చురకలు వేయడంలో దిట్ట !!

Sharing is Caring...

Nandiraju Radhakrishna…………………

రోశయ్య .. నిబద్ధత! కార్యదక్షత ! తెలుగుదనం వెల్లివిరిసే పంచె కట్టు! ఆచి తూచి అడుగులు! కొండంత ఓర్పు! ఎదుటి వారి మాటలు వినే నేర్పు! రాజకీయ చాతుర్యం ఆయన స్వార్జితం. సామాజిక అంశాలలో నిగూఢమైన మేధావి! గొప్ప ఆర్ధిక శాస్త్రవేత్త కాకున్నా, క్రమశిక్షణ గల పొదుపరైన వ్యాపారి.! అజాత శత్రువు!

ప్రజాప్రతినిధిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా… ఏ హోదాలో ఉన్నా విలువలతో కూడిన వ్యక్తిత్వం ఆయన సొత్తు! ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వద్దనైనా, నెంబర్ టు గానే విరాజిల్లారు. ప్రజల తరఫున నాయకుడుగా ప్రాంతాలకు అతీతంగా తన విలువ నిలబెట్టు కున్నారు. ఆయనే కొణిజేటి రోశయ్య

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన రోశయ్య పాలనా దక్షుడిగా, ఆర్థికవేత్తగా పేరుగాంచారు. అజాత శత్రువుగా ఆయన రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయం. జాతీయ నాయకుల బహిరంగ సభల ప్రసంగాలను అలవోకగా తేటతెలుగులో అనువదించి ప్రశంసలందుకున్న చాణక్యుడు.

కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడిగా పేరుగాంచిన రోశయ్య రాజకీయ జీవితం ఆ పార్టీతో ప్రారంభం కాలేదు. తొలుత ఆయన స్వతంత్ర పార్టీ సభ్యుడిగా ఉన్నారు. దివంగత ఆచార్య ఎన్జీ రంగా అంటే ఆయనకు అంతులేని అభిమానం. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.

హోదా ఉన్నా, లేకున్నా.. సంస్కృతీ సాంప్రదాయాలు, తెలుగు భాష పరిరక్షణకు విశేష కృషి చేశారు! తెలుగునేల నాలుగు చెరగులా ఎక్కడ సంగీత, సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినా వీలున్నప్పుడల్లా హాజరవుతూ సాంస్కృతిక రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన రాజనీతిజ్ఞుడు. రాజకీయ చతురుడు.

ఆయనెప్పుడూ ఏ పదవిని ఆశించ లేదు. ఏ పదవి ఆయన్ని వరించినా పొంగి పోనూ లేదు. తనకు లభించిన పదవికి ఆయన న్యాయం చేశారు. ఏ అవినీతి ఆరోపణ ఆయన్ని చుట్టు ముట్ట లేదు. విలువలతో కూడిన రాజకీయాలు చేసినవారిలో రోశయ్య బహుశా ఆఖరి తరం మనిషి కావచ్చు.

88 సంవత్సరాల నిండు జీవితం జీవించి, పార్టీల కతీతంగా అందరి మన్ననలూ పొందిన ఆయన, విద్యార్థి ఉద్యమాల నుండి గవర్నర్‌ దాకా అనేక పదవులను సమర్థంగా నిర్వహించి అన్నిచోట్లా తన విధులకు న్యాయం చేశారు. వయోభారం వున్నప్పటికీ, చివరి వరకూ, ఎవరు వచ్చి అడిగినా వారికి తగిన సలహాలనిచ్చేవారు.

ప్రతి పక్షాన్ని వంగ్యోక్తులతో ఎండగట్టడంలో ఆయన మేటి. నిజాయితీకి నిలువెత్తు సంతకం. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ గుంటూరు జిల్లాలోని వేమూరు లో 1933 జులై 4న రోశయ్య వైశ్య సామాజికవర్గం ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు.

గ్రూపు విభేదాలు, ముఠా తగాదాలతో నిత్యం తలమునకలయ్యే కాంగ్రెస్ లో ఏ గ్రూపూ లేకుండా తామరాకుపై నీటిబొట్టు మాదిరి, ఏ మకిలీ అటకుండా.. ఇన్ని దశాబ్దాలు వివాద రహితునిగా నెగ్గుకు రావడం సామాన్య విషయం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రిగా దీర్ఘకాలం పనిచేసిన అనుభవం.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితంగా ఉండేవారు. ఆయన మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఎక్కువ కాలం పదవిలో కొనసాగలేకపోయారు. తర్వాత కర్ణాటక, తమిళనాడు గవర్నర్‌గానూ సేవలందించారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రతిభావంతుడైన , కీలకమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన రాజకీయ దురంధరుడు. రాజకీయ జీవితం ఆద్యంతం అత్యున్నత విలువలకు కట్టుబడి ఉండటం ఆయన గొప్పదనం. గుంటూరు హిందూ కాలేజీలో కామర్స్ విద్యను అభ్యసించిన ఆయనలో. చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఆయన విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యారు.

రోశయ్యలో ఒక మంచి వక్త ఉన్నారు. దాదాపు 60 ఏళ్ల పైగా ఆయన రాజకీయ జీవితం సాగింది. 1950లో శివలక్ష్మిని ఆయన పెళ్లాడారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె.రోశయ్య 1968, 1974, 1980, 2009లో ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. 1989, 2004 లో చీరాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978-79లో శాసనమండలిలో ప్రతిపక్షనేతగా ఆయన వ్యవహరించారు.

రాజకీయ జీవితంలో ఆర్ అండ్ బీ, హౌసింగ్, రవాణా, హోమ్, ఆర్థిక, ప్రణాళిక, సభావ్యవహారాల శాఖల మంత్రి బాధ్యతలను నిర్వహించారు. అసెంబ్లీలో, శాసనమండలిలో ఆయన ప్రసంగాలు సందర్బోచితంగా చెణుకులు, ఎదుటి పార్టీ వారిని ఇరుకున పెట్టేవిగా ఉండేవి 1994 నుంచి 1996 వరకు ఏపీసీసీ అధ్యక్షుడిగా కూడా రోశయ్య వ్యవహరించారు. అంతేకాదు 1998లో నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

తనకు ఎంతో ఇష్టమైన ఆర్థికశాఖ మంత్రిగా సుదీర్ఘకాలం పాటు సేవలందించడం విశేషం. ఆర్థికమంత్రిగా అనుభవం రోశయ్య సొంతం. 16 సార్లు ఆయన బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇందులో వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనది. ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయ భాస్కరరెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆయన వేర్వేరు మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. 

ఆంధ్ర యూనివర్శిటీ 2007లో ఆయనను గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. వైయస్ రాజశేఖరరెడ్డి మృతి తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 15వ సీఎంగా 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబర్ 24 వరకు బాధ్యతలను నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ మలి దశ ఉద్యమకాలమది. అనారోగ్య కారణాలతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు గవర్నర్ గా పని చేశారు.

పాత్రికేయునిగా ఆయనతో నాలుగు దశాబ్దాల పరిచయ భాగ్యం.. ఆయన స్వగ్రామం వేమూరు. మా స్వగ్రామం జంపని. నాన్నవైపు బంధువులందరూ తెనాలి వాస్తవ్యులు కావడం వారితో ఆయనకు అనేక రంగాలలో పరిచయం. ఆయన కూడా గుంటూరు హిందూ కళాశాల విద్యార్థియే.

ఒక తెన్నేటి, ఒక లచ్చన్న, ఒక పుచ్చలపల్లి, ఒక జొన్నలగడ్డ, ఒక వావిలాల, ఒక పిల్లలమర్రి, ఒక టి ఎస్, రామారావు, ఒక వి రామారావు…. కాసు, చెన్నారెడ్డి, కోట్ల, భవనం, ఎన్టిఆర్,… స్థాయిలో వ్యక్తి రోశయ్య. వీటన్నిటికీ మించి “నాయకులు గోగినేని రంగా” ఆత్మీయ అనుచరుడు. నాటి ఎమ్మెల్సీలు జూపూడి యజ్ఞనారాయణ, మన్నవ గిరిధరరావు. జాతీయ స్థాయిలో నెహ్రూ నుంచి నిన్నటి తరం కాంగ్రెస్ నాయకులతో సాన్నిహిత్యం.

సమైక్యవాది అయినా పార్టీ నిర్ణయూలకే కట్టుబడి నిలిచారు. అరవై ఏళ్ళకు పైగా చనువుగా, స్వేచ్ఛగా మెలిగారు. పాత్రికేయ ఉద్దండులు పొత్తూరి, తుర్లపాటి, రాఘవాచారి, నరిసెట్టి ఇన్నయ్య… ఇత్యాదుల ప్రియమిత్రుడు..

పెద్దాయన, కండువా రంగు మార్చని సుదీర్ఘ రాజకీయ జీవితం. ఆజానుబాహువు. తెలుగు తనం ఉట్టిపడేలా ఖద్దరు పంచెకట్టు, లాల్చీ, భుజంపై ఉత్తరీయం. రాజకీయ దురంధరుడు, కంచు కంఠం. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్ని మజిలీలు. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ లో ఒక శకం ముగిసింది. ఆయన 88 సంవత్సరాల వయసులో 2021 డిసెంబర్ 4వ తేదీ అనారోగ్యంతో కన్నుమూశారు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!