వార్ జోన్ లో బలమైన దేశాలు !!

Sharing is Caring...

వివేక్ లంకమల………………

రష్యా vs ఉక్రెయిన్,ఇజ్రాయెల్ vs పాలస్తీనా,ఇండియా vs పాకిస్తాన్, ఇజ్రాయెల్ vs ఇరాన్ Basically world at war zone.
External affairs ఆసక్తిగా ఉంటాయి. ఏ రెండు దేశాల మధ్యన యుద్ధ వాతావరణం  నెలకొన్నా వెంటనే వాలిపోతుంది అమెరికా. పైకి పెద్దరికం చేస్తున్నట్టు చెప్పుకున్నా అంతిమంగా అమెరికాకు కావాలసింది ఆయుధాల వ్యాపారం. యుద్ధం ఆగితే వ్యాపారం అనుకున్నంతగా జరగదు కాబట్టి యుద్ధమే కావాలి.

ఒకప్పుడు ప్రపంచానికి సాంకేతికతను పరిచయం చేసిన రష్యా ఎందుకో వెనకబడుతోంది.బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన చైనా అవకాశం కోసం ఎదురుచూస్తోంది.ఏ వైపు నెగ్గితే అమెరికా పెద్దరికం తాను పొందొచ్చు అనేది వీరి ఆత్రం. అందరూ సమానత్వమే అనే కమ్యూనిస్ట్ సిద్ధాంతాల మీద పునాదులు ఏర్పరుచుకుని, నిలబడి ఇప్పుడు పూర్తి వ్యాపార సామ్రాజ్యంగా తనను తాను మార్చుకుంటోంది.

వీటన్నింటి మధ్యన యుద్ధం పట్ల ఇండియా తీరు ఆశ్చర్యకరం.అటు పూర్తిగా యుద్ధాన్నీ కోరుకోలేదు, యుద్ధంలో ఒక దేశాన్ని మనస్పూర్తిగా సపోర్ట్ చెయ్యనూ లేదు, అలాగని ఇరు దేశాల మధ్యన శాంతినీ కోరుకోలేదు.యుద్ధాన్ని కోరుకుంటే, ఏకపక్షంగా ఒక దేశాన్ని సపోర్ట్ చేస్తే గెలిపించేంత టెక్నాలజీ లేదు, యుద్ధానంతర కల్లోల పరిస్థితులు సరిచెయ్యగలిగే ఆర్థిక శక్తీ లేదు, అలాగని యుద్ధానికావల శాంతిని కోరుకోలిగే మానసిక బలం లేక మధ్యలో గిలగిల్లాడిపోతోంది.

యుద్ధం, External affairs విషయంలో భారతదేశ పాలకులతో పాటు ప్రజలకు కూడా నిర్థిష్టమైన అభిప్రాయాలు లేనట్టున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ లో ఇజ్రాయెల్ గెలవాలని, ఇరాన్ సమూలంగా నాశనం అవ్వాలని మెజార్టీ ఇండియన్స్ కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియా, మీడియా ప్రభావం వల్ల పల్లెల్లో కూడా వార్ గురించే మాట్లాడుతున్నారు.

‘ఇండియా మీద ఏ దేశం దాడికి దిగినా మా క్షిపణులు సిద్ధంగా ఉంటాయి’ అని గతంలో, ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రకటించిన ప్రేమ ఒక కారణమైతే,సెక్యులర్, అలీనోద్యమ భావజాలం దాటి కొత్తగా హిందుత్వం హిందుత్వం అంటూ ఊగిపోతున్న భారతదేశ తక్షణ భావోద్వేగం ముస్లిం దేశమైన ఇరాన్ నాశనాన్ని కోరుకోవడం మరొక కారణం.మతం కోణం పక్కనపెడితే నిజానికి ఇరాన్ పట్ల ఈ దేశ ప్రజలు అంత కక్ష పెంచుకుని ఉండకూడదు.

వ్యక్తులు, కుటుంబాలతో సహా ప్రపంచం మొత్తం తన బలాన్ని డబ్బులో వెతుక్కుంటోంది. డాలర్ తో Conversion Rate క్షణ క్షణానికీ మారిపోతూ ఉంటుంది. ఈరోజు 1 డాలర్ = 86.75 రూపాయలు.ఆర్థికంగా భారతదేశం వెలిగిపోతోంది, జపాన్ ను దాటి నాలుగవ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగిన భారత్ అంటూ నేషనల్ మీడియా, దేశ పాలకులు ఒకటే ఊదరగొడుతున్నా కూడా డాలర్ ముందు నిలబడలేకపోతోంది అని ఎప్పుడైనా గమనించారా?

పెట్రోలియం, ఎలక్ట్రానిక్స్ మొదలు కెమికల్స్ వరకూ భారతదేశం చేసుకుంటున్న ఇంపోర్ట్స్.ఇండియాకు 7516 కి.మీ. పొడవైన తీర రేఖ(ప్రస్తుతం అది 11098 కి.మీ అంటున్నారు) ఉంది. ఎంత సిలికా ఉండొచ్చు? దాని ఆధారంగా ఎంత మంచి ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ తయారు చెయ్యొచ్చు?కానీ భారతదేశానికి ఆ స్పృహ ఉండదు. తత్ఫలితంగా చిన్న ఎలక్ట్రానిక్ చిప్ కూడా చైనా నుంచే రావాలి. దానికి డాలర్లలోనే చెల్లించాలి.

భారతదేశంలో కెమికల్ ఇండస్ట్రీ నెలల వ్యవధిలో కరోనా వ్యాక్సిన్ తయారు చేసేంత వటవృక్షంలా ఎదిగింది. మరి ఆ కెమికల్స్ ముడి సరుకులు ఎక్కడినుంచి వస్తున్నాయి? అది కూడా చైనానే. మళ్ళీ డాలర్సే.140 కోట్ల భారతదేశంలో మనిషికి ఒక బైక్,కారు ఉన్న దేశంలో పెట్రోలియం ప్రాడక్ట్స్ ఎంత వాడకం ఉంటుంది. దాని క్రూడ్ ఆయిల్ కు ఎంతెంత ఖర్చు చేస్తోందనేది సామాన్యుని ఊహకు కూడా అందదు.

క్రూడ్ ఆయిల్ మన దగ్గర లేదు. ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంత వాడకానికి ఎన్ని డాలర్లు వెచ్చించాలి? ఇక ప్రపంచం ముందు రూపాయి నిలబడేదెక్కడ? దిన దినమూ పతనమవ్వదంటే అవ్వదా?ఇలాంటి స్థితిలో రూపాయిని నిలబెట్టగలిగే సాహసం చేసింది ఇరాన్ మాత్రమే. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలన్నీ డాలర్స్ లో చెల్లింపుల కోసం పట్టుబడితే ఇరాన్ ఒక్కటే భారతదేశం నుంచి రూపాయి మారకాన్ని అంగీకరించింది.

ప్రతిగా ఇరాన్ కోసం ఇండియా చాబహర్ పోర్ట్ కట్టిస్తుంది. మిడిల్ ఈస్ట్ దేశాల వాణిజ్యానికి ఇదొక కీ పోర్ట్.అదే జరిగి ఉండుంటే రూపాయి విలువ ప్రపంచ మార్కెట్ లో ఇంత దిగజారేలా ఉండుండేది కాదు.ఇజ్రాయెల్ ఇస్తానన్న సైనిక సహాయం భారత్ కు అవసరం పడొచ్చు, పడకపోవచ్చు గానీ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ కోసం ఇరాన్ అంగీకరించిన రూపాయి మారకం మాత్రం ఈ దేశానికి ఒక అడ్వాంటేజ్ అయ్యుండేది.

ఈ ఒక్క విషయాన్ని పట్టుకుని ఇండియా ఇరాన్ కు సపోర్ట్ చెయ్యాలని నా ఉద్దేశ్యం కాదు గానీ ఇండియా ఇరాన్ నాశనాన్ని కోరుకోవడానికి వారి ఇస్లాం మతం ఒక్కటే కారణం కాకూడదు.External Affairs లో మనకు తెలియని సున్నిత అంశాలు చాలా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో సమర్థవంతమైన పాలకులే దేశాన్ని, దేశ ప్రజలను సరిగ్గా ముందుకు నడపగలరు.

కానీ ఈ దేశ దరిద్రం ఏంటంటే సమాజం తాలూకు ప్రతీది  మీడియా, సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ఎవరికి కావలసినట్టు వాళ్లు ట్యూన్ చేసుకుని రాజకీయమనే భావోద్వేగ వ్యాపారాన్ని స్వేచ్ఛగా నడిపించుకుంటున్నారు. ఇరాన్ అయినా ఇజ్రాయెల్ అయినా ఇండియా అయినా పాకిస్తాన్ అయినా మతం, వర్గం, వర్ణం తదితర ఫిల్టర్లు తీసేసిన తర్వాత వాళ్లూ మనలాంటి మనుషులే.

పాలకుల పంతాల కోసం, మన భావోద్వేగాల కోసం యుద్ధాన్నిఆహ్వానించడం(అది కూడా మనకు ప్రత్యక్ష పరోక్ష ప్రభావం ఉండని యుద్ధం) అంటే ఎదుటి మనిషి మరణాన్ని కోరుకోవడమే. At the end War is a destruction, whatever the form it may come and whomever between.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!