుణం గా బెదిరించడం , భయపెట్టడం, కవ్వింపు చర్యలకు దిగడం,లేని వివాదాన్ని సృష్టించడం, గోరంత విషయాన్నీ కొండంత చేయడం ఇవన్నీ దుర్భుద్ధితో కూడినవే. ఎన్నిసార్లు ఉతికి ఆరేసినా బుద్ధి మారదు.
భయపెట్టడం ద్వారా ఒక మనిషినిగాని,ఒక జాతిని గాని ఎంతో కాలం తన ఆధీనంలో నిలబెట్టుకోవడం అసాధ్యమనే సాధారణ సూత్రం ఆకళింపు చేసుకోలేని నాయకత్వం ఈ రోజు చైనా ను ఏలుతున్నది. దశాబ్దాలుగా చైనా వైఖరి ని గమనించిన వారికి ఈ అభిప్రాయం తప్పకుండా కలుగుతుంది.
136 కోట్ల జనాభా,విశాలమైన భూభాగం కలిగిన పొరుగు దేశం ఇండియా పై చైనా వైఖరి ఇది. శాస్త్ర,సాంకేతిక రంగాల్లో చైనా తో పోల్చితే ఎంతో వెనకబడి ఉన్న ఇండియా అనేక విషయాల్లో ఆధారపడి ఉంది. చైనా ఉత్పత్తి చేసే అనేక వినియోగ వస్తువులకు ఇండియానే అతి పెద్ద మార్కెట్. తన జేబులు నింపుకోగలిగిన ఇంత పెద్ద మార్కెట్ చైనా కు ప్రపంచ మంతా గాలించినా దొరకదు.ఇలాంటి మార్కెట్ ను భయపెట్టి గుప్పిట్లో పెట్టుకోవాలనే చైనా ధోరణిని సహించేంత అర్భక దేశం ఇండియా అని చైనా భావిస్తోంది.
అనవసరంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచి,భయపెట్టి పెద్దన్నలా ప్రవర్తిస్తే ఎవరు మాత్రం ఎందుకు ఊరుకుంటారు.ఇండియా చుట్టూ ఉన్న చిన్న చిన్న దేశాలను ప్రలోభాలతో లొంగదీసుకొని ఉసిగొలిపితే సహించే స్థితి లో ఇండియా లేదనే వాస్తవాన్ని గ్రహించి మసలుకుంటే చైనా వ్యాపార ప్రయోజనాలు కాపాడుకోవచ్చు.అలా కాక భయపెట్టి యుద్ధం ద్వారానే లొంగ దీసుకోవాలనే ప్రయత్నాలు చేస్తే చైనా విస్తరణ కాంక్షకు బలమైన జవాబు ఇచ్చే రోజు ఏదో నాటికి వస్తుంది.
పలు దేశాలు ఇండియా కు మద్దతు ప్రకటించిన స్థితి ని గమనించి ఇండియా ఒంటరి దేశం కాదనే గ్రహించినా బుద్ధి మార్చుకోదు. భారత్ కూడా ఇతర దేశాలపై ఆధారపడకుండా పరిశోధన అభివృద్ధి రంగాల్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేయాలి.కీలక రంగాల్లోప్రభుత్వం పెట్టుబడులు మరింత పెంచాలి. అపుడే పరాధీనత నుంచి బయటపడగలం.