“రామోజీ గోబెల్స్ ను మించినోడు”…. ఎన్టీఆర్

Sharing is Caring...

తెలుగు దేశం అధినేత ఎన్టీరామారావు కు 1983 ఎన్నికల సమయంలో పూర్తి మద్దతు ఇచ్చి .. రోజూ ఆయన వార్తలు , ఫోటోలు వేసి ఈనాడు  విశేష ప్రచారం కల్పించిన విషయం అందరికి తెల్సిందే. అప్పట్లో ఆ ప్రచారం ఎన్టీఆర్ విజయానికి కొంత మేరకు దోహదపడింది.ఆ ప్రచారం మూలాన ఈనాడు సర్క్యులేషన్ పెరిగిందా లేదా అన్న విషయం పక్క బెడితే … అదే ఈనాడు .. 1994 ఎన్నికల నాటికి ఎన్టీఆర్ కు  వ్యతిరేకంగా ప్రచారం చేసింది.

అప్పట్లో ఎన్టీఆర్, ఆయన సతీమణి లక్ష్మీపార్వతిపై నిత్యం కార్టూన్లు, వార్తా కథనాలు  ప్రచురించింది.  ఎన్టీఆర్ అవి చూసి చిర్రెత్తిపోయే వారు. ఆయన మరణించేవరకు ఈనాడు తన పంథా మార్చుకోలేదు. ఈనాడు వ్యవహార శైలిపై ఒళ్ళు మండిన ఎన్టీఆర్ తన మరణానికి కొద్దిరోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి రామోజీ పై విరుచుకు పడ్డారు. 

“ఆ పత్రిక.. దాని యజమాని పేరు ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు. విష ప్రచారం చేయడంలో ఆయన గోబెల్స్ ను మించినోడు..ఆయన నామీదే పెత్తనం చేయాలనుకున్నారు. అది కుదరలేదు. దాంతో మాపై విష ప్రచారం మొదలు పెట్టారు. వ్యతిరేక వార్తలు ప్రచురిస్తున్నారు.” ఇవన్నీ రామోజీ రావు పై  నాడు ఎన్టీరామారావు చేసిన వ్యాఖ్యలు.

1995 ఆగస్టు 16 నుంచి జరిగిన వివిధ సంఘటనలపై ఎన్టీఆర్ నిప్పులు చెరిగారు. ఆంధ్రభూమి,ఉదయం,క్రానికల్ వంటి పత్రికలు ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి. తర్వాత మరికొన్ని ఆంగ్ల పత్రికలకు ఎన్టీఆర్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆనాటి విషయాలను వివరిస్తూ నవయుగ బుక్ హౌస్ “తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ వీలునామా” పేరిట ఒక పుస్తకాన్నికూడా ప్రచురించింది.

నాడు ఎన్టీఆర్ ఏమన్నారంటే ……..  ఆయన మాటల్లో …  
“బాబు వెనుక కొన్ని పత్రికల (ఆంధ్రజ్యోతి,ఈనాడు ) బాధ్యత రహితమైన ప్రమేయం కూడా ఉంది. ఒక పత్రికాధిపతి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తెలుగునాట తెలివి ఉన్న ప్రతి పాఠకునికి ఆ విషయాలు తెలుసు. వారు తిమ్మిని బమ్మి చేశారు. సత్యాలకు స్వస్తి చెప్పారు. వాస్తవాలకు వికృత వ్యాఖ్యలు కల్పించి ప్రచారం చేయడం ద్వారా గోబెల్స్ గుండెల్లో గుబులెక్కించారు.

గోబెల్స్ కంటే ఆ విద్యల్లో ఆ పత్రికవారు మించిపోయారు. ఇలాంటి పత్రికాధిపతులు అపుడపుడు పుడుతుంటారు. తాత్కాలికంగా చరిత్ర గమనాన్ని దారి తప్పిస్తుంటారు. ఆమేరకు సమాజానికి హాని చేస్తుంటారు. అయితే చరిత్ర గమనం తప్పిపోదు.  ప్రజలు మళ్ళీ మానవ సమాజ చరిత్ర గమనాన్ని సవ్యమైన మార్గంలోకి ,దివ్య పథంలోకి మళ్లిస్తారు. కొందరు తాత్కాలికం గా చరిత్రను తమ  గుప్పెట్లోకి తెచ్చుకున్నామని , కాలానికి కళ్లెం వేశామని భావిస్తారు. చివరికి అటువంటి దుర్మదాంధులు, స్వార్ద పరులు  చరిత్ర విసిరిన పెంటకుప్పలో మాత్రమే ఉండి పోతారు.

పిచ్చి కార్టూన్లు , పిచ్చి రాతలు రాసి నా ఇమేజ్ ను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. అవాకులు చవాకులు వదిలి చెప్పమనండి ఆ పెద్దమనిషిని .. నేను అధికారాన్ని దుర్వినియోగం చేసానా ? అవినీతికి పాల్పడ్డానా ? అక్రమార్జనలకు పూనుకున్నానా ? ప్రజలే దేవుళ్ళని , సమాజమే దేవళమని నమ్మి నా కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటే నాకు ఎందుకు ద్రోహం చేస్తున్నారో  ఆ పత్రికాధిపతిని చెప్పమనండి.

ప్రజలు వారిని నిలదీసే రోజు ఎంతో దూరంలో లేదు. వారైనా ,రేపు మీరైనా సత్యాన్ని విస్మరించి అసత్యాన్ని అందలమెక్కించాలని ప్రయత్నిస్తే  ప్రజలు చూస్తూ ఊరుకోరు. పత్రికలున్నది ప్రజల బాగు కోసం . పత్రికా స్వేచ్ఛ ఉండేది కర్తవ్య నిర్వహణ కోసం. చేతిలో పత్రిక ఉంది కదా అని నానా రాతలు రాస్తూ బాధ్యతలు విస్మరిస్తే ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారు. స్త్రీలను గౌరవించడం తెలియని అనాగరికపు జులాయి తనం తప్ప వారి ఆరోపణల్లో,వారి రాతల్లో, వారి కార్టూన్లలో నిజాలు లేవు.

నేను రాజకీయాల్లోకి వచ్చే నాటికి నాకు ఆయనకు పరిచయం లేదు. నటుడిగా, కళాకారుడిగా చలనచిత్ర జీవితంలో నేను వివిధ  పాత్రలు పోషించి ప్రజలను మెప్పించాను.  ఆ ప్రజల నుంచి వచ్చిన స్పందన ఫలితంగా రాజకీయాల్లోకి వచ్చాను. కొన్ని దశాబ్దాల క్రితం రాజకీయాల్లోకి రమ్మని పూజ్యులు నీలం సంజీవరెడ్డి ఆహ్వానించారు. ఎంపీ టిక్కెట్ ఇస్తామని .. పార్టీలో చేరమని కాసు బ్రహ్మానంద రెడ్డి కోరారు.

అపుడు వారి మాటలను నేను మన్నించలేకపోయాను. నేను తెలుగు దేశం పార్టీ పెట్టాక కొందరు మిత్రులు ఈ పత్రికాధిపతి ని పరిచయం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించి మేము అధికారంలో కొచ్చాక ఆ పెద్దమనిషి ని రాష్ట్ర ప్రణాళికా అభివృద్ధిమండలి అధ్యక్షులుగా ఉండమని కోరాను. తరువాత ఎంపీ సీటు కూడా ఆఫర్ చేసాను. ఆ పత్రికాధిపతి నేను ఆఫర్ చేసిన పదవులను నిరాకరించాడు గానీ .. నా మీదే పెత్తనం చెలాయించాలనుకున్నాడు. నన్ను తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకున్నాడు.

ఆయనకు తాబేదారుగా ఉండటానికి , ఆయనకు మద్దెల కొట్టడానికి, భజన చేయడానికి నేను అంగీకరించ లేదు. నేను తెలుగు వాణ్ని. స్వాభిమానపరుడిని. ఆత్మ గౌరవాన్ని అవసరం కోసం అంగడి సరుకుగా మార్చుకోవడానికి ససేమిరా ఇష్టపడని వాడిని. వారి రాతల పట్ల మేము అభ్యంతరం చెప్పాం.

అయినా ఆపలేదు. నీతిమాలిన నికృష్టపు రాతలతో వ్యక్తుల జీవితాలపై బురద జల్లడానికి పూనుకున్నారు. కొందరి ఆలోచనా ధోరణినే తప్పుపట్టించడానికి అనునిత్యం ఒక అసత్య ప్రచారాన్ని పుట్టిస్తున్నాడు. ” అంటూ ఎన్టీఆర్ విమర్శలు గుప్పించారు.

ఆ ప్రెస్ మీట్ తర్వాత నాటి ఆంధ్రజ్యోతి ఎండీ జగదీశ్ ప్రసాద్ ను పిలిపించి మాట్లాడారు. నాటి ఎడిటర్ ఐ. వెంకట్రావు , రిపోర్టర్ రాధాకృష్ణ ల పై ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరూ బాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఇదేమి న్యాయమని మందలించారు.

అడగ్గానే మీ పేపర్ కి స్థలాలు కేటాయించిన నాకు వ్యతిరేకంగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు ? అవసరమైన వార్తలకు వివరణ తీసుకొనవసరం లేదా ? అని గట్టిగా నిలదీశారు. ఇకపై అలా జరగదని జగదీశ్ ప్రసాద్ పెద్దాయనకు క్షమాపణ చెప్పి బయట పడ్డారు. ఆఫీస్ కొచ్చి ఐ.వెంకట్రావు , రాధాకృష్ణ లపై ఎగిరిపడ్డారని సమాచారం. 

————-K.N.Murthy

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!