An increase in key interest rates……………………………………
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీరేట్లను మళ్ళీ పెంచింది. రెపోరేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.90 శాతానికి చేర్చింది. దీంతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కూడా వడ్డీ రేట్లను పెంచనున్నాయి. వడ్డీ రేట్ల పెంపుదల ద్వారా ధరల పెరుగుదలను అదుపు చేయాలని ఆర్బీఐ భావిస్తోంది. ధరలు తగ్గుతాయో లేదో కానీ ఈ ఏం ఐ లు కట్టే వారిపై మాత్రం భారం పడనుంది.
తాజాగా పెంచిన వడ్డీ రేట్ల వలన ముఖ్యంగా గృహ వినియోగదారులకు ఈఎంఐ భారం కానుంది. మే నెలలో పెంచిన 40 బేసిస్ పాయింట్లు, ఇపుడు పెంచిన 50 బేసిస్ పాయింట్లను పరిగణనలోకి తీసుకుంటే ఒక రూ.లక్ష లోన్ పై ఈఎంఐ ఎంత భారం కానుందో చూద్దాం..మీకు రూ.25 లక్షల గృహరుణం ఉందనుకుందాం. కాలపరిమితి 20 ఏళ్లు, వడ్డీరేటు 7 శాతంగా పరిగణనలోకి తీసుకుందాం.
అప్పుడు మీ ఈఎంఐ నెలకు రూ. 19,382 నుంచి రూ. 20,756కు పెరగనుంది. అంటే అదనంగా మరో రూ.1,374 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్రతి రూ.లక్ష లోన్ కు అదనంగా నెలకు రూ. 55 చెల్లించాల్సి ఉంటుంది.అదే సమయంలో రూ.10 లక్షల వాహన రుణం, 7 ఏళ్ల కాలపరిమితి, 10 శాతం వడ్డీరేటును పరిగణనలోకి తీసుకుంటే నెలవారీ ఈఎంఐ రూ.16,601 నుంచి రూ.17,070 వరకు పెరుగుతుంది.
అంటే అదనంగా రూ. 469 చెల్లించాలి. అదే పర్సనల్ లోన్ విషయానికి వస్తే.. రూ.6 లక్షల రుణానికి ఐదేళ్ల కాలపరిమితి, 14 శాతం వడ్డీరేటుతో లెక్కిస్తే ఈఎంఐ రూ. 281 పెరిగి రూ. 13,961 నుంచి రూ. 14,242కి చేరుతుంది. కేవలం 36 రోజుల వ్యవధిలో ఆర్ బీఐ రెపోరేటును 0.9 శాతం పెంచింది. ఇది ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవారికి శుభవార్త అనే చెప్పుకోవాలి.
కరోనా సంక్షోభంతో భారీగా పడిపోయిన ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. 2014 సెప్టెంబరులో ఎడీలపై గరిష్ఠంగా 9 శాతం వడ్డీరేటును ఆఫర్ చేసిన ఎస్ బీఐ కరోనా సంక్షోభంలో దాన్ని 5.4 శాతానికి తగ్గించింది. దీంతో ఎఫ్ డీలపై ఆధారపడే సీనియర్ సిటిజన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మళ్ళీ ఆర్బీఐ క్రమంగా వడ్డీరేట్లను పెంచుతున్న కారణంగా ఎఫ్డీల వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలున్నాయి.