Subramanyam Dogiparthi ………………………………….
సంగీత సాహిత్యాల సమ్మేళవింపు . నాకయితే ఓ దృశ్య కావ్యం . నాకిష్టమైన సినిమాలలో ఒకటి 1969 లో వచ్చిన ఈ ‘ఏకవీర’ సినిమా . తెలుగులో తొలి జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారి రెండో నవల ఇది. 1930 దశకంలో ‘భారతి’ మాస పత్రికలో సీరియల్ గా ప్రచురితమై, బ్రహ్మాండమైన పేరు తెచ్చుకుంది.
1960 ప్రాంతంలో NTR , ANR లతో ఈ నవల సినిమాగా రాబోతుందని తెగ చెప్పుకునే వారు.చివరకు సి యస్ రావు దర్శకత్వంలో NTR , కాంతారావులతో నిర్మించారు.కాంతారావే కరెక్ట్ . విశ్వనాథ వారికి ‘ఏకవీర’ అనే పేరు ఎలా స్ఫురించిందో ! అద్భుతమైన పేరు . అష్టాదశ పీఠాలలో ఒకటి ఏకవీర. అయినా ఎందుకనో చాలా చాలా అరుదుగా వింటుంటాం ఈ పేరు.
మరో జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత సి నారాయణరెడ్డి సంభాషణలు వ్రాసిన మొదటి చిత్రం. ఆ మాటలు సినిమా మాటల్లాగా ఉండవు. ఓ కావ్యంలోని మాటల్లాగా ఉంటాయి. ఈ సినిమాలో మెచ్చుకోవలసింది సంగీత, సాహిత్యాలు. కె వి మహదేవన్ సంగీతంలో పాటలన్నీ ఇప్పటికీ హిట్టే. నాకు అత్యంత ఇష్టమైన పాటలు సి నారాయణరెడ్డి వ్రాసిన ‘తోటలో నారాజు తొంగి చూసెను నాడు’ , దేవులపల్లి వారు వ్రాసిన ‘ప్రతీ రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి’ పాటలు.
మిగిలిన పాటలు ‘ఒక దీపం వెలిగింది ఒక రూపం వెలిసింది’ , ‘కలువ పూల చెంత చేరి’ , ‘నీ పేరు తలచినా చాలు’ , ‘ఔనే చెలియా సరి సరి’ చాలా శ్రావ్యంగా ఉంటాయి . ఏ పారిజాతములనీయగలనో సఖీ పద్యం కూడా నాకిష్టం.
నాకు బాగా నచ్చిన నృత్యం రాజసులోచన భామాకలాపం కూచిపూడి నృత్య ప్రదర్శన . భామనే సత్యభామనే నృత్యం. ఈ నృత్యంతోనే ఆవిడకు బయట కూడా పేరొచ్చింది . వెంపటి సత్యం నృత్య దర్శకులు .
ఇంత గొప్ప కళాఖండం ప్రేక్షకులకు ఎందుకనో నచ్చలేదు.ఫస్ట్ రిలీజ్ అప్పుడు ఆడలేదు . రిపీట్ రన్సుల్లో వసూళ్లు ఎలా ఉన్నా జనం చూసారు.విశ్వనాథ సత్యనారాయణ గారికి ఈ చిత్ర రూపం సంతృప్తి కలిగించలేదని అంటారు.
నవలను సినిమాకు అనుగుణంగా చాలా మార్పులు చేశారు.ఆ మార్పుల్లో కీలకమైన అనేకమైన విషయాలు వదిలివేశారు..ఈ క్రమంలో నవలలోని పాత్ర చిత్రణకూ, సినిమాలోని పాత్ర చిత్రణకూ సినిమాలో క్లైమాక్సు మొదలుకొని ఎన్నో విషయాల్లో మార్పులు వచ్చాయి.
ఇదంతా ఎలా ఉన్నప్పటికీ సినిమా ఓ దృశ్యకావ్యమే. ‘ఏకవీర’గా కె ఆర్ విజయ , మీనాక్షిగా జమున , వీరభూపతిగా కాంతారావు గొప్పగా నటించారు. ప్రత్యేకంగా చెప్పుకోవలసింది కుట్టాన్ సేతుపతిగా NTR నటన. ధీరోదాత్తంగా , ప్రేమికుడిగా , భగ్న ప్రేమికుడిగా అద్భుతంగా నటించారు. చాలా అందంగా కనిపిస్తారు.
16వ శతాబ్దం ముత్తు కృష్ణప్ప నాయకుడు మధురై ని పాలించే కాలం నాటి కథ ఇది. నాయక మహారాజు గారి ప్రధాన మంత్రులలో ఒకడైన ఉదయన్ సేతుపతి కుమారుడు కుట్టాన్ సేతుపతి, సామాన్యుడైన అతని స్నేహితుడు వీర భూపతిల జీవితాన్ని చిత్రించారీ నవలలో.
ఏది ఏమయినా ఇప్పటి తరంలో చూడని వారెవరయినా ఉంటే మాత్రం తప్పక చూడండి . మిస్ కానే కావద్దు. కళా పిపాస లేకపోతే ఎలా? ముఖ్యంగా పాటలు,మాటలు… సినిమా యూట్యూబులో ఉంది.
నేనీ సినిమాను గుంటూరు హరిహర మహల్లో చూసా . ఒక నరసరావుపేట మిత్రుడి పెళ్ళికి గుంటూరు రావటం జరిగింది.ఆరోజే రిలీజ్ . అందులో NTR సినిమా. చొక్కాలు చినిగినా చూడాలి కదా !
ఇంత గొప్ప నవలను ఎవరయినా ఇప్పటి సాంకేతికతో మళ్ళా ఓ దృశ్య కావ్యంగా తెలుగు ప్రేక్షకులకు చూపించాలని నా ఆకాంక్ష.ఆది పురుషుడు, శాకుంతలం లాగా చెడదొబ్బకుండా పధ్ధతిగా తీసి తెలుగు వారికి అందించటం విశ్వనాథ వారికి సమర్పించే నివాళి.ఏ నిర్మాత,ఏ దర్శకుడికి మనసు కలుగుతుందో !