NTR playing a different role ………………
‘జన్మ మెత్తితిరా అనుభవించితిరా… బ్రతుకు సమరములో పండిపోయితిరా….
మంచి తెలిసి మానవుడుగ మారినానురా….. జన్మ మెత్తితిరా అనుభవించితిరా’ .. ‘గుడిగంటలు’ సినిమా కోసం అనిశెట్టి రాసిన గీతమిది.. ఘంటసాల అద్భుతంగా పాడారు. తెరపై ఎన్టీఆర్ అంతకంటే అద్భుతంగా నటించారు. డైరెక్టర్ మధుసూధనరావు మరీ అద్భుతంగా చిత్రీకరించారు.
గుడిగంటలు సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను కేరళ తీరంలోని వర్కెలా వద్ద చిత్రీకరించారు. అక్కడి సముద్రపు గట్టు కొండపక్కన వందలాది అడుగుల పాటు కోసినట్టుగా కనిపిస్తుంది. అక్కడే క్లైమాక్స్ కు సంబంధించిన ఉద్వేగభరితమైన, నాటకీయమైన సన్నివేశాలు, పాట తీశారు.
పై పాటను కూడా అక్కడే తీశారు. సాహిత్య పరంగా, సంగీతపరంగా, చిత్రీకరణ పరంగా, అభినయ పరంగా ఒక అత్యుత్తమ గీతంగా ఈ పాటను చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ది ఒక డిఫరెంట్ క్యారెక్టర్.ఒక మనిషిలో భిన్నపార్శ్వాలను ఆ పాత్ర చూపుతుంది. మంచి, చెడూ, కోపం, ప్రేమ, కరుణ,అసూయ, శాడిజం వంటి విభిన్న లక్షణాలు కలబోసిన పాత్ర.
ఆపాత్రకు అనుగుణంగా వివిధ సన్నివేశాలలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపారు. విభిన్నఛాయలున్నఆ పాత్రలో ఎన్టీఆర్ జీవించారు. కథ ప్రారంభంలో పాత్రకు … ముగింపు లో పరివర్తన చెందిన పాత్రకు మధ్య వైవిధ్యాన్నికూడా బాగా చూపించారు. మంచి పాత్ర దొరికితే ఎన్టీఆర్ కూడా బాగా చేస్తారు. దర్శకుడు మధుసూదన రావు కూడా ఆపాత్రను అవగాహన చేసుకుని చక్కగా తెరకెక్కించారు.
చిన్నప్పటి నేరం వయసుతోపాటే మనసులో పెరిగి పెద్దదవుతుంది. ఈ అంతర్మధనాన్ని తనదైన హావభావాలతో ఎన్టీఆర్ ఆకట్టుకునేలా అభినయించారు. గది తలుపులు వేసుకుని తన కిష్టమైన కస్తూరి బొమ్మను చూసుకుంటుంటాడు. ఆల్బమ్ లో చని పోయిన తన మిత్రుడి ఫోటో ను చూసి బాధపడుతుంటాడు.తనలో తానే మాట్లాడుకుంటుంటాడు.
ఎన్టీఆర్ ఉన్న ప్రతి సన్నివేశంలో ఆయన పాత్రలో లీనమై నటించాడు. ఎన్టీఆర్ మామూలుగా సిగరెట్లు కాల్చరు. కానీ ‘గుడిగంటలు’ హీరో పాత్ర లో ఎపుడూ సిగరెట్ తాగుతూనే కనబడతారు. ఈ సినిమాకోసం ఆయన ప్రతిరోజూ రెండు డబ్బాల సిగరెట్లను కాల్చారట.
తాను సాధించాల్సింది వేరొకరు సాధిస్తే ఎన్టీఆర్ కి కోపమొస్తుంది. టెన్నిస్ ఆటలో తాను వెనుక పడగా అక్కడ ఉన్న ప్రేక్షకులు జగ్గయ్య ను మెచ్చుకుంటూ చప్పట్లు కొడతారు. దాంతో కోపంతో బ్యాట్ ను విరగ దీసి పక్కన పడేస్తాడు. అలాగే ఆట గెలిచి మెమొంటో స్వీకరించి జగ్గయ్య చేతిలో పెడుతూ నీ వల్లనే నేను ఆట గెలిచాను అనే సీన్…ఎన్టీఆర్ చంపడానికి వచ్చిన మిక్కిలినేని మాటలకు రియాక్ట్ అయిన సన్నివేశం,జగ్గయ్య కి రక్తం ఇచ్చి బ్రతికించే సీన్, ..జగ్గయ్య తల్లికి అనారోగ్యంలో సేవ చేసే సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
సినిమా మొత్తం మీద ఇలాంటి సీన్లు బోలెడున్నాయి. అందుకే జనాలకు బాగా నచ్చింది. ముళ్ళపూడి వెంకట రమణ డైలాగులు బాగుంటాయి. ‘మనం చేసిన సేవ వల్ల ఒకరు సుఖంగా, సంతోషంగా ఉంటే అప్పుడు కలిగే ఆత్మతృప్తికీ, ఆనందానికీ హద్దులుండవు’. ‘పెదవుల మీది చిరునవ్వు అల్పమైన సుఖానికీ, సంతోషానికీ పుడుతుంది. ఇట్టే చెరిగిపోతుంది’ వంటి సంభాషణలు పాత్రోచితంగా ఉన్నాయి.
అప్పట్లో రీమేక్ సినిమాలు చేయడంలో మధుసూధనరావు దిట్ట. అందుకే నిర్మాతలు నహతా,డూండీలు ఆయనను డైరెక్టర్ గా పెట్టుకున్నారు. అంతకు ముందు కూడా వీరి కాంబినేషన్ లో రక్త సంబంధం పెద్ద హిట్ అయింది.మధుసూధనరావు పని తీరు నచ్చే ఎన్టీఆర్ ఆయన డైరెక్షన్ లో చేశారు. వారిద్దరికీ సినిమా పరిశ్రమకు రాకుముందు నుంచే పరిచయాలున్నాయి.
జగ్గయ్యది సెకండ్ హీరో పాత్ర.. ఆయన కూడా బాగానే చేసాడు. కృష్ణకుమారి కథా నాయిక..పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. రమణారెడ్డి, రేలంగి ఈ సినిమాలో తండ్రి కొడుకులు గా నటించారు. వాసంతి,గిరిజ చిన్న రోల్స్ లో చేశారు.
ఈ సినిమాకు మాతృక తమిళ సినిమా ‘ఆలయమణి’ .. తెలుగు వెర్షన్ లో స్వల్ప మార్పులు చేశారు. తమిళం లో శివాజీ గణేశన్ చేసిన పాత్రనే తెలుగులో ఎన్టీఆర్ చేశారు. 1964 వ సంవత్సరానికి గాను ఈ చిత్రానికి తృతీయ ఉత్తమ చిత్రంగా కాంస్య నంది అవార్డు ప్రకటించింది. యూట్యూబ్ లో ఈ సినిమా ఉంది. చూసిన వారు ,చూడని వారు చూడవచ్చు.