Terror attacks………………..
అల్ ఖైదా ఉగ్రవాదులు అమెరికాను ఒక దశలో వణికించారు. సరిగ్గా 23 ఏళ్ళ క్రితం సెప్టెంబర్ 11 న జరిగిన దాడులతో అమెరికా బెంబేలెత్తి పోయింది. ఈ దాడులను అమెరికా ఊహించలేదు.
ఒసామా బిన్ లాడెన్ చేయించిన ఈ దాడులనే టెర్రర్ అటాక్స్ అని కూడా అంటారు. ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్ అల్-ఖైదా కి చెందిన ఆత్మాహుతి దళం చేసిన ఈ దాడుల్లో దాదాపు 3,000 మంది మరణించారు. 6,000 మందికి పైగా గాయపడ్డారు.
1941 లో పెర్ల్ హార్బర్ పై బాంబు దాడి తర్వాత అమెరికాను ఈ దాడులు వణికించాయి. మరేమైనా జరగబోతున్నదా అని వెంటనే అప్రమత్తమైంది. కానీ ఆ తర్వాత ఏమి జరగలేదు. ఈ దాడుల మూలంగా అమెరికా ఆర్ధిక వ్యవస్థ కూడా దెబ్బ తిన్నది. ఆ సమయంలో జార్జి w బుష్ అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నారు.
సెప్టెంబర్ 11, 2001 న ఏమి జరిగింది ?
@ పందొమ్మిది మంది అల్-ఖైదా ఉగ్రవాదులు నాలుగు యుఎస్ ప్యాసింజర్ విమానాలను హైజాక్ చేశారు.
@ ముందే ప్లాన్ చేసుకున్న ప్రకారం ఉదయం 8 —- 9 గంటల మధ్య రెండు విమానాలు మాన్హాటన్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ కాంప్లెక్స్ టవర్లను ఢీకొన్నాయి. అంతే … రెండు గంటల్లో 110 అంతస్తుల టవర్లు రెండూ కుప్ప కూలిపోయాయి. లోపల ఉన్న జనాలు హాహాకారాలు చేస్తూ బయట కొచ్చారు. బయట కొస్తూనే చనిపోయారు.
@ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కాంప్లెక్స్లోని ఇతర భవనాలన్ని నేలమట్టమైనాయి.
@ ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (WTC) మాన్హాటన్లో16 ఎకరాల స్థలంలో నిర్మించిన వాణిజ్య సముదాయం, ఇందులో ఏడు భవనాలు, పెద్ద ప్లాజా..ఆరు భవనాలను కలిపే అండర్ గ్రౌండ్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి. దాడిలో ఈ మొత్తం కాంప్లెక్స్ ధ్వంసం అయింది.
@ మూడవ విమానం వెళ్లి వర్జీనియాలోని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ – పెంటగాన్ ప్రధాన కార్యాలయాన్ని ఢీ కొన్నది. @ నాల్గవ విమానం పెన్సిల్వేనియాలోని మైదానంలో కూలిపోయింది. ప్రయాణీకులు హైజాకర్లతో పోరాడటానికి ప్రయత్నించారు.కానీ విఫలమైనారు.
@ ఆ తర్వాత అల్-ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ను అప్పగించాలన్న అమెరికా డిమాండ్లను తాలిబన్లు లెక్క చేయలేదు. దాంతో ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికా “వార్ ఆన్ టెర్రర్” ప్రారంభించింది.
@ వరల్డ్ ట్రేడ్ సెంటర్ విధ్వంసం ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసింది ..ఆ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై కూడా పడింది.
@ వరల్డ్ ట్రేడ్ సెంటర్ శిధిలాలను శుభ్రం చేసే కార్యక్రమం మే 2002 నాటికి పూర్తయింది, పెంటగాన్ భవనాన్ని ఒక సంవత్సరం లోపల మరమ్మతు చేశారు.
@ 2006 లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ సైట్లో వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణం మొదలైంది.ఇది 2014లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
@ సెప్టెంబర్ 11 దాడుల బాధితుల జ్ఞాపకార్థం అనేక స్మారక చిహ్నాలను నిర్మించారు.
@ ప్రతి ఏటా సెప్టెంబర్ 11 న బాధితులకు ప్రజలు నివాళులర్పిస్తారు ..ఉగ్రవాదంపై పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తారు.
@ అల్-ఖైదా ఉగ్రవాద సంస్థ. దీనికి అంతర్జాతీయ నెట్ వర్క్ ఉంది.1980 దశకంలో ఒసామా బిన్ లాడెన్ దీన్ని స్థాపించారు. మే 1, 2011 న యుఎస్ మిలిటరీ ఆపరేషన్లో లాడెన్ మరణించారు.