Surgical strikes………………..
పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడం ఇండియాకు కొత్తేమి కాదు.. గతంలో కూడా ‘ఆపరేషన్ సింధూర్‘ మాదిరి దాడులు జరిగాయి. ఒక్కో దాడికి ఒక్కో పేరు పెట్టారు. అయితే దాడుల తీరులో మాత్రం కొంత తేడా ఉంది.
తొమ్మిదేళ్ల క్రితం కూడా ‘సర్జికల్ స్ట్రైక్స్’ పేరిట దాడులు జరిగాయి.సెప్టెంబర్ 28, 2016 న ప్రత్యేకంగా శిక్షణ పొందిన మెరికల్లాంటి సైనికులు పాక్ సరిహద్దుల్లో ఉన్న లాంచ్ప్యాడ్లపై దాడులు చేసారు.
ఉగ్రవాదుల చొరబాటుకు ఉపయోగించే లాంచ్ప్యాడ్లను గుర్తించి పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో 45 మంది ఉగ్రవాదులు మరణించారని అప్పట్లో భారత్ సైనిక అధికారులు ప్రకటించారు.ఈ ఆపరేషన్ కోసం ఆర్మీ అధికారులు పక్కా వ్యూహాన్ని రూపొందించారు.
ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడుగా ఈ దాడులు జరిగాయి. ప్రధాని మోడీ, రక్షణ మంత్రి సూచనలతో ఈ దాడులు జరిగాయని అప్పట్లో వార్తలు వచ్చాయి.ప్రత్యేక దళాలు తమ లక్ష్యాలను గుర్తించి … పలు జాగ్రత్తలు తీసుకుని నియంత్రణ రేఖకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కెల్, లిపా, ఆత్ముఖం, తట్టపాణి, భీంబర్ పాంతాల్లోని ఆరు లాంచ్ప్యాడ్లను ఒకేసారి ధ్వంసం చేశాయి.
భారత సైన్యం డ్రోన్ల ద్వారా ఈ ఆపరేషన్ తాలూకు ఫోటోలను కూడా చిత్రీకరించింది. అయితే పాకిస్థాన్ నాయకత్వం అసలు దాడులే జరగలేదని ప్రకటించింది.అప్పట్లో ఈ దాడులు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ ఈ దాడులను తొలిసారి తామే నిర్వహించామని చెప్పుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండించింది.
బీజేపీ వాదనను తోసిపుచ్చింది. యూపీఏ హయాంలో భారత ఆర్మీ ఆరుసార్లు సర్జికల్ స్టైక్స్ నిర్వహించినట్టు కాంగ్రెస్ ప్రజలకు వివరించింది. ఆ పార్టీ సీనియర్ నేత రాజీవ్ శుక్లా తమ హయాంలో ఎప్పుడెప్పుడు సర్జికల్ స్టైక్స్ జరిగాయో తేదీలతో సహా వెల్లడించారు.
తమ హయాంలో సర్జికల్ దాడులు జరిగినా.. వాటి క్రెడిట్ ఎప్పుడూ తీసుకోలేదని బీజేపీని విమర్శించారు. మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్, వాజపేయి ఇలాంటి దాడులపై ఎపుడూ విలేకరుల సమావేశం నిర్వహించి తమదే ఘనత అంటూ చెప్పుకోలేదని ఆయన బీజేపీని తూర్పార బట్టారు. కాగా అప్పట్లో ఈ ‘సర్జికల్ స్ట్రైక్స్’ ప్రతీకార దాడులుగా జరిగాయి.
‘యురి’ లోని ఆర్మీ ప్రధాన కార్యాలయంపై జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకునేలా ప్లాన్ చేసి అమలు పరిచారు. ‘యురి’ ఉగ్ర దాడిలో 17 మంది సైనికులు వీరమరణం పొందారు. నలుగురు ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చి కేవలం మూడు నిమిషాల వ్యవధిలో 15 పైగా గ్రైనేడ్ లను విసిరారు.
సర్జికల్ దాడుల తర్వాత పాకిస్తాన్ నుండి సరిహద్దులో కాల్పులు జరుగుతాయని ఊహించి, భారత అధికారులు పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో సరిహద్దు నుండి పది కిలోమీటర్ల లోపు ఉన్న గ్రామాల నుండి 10,000 మందిని ఖాళీ చేయించారు. నియంత్రణ రేఖ వెంబడి సైనిక నిఘా పెంచారు.ఈ సర్జికల్ దాడుల్లో పాల్గొన్న 19 మంది సైనికులకు భారత ప్రభుత్వం శౌర్య పురస్కారాలను ప్రదానం చేసింది
2019 ఫిబ్రవరి లో జరిగిన ‘పుల్వామా’ దాడి తర్వాత భారత్ వైమానిక దాడులు జరిపి 300 మంది ఉగ్రవాదులను అంతమొందించింది.అన్నట్టు ‘యురి’ దాడుల కథాంశంతో ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’ పేరుతో సినిమా కూడా వచ్చింది. దాని గురించి మరోమారు చెప్పుకుందాం.