Kailash Mansarovar Yatra is a rare experience …………………….
మానస సరోవరం … పంచ సరోవరాల్లో ‘మానస సరోవరం’ దే ప్రధమ స్థానం. మిగతావన్నీ చూడటం ఒక ఎత్తు అయితే ఈ మానస సరోవరాన్ని దర్శించడం మరోఎత్తు. కనీసం జీవితం లో ఒక్కసారైనా ‘మానస సరోవర్’ లో స్నానం చేయాలని … కైలాస పర్వతాన్ని దర్శించాలని చాలామంది కోరుకుంటారు. అయితే అందరికి ఆ అవకాశం దొరకదు.
మానస సరోవర యాత్ర అత్యంత క్లిష్టమైనది. సముద్ర మట్టానికి సుమారు 15 వేల అడుగుల ఎత్తులో ఉన్నఈ సరోవరం వద్దకు చేరుకోవడం అంత సులభమైన పని కాదు. వాతావరణ పరిస్థితులు అనుకూలించవు. ఆరోగ్య పరిస్థితి బాగాలేని వారు అయితే అక్కడికి వెళ్ళలేరు. అక్కడి చలికి తట్టుకోలేరు. గతంతో పోలిస్తే ప్రయాణ సౌకర్యాలు ఇపుడు చాలావరకు మెరుగు పడ్డాయి.
ఈ మానస సరోవరం హిమాలయాల్లో ఉంది. ఆ ప్రదేశం చైనా ఆధీనంలో ఉన్న టిబెట్ ప్రాంతంలో ఉన్నది. ప్రతి ఏటా శీతాకాలంలో ఈ ప్రాంతం మంచుతో కప్పబడి ఉంటుంది. ఎండాకాలం లో భక్తులను యాత్ర చేసేందుకు అనుమతి ఇస్తారు. అపుడు మాత్రమే వెళ్ళాలి. ఇక కైలాస పర్వతాన్నిశివుని నివాస స్థలంగా భక్తులు భావిస్తారు. పురాణాల ప్రకారం కైలాస గిరి హిమాలయాలు మనదేశానికి చెందినవే.
టిబెట్ స్వతంత్ర దేశంగా మారాక కైలాసగిరి టిబెట్ దేశ పరిధిలోకి వెళ్లింది. ఈ ప్రాంతం కేవలం హిందువులకే కాక బౌద్ధులు, జైనులకు కూడా పవిత్ర స్థలంగా మారింది. 1950లో చైనా ఆక్రమణతో ఈ పవిత్ర క్షేత్రం చైనా ఆధీనంలోని టిబెట్ భూభాగంలోకి చేరింది. కైలాస పర్వతానికి దగ్గర్లోనే ‘మానస సరోవరం’ ఉన్నది.
హిందూ పురాణాల ప్రకారం మానస సరోవరాన్ని బ్రహ్మ తన మనస్సు నుంచి సృష్టించాడు. అందువల్లే ఈ సరస్సుకు ‘మానస సరోవరం’ అని పేరు వచ్చిందని చెబుతారు. బ్రహ్మముహుర్త కాలంలో అంటే తెల్లవారుజాము 3 నుంచి 4 గంటల మధ్య పరమశివుడు ఈ మానస సరోవరంలో స్నానం చేస్తాడని పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆ సమయంలో కైలాస పర్వతం నుంచి మానస సరోవరంలోకి ఓ వెలుగు రావడం చూసామని భక్తులు చెబుతుంటారు.
శివుడికి ప్రీతి పాత్రమైన పున్నమి రోజు ఈ కైలాస పర్వత దర్శనం చేసుకోవడానికి భక్తులు ఆసక్తి చూపుతుంటారు. పరమేశ్వరుని నుంచి వచ్చిన ఓ ప్రత్యేక శక్తి ఆ సమయంలో మానస సరోవరంలో చేరుతుందని భక్తులు భావిస్తారు. అందువల్ల పున్నమి రోజున ఆ నీటిని తాకితే సర్వ పాపాలు తొలిగిపోతాయాని భక్తుల నమ్మకం.
భారత దేశం నుండి యాత్రికులు మూడు మార్గాల ద్వారా కైలాస మానస సరోవర్ కు చేరుకోవచ్చు. అవి 1 సిక్కిం, 2 నేపాల్. 3. ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ లోని ధార్చులాను లిపులేఖ్ కు అనుసంధానించే కొత్త రహదారి మన దేశాన్ని టిబెట్ తో కలుపుతుంది.
ఈ రహదారి భారత దేశం నుండి చైనా ఆధీనంలోని టిబెట్ భూభాగంలో ఉన్న మానస సరోవర్ మధ్య ప్రయాణాన్నితగ్గిస్తుంది. ప్రతి సంవత్సరం భారత దేశం నుండి పరిమిత సంఖ్యలో యాత్రికులు మానస సరోవర్ యాత్రకు బృందాలుగా వెళుతుంటారు.
కొత్త రహదారి ద్వారా ఈ ప్రయాణ సమయం ఆరు రోజులు తగ్గుతుంది. సమయమే కాదు ఈ మార్గం సౌకర్యవంతంగానూ ఉంటుంది. ఇందులో కఠినమైన ట్రెక్కింగ్ లు ఉండవు. కాబట్టి చిన్నా పెద్దా అందరూ మానస సరోవర్ ను సందర్శించడం మరింత సులభం అవుతుంది.
కైలాష్ మానసరోవర్ యాత్రకు లిపులేఖ్ పాస్ మార్గం జూన్ 30, 2025న తిరిగి తెరవనున్నారు. నవంబర్ 2024లో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి శ్రీ వాంగ్ యి యాత్ర పునఃప్రారంభం గురించి చర్చించారు. జనవరి 2025లో మరల విదేశాంగ కార్యదర్శి చైనా ఉప విదేశాంగ మంత్రిని కలిసినపుడు వేసవిలో యాత్రను పునఃప్రారంభించడానికి అంగీకరించారు.
ఈ యాత్రలో 18-70 సంవత్సరాల వ్యక్తులను అనుమతిస్తారు. శారీరికంగా ఫిట్ నెస్ ఉంటేనే ఈ యాత్ర చేయాలి. రిజిస్ట్రేషన్లు అధికారిక MEA పోర్టల్ ద్వారా నిర్వహిస్తారు. ఈ యాత్ర లిపులేఖ్ పాస్(ఉత్తరాఖండ్), నాథులా పాస్(సిక్కిం) రెండు మార్గాల ద్వారా జరుగుతుంది.
వాటిలో యాత్రికులు ఒకదానిని ఎంచుకోవచ్చు. ఎంచుకున్న మార్గాన్ని బట్టి ఖర్చులు ఉంటాయి. లిపులేఖ్ పాస్ రూట్ అయితే ఒక్కొక్కరికి రూ.1.8 లక్షలు నుంచి రూ.2లక్షలు, నాథు లా పాస్ అయితే రూ.2.2 లక్షల నుంచి రూ.2.4 లక్షల వరకు ఉండొచ్చు.
నేపాల్ ద్వారా అయితే .. ఖర్చు రూ.3.2 లక్షలు, అంతకంటే ఎక్కువగా ఉండొచ్చు. ఇక కొన్ని ప్రైవేట్ సంస్థలుహెలికాప్టర్లు కూడా నడుపుతున్నాయి. వాటి ద్వారా వెళ్లడం సులభమే. హెలికాప్టర్ ద్వారా కైలాస యాత్ర చేయడానికి అవకాశాలు పెరిగాయి.
ఎన్నో సంస్థలు పలు ప్యాకేజీలను తీసుకొచ్చాయి. ఖర్చులు ₹2,75,000 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.సీజన్, బుకింగ్ సమయం, అదనపు సేవలు (ఉదా. ప్రయాణ బీమా, వీసా రుసుములు, అనుమతులు) ఆధారంగా కూడా ధరలు మారతాయి.