పాండవులు “జమ్మి” మీదే ఆయుధాలు ఎందుకు దాచారు?

Sharing is Caring...

Great Tree………………………….

పాండవులు జమ్మిచెట్టు మీదే ఎందుకు ఆయుధాలు దాచారు? అనేక వృక్షాలు ఉన్నాయి కదా అనే సందేహానికి కూడా వివరణ ఉంది.జమ్మిచెట్టు వేదకాలం నాటి నుంచీ పరమ పూజ్యమైన వృక్షం. దీనికి ఉన్న ప్రాధాన్యత హిందూధర్మంలో మరో చెట్టుకులేదు. రామాయణంలో కూడా శమీ వృక్షప్రస్తావన ఉంది. రాముడు కూడా అర్చించాడని కొందరు చెబుతుంటారు.

పాండవులు దీన్ని ఆరాధించారనడంలో ఎటువంటి సందేహంలేదు. వీరులకు అతి ముఖ్యమైంది ప్రాణం కన్నా ఆయుధం. నిజమైన వీరుడు తన ఆయుధాన్ని వీడి ఉండడు. అలాగే నేలమీద కూడా పెట్టడు. దానికి అనేక కారణాలు ఉంటాయి. 

ఈ నేపథ్యంలో పాండవులు వనవాసం చేసి అజ్ఞాతవాసానికి వెళ్ళే టప్పుడు తమ ఆయుధాలు ఎక్కడ ఉంచాలి అనే సంశయం కలిగింది. ఎందుకంటే అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలు తమతోనే ఉంచుకుంటే వాటి కారణంగా తాము దొరికిపోయే అవకాశం ఉంది. అందులోనూ అర్జునుడు, భీముడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడి ఆయుధాలు దైవదత్తాలు.

అవి చూడగానే ఇట్టే అవి భూమి మీద తయారైనవి కాదని తెలిసిపోయే అవకాశం ఉంది. కనుక తప్పని సరి పరిస్థితుల్లో వీటిని ఎక్కడైనా దాచాలి. ఎక్కడ దాచాలి అనేది ప్రశ్న వచ్చింది.దీనికి అర్జునుడు ముందుగా సర్వేచేసి ఒక శ్మశానాన్ని నిర్ణయిస్తాడు. దాని పక్కనే ఉన్న అతిపెద్దశాఖలు ఉన్న జమ్మిచెట్టు ఎంచుకుంటాడు. దైవదత్తమైన ఆయుధాలు మోయాలంటే అది దైవవృక్షమే అవ్వాలి. కనుక దాన్ని ఎంచుకుంటాడు.

నిజానికి అర్జునుడు కూడా గాండీవాన్ని ఎత్తలేడు. కేవలం శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల దాన్ని ప్రయోగించగలుగుతాడు. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన వెంటనే అర్జునుడు గాండీవాన్ని ప్రయోగించి బాణాలు వేయలేక కిరాతకులతో  కర్రసాము చేస్తూ యుద్దం చేయబోతాడు. వారు అర్జునుడ్ని చిన్నపిల్లాడిని గెలిచినట్టు గెలిచి యాదవ కాంతల్ని ఎత్తుకుపోతారు. కనుక అంత మహిమ ఉన్న ఆయుధాలు మోయాలంటే తప్పనిసరిగా అది దివ్యవృక్షమే అయిఉండాలి.

సరే ఇక్కడ మరో ప్రశ్న రావాలి. చెట్టుమీదే ఎందుకు పెట్టాలి? దీనికి కారణం ముందే చెప్పుకున్నాము. భూమి మీద ఆయుధాలు ఉంచరాదు. అంతేకాదు. అరణ్యంలో భూమి మీద ఆయుధాలు ఉంచితే పందులు పందికొక్కులు వంటివి తవ్వి వాటిని బయటకు తీసే ప్రమాదం ఉంది. వర్షం పడినప్పుడు భూమి పీల్చుకునే నీరు ఆయుధాలను ఏడాది పాటు నష్టపరచవచ్చు. కనుక భూమి మీద పెట్టలేరు, భూమి లోపలా పెట్టలేరు. కనుకనే చెట్టుపై పెట్టాల్సివచ్చింది.

మరో ముఖ్యవిషయం ఏమిటంటే జమ్మిచెట్టు దాదాపుగా అడవుల్లో చాలా ఎత్తుగా ఉంటాయి. వాటిని ఎక్కడానికి వీలు లేకుండా ఉంటాయి. ఇది కేవలం జంతు, వృక్షశాస్త్రవేత్తలకు మాత్రమే తెలుసు. ఎందుకంటే జమ్మి చెట్టును తినని శాకాహార జంతువు చాలా అరుదు. గడ్డితినే అన్ని జంతువులు జమ్మిని తింటాయి. కనుక జమ్మిని ఏ జంతువుకా జంతువు అందినంత తినేస్తే ఎవరికీ అందనంత ఎత్తున అది పెరుగుతుంది.

అంటే ఒంటెలూ జిరాఫీలు వంటివి కూడా తినేయగా వాటికి కూడా అందనంత ఎత్తుగా మాను పెరుగి అక్కడ నుంచీ పెరిగిన కొమ్మలే చెట్టుకు నిలుస్తాయి. ఇక్కడ ఉన్న మరో విశేషం ఏమిటంటే అది అందరికీ పూజనీయమైన చెట్టే అయినా శ్మశానం పక్కనే ఉంది కనుక ఎక్కువ మంది తరచూ పూజించరు.

బ్రతికి ఉన్నవాడు శ్మశానానికి వెళ్ళడానికి ఇష్టపడడు. చచ్చినవాడు చేటు చేసే అవకాశం లేదు. ఇదికాక పల్లెకార్ల మనస్తత్త్వం అర్జునుడు చాలా బాగా పట్టాడు. నేటికీ వేపమొక్కలు పెరిగే దశలో ఉన్నప్పుడు దానికి ఒక చెప్పు వేళ్ళాడు దీస్తారు. చెప్పు అవమానకరమైంది. బుద్దిఉన్న వాడు ఎవడూ ఒకడి కాలి చెప్పు వేళ్ళాడుతున్న చెట్టు కొమ్మ విరిచి నోట్లో పెట్టుకోడు. నేటికీ నిలిచి ఉన్న ఇటువంటి పౌరుషాన్ని అర్జునుడు ఆనాడు వాడాడు.

ఆయుధాలు అన్నీ ఒక శవం ఆకారంలో మూటగట్టి చెట్టుపై పెట్టించాడు. మూటలోకి నీటి చుక్క కూడా జారకుండా కట్టారు. ఎప్పుడైతే చెట్టు మీద శవం ఉందో ఆ చెట్టును ఎవరూ నరికే అవకాశంలేదు. అందులోనూ దానికి శవం నుంచీ వచ్చే వాసనలు వెదజల్లే ఏర్పాటు కూడా చేశారు. ఇది చాలదన్నట్లు అది తమ తల్లి శవం అనీ తమ ఆచారం ప్రకారం శవాన్ని చెట్టుమీద ఉంచాలని ప్రచారం చేశారు.

పూర్వం ప్రాణం ఉన్న మనిషికి ఇచ్చిన గౌరవం చనిపోయిన శవానికి కూడా ఇచ్చేవారు. కనుక ఎవరూ శవం ఉన్న చెట్టు మీద అనుమానం వచ్చే అవకాశం లేదు.

జమ్మిచెట్టే ఎంచుకోవడానికి మరో కారణం ఉత్తరాదిలో జమ్మిని కలప కోసం నరకరు. అది ప్రకృతి సహజంగా మరణించిన తరువాతే కలప సేకరిస్తారు. మరో విచిత్రమైన అంశంమేమంటే అది పొలం మధ్యలో పుట్టినా దాన్ని కదల్చరు. అలాగే పెరగనిస్తారు. నేటికీ ఆచరించే మరో విశేషం ఏమిటంటే జమ్మి కలప ఉపయోగించి మంచం తయారు చేసి దానిమీద శయనించరు. అంతగా దాన్ని ఆరాధిస్తారు.

——————  Sk. Zakeer

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!