భండారు శ్రీనివాసరావు ………………………………………….
అన్నీ చెప్పేస్తున్నా … అని అంటున్నది నేను కాదు. అలా అన్నది ఒక సీనియర్ ఐ.పీ.ఎస్. అధికారి.పదవీవిరమణ అనంతరం ఒక రాజకీయ పార్టీలో చేరిన వ్యక్తి, ‘అన్నీ చెప్పేస్తున్నా…’ అంటూ ఓ పుస్తకం రాస్తే అందులో ఏముందో, ఏమేమి చెప్పారో అనే ఆసక్తి కలగడం సహజం. ఈ పుస్తక రచయిత రావులపాటి సీతారామారావు కేవలం, పోలీసు అధికారి, ఓ రాజకీయ పార్టీ నాయకుడు మాత్రమే కాదు. చదువుకునే రోజుల నుంచి చేయి తిరిగిన రచయిత అనే పేరు సంపాదించుకున్నారు.
కలం పట్టిన చేత్తో లాఠీ పట్టుకున్నా కలాన్ని మాత్రం ఒదిలిపెట్టలేదు. ఈ పుస్తకం చివర్లో ఒక చమత్కార పూరితమైన ఒక వాక్యం వుంది. ఉద్యోగ పర్వంలో తన పేరును అంటిపెట్టుకుని వున్న ఐ.పీ.ఎస్. (ఇండియన్ పోలీసు సర్వీసు) అనే మూడు ఇంగ్లీష్ పొడి అక్షరాలు, రాజకీయ రంగ ప్రవేశం దరిమిలా కూడా ‘ఇండియన్ పొలిటికల్ సర్వీసు’గా తనతోనే సహచర్యం చేస్తున్నాయని ఒక చమత్కార బాణం సంధించారు.
పోలీసు ఇంటలిజెన్స్ విభాగంలో అనేక సంవత్సరాలు పనిచేసిన కాలంలో రావులపాటి సీతారామారావుకు తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కీర్తి శేషులు ఎన్టీ రామారావు తోనూ, అలాగే తరువాత ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడుతోనూ అతి సన్నిహితంగా మెలగగలిగే వీలూ సాలూ వృత్తిరీత్యా లభించింది. ఎన్నెన్నో ఆంతరంగిక విషయాలకు, బయటకు పొక్కని సందర్భాలకు, సన్నివేశాలకు ప్రత్యక్ష సాక్షిగా వుండే వెసులుబాటు రావులపాటికి కలిగింది.
అంచేత వారిరువురికీ సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు ఈ పుస్తకంలో చోటుచేసుకోవడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. అయితే ఆ విషయాల్లో రచయిత పాటించిన సంయమనం ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ. సంచలనం కోసం కూడా తనకు తెలిసిన నిజాలను, తనకు మాత్రమే తెలియగల వాస్తవాలను, ప్రత్యేకించి కించపరిచే సంచలన అంశాలను ఒదిలిపెట్టి పుస్తకం రాసిన తీరు మెచ్చతగింది.
మరి ఇంత నిజాయితీతో, నిబద్ధతతో రాసే పుస్తకంలో చదివించే అంశాలు ఏమీ లేవా అంటే వున్నాయి. అందులో ముందుగా చెప్పాల్సింది రాసిన తీరు. ఎంతో సరళంగా, గందరగోళాలు లేకుండా హాయిగా ఏకబిగువున చదువుకునే విధంగా వుంది రచయిత శైలి. ఆయన స్వయానా రచయిత కావడం వల్ల, ఆత్మకధ అనండి, లేదా ఆయనే చెప్పుకున్నట్టు అనండి – చదివించే గుణం ఈ పుస్తకంలో పుష్కలంగా వుంది.
సుదీర్ఘకాలం పోలీసు శాఖలో పనిచేసి అటు సమర్దుడయిన అధికారిగా, ఇటు ఆహ్లాద రచయితగా మంచి పేరు తెచ్చుకున్న రావులపాటి సీతారామారావు అనే వ్యక్తి, ఉద్యోగ విరమణ అనంతరం, అంత మంచి పేరు లేని రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ప్రకటించడం ఇంటా బయటా ఎంతో ఉద్వేగాన్ని కలిగించింది. సరే! రాజకీయాల్లో చేరాలంటే ఏదో ఒక పార్టీలో చేరక తప్పదు.
మరి ఆ పార్టీ ఏమిటి ? ఈ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన్ని బాగా తెలిసిన వారందరికీ మరింత ఆశ్చర్యం కలిగించింది. తెలుగు దేశంలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. అదేమీ అంటరాని పార్టీ కాదుకదా! పైగా ఆ రోజుల్లో ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలో వుంది. పైపెచ్చు టీడీపీ అధినేత కేంద్రంలో కూడా చక్రం తిప్పుతున్న రోజులాయే! మరి ఆశ్చర్యాలు, అభ్యంతరాలు ఎందుకోసం?
ఎందుకంటే, రావులపాటి వారి ఇలాకా అంతా కాంగ్రెస్ మయం. వాళ్ళ స్వగ్రామాలు ఒకనాటి కమ్యూనిష్టుల కంచుకోట ఖమ్మం జిల్లాలో వున్నప్పటికీ, వారి నరనరాన కాంగ్రెస్ సంస్కృతి జీర్ణించుకుని వుంది. సీతారామారావు గారి నాన్నగారు రావులపాటి సత్యనారాయణ రావుగారు ప్రముఖ కాంగ్రెస్ వాది. పాలేరు సమితి అధ్యక్షుడిగా పనిచేశారు.
ఇక బంధుగణం అంతా కాంగ్రెస్ పార్టీ మనుషులే. రక్తపరీక్ష చేస్తే కాంగ్రెస్ రక్తం కనబడుతుందని హాస్యోక్తిగా చెప్పుకునే వారు. అలాంటిది ఒక పోలీసు ఆఫీసరుగా పనిచేసి రాజకీయాల్లో చేరాలని అనుకోవడమే ఒక సంచలనం అయితే, చేరేది తెలుగుదేశం పార్టీ కావడం చుట్టపక్కల్లో పెనుసంచలనం అయింది. ఆ పార్టీ అధికారంలో వున్నప్పుడు అందులో చేరి, దరిమిలా ఒక దశాబ్దంపాటు ఆ పార్టీ అధికారానికి దూరంగా జరిగినా ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీకి దూరం జరగలేదు. రాజకీయాల్లో విలువలు వుండి తీరాలని, లేకపోతే వాటికి ఏమాత్రం విలువ వుండదన్నది తన నమ్మకం అని ఆయన రాసుకున్నారు.
ఇక అన్నీ చెప్పేస్తున్నాపుస్తకం ద్వారా చెప్పిన కొన్ని విషయాలు : 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పరాజయం తరువాత, కాంగ్రెస్ విజయ యాత్రలో పాల్గొన్న వారిలో కొందరు అతి ఉత్సాహానికి పోయి ఆబిడ్స్ లోని రామారావు నివాసం వెలుపల ‘ముఖ్యమంత్రి’ అని రాసి వున్న నేమ్ ప్లేటును తీసి కింద పారేశారు. అప్పుడు ఆ ఏరియా పోలీసు అధికారి సీతారామారావు. ఒక జూనియర్ అధికారి నేమ్ ప్లేట్ విషయాన్ని ఎన్టీఆర్ కి నొచ్చుకుంటూ చెప్పబోతే, ‘నేమ్ ప్లేట్ దేముంది బ్రదర్, పదవే పోయిన తరువాత’ అని ఆయనే సర్దిచెప్పిన తీరు తనని కదిలించి వేసిందని రాసుకున్నారు.
మరి కొన్ని విషయాలు ఆయన మాటల్లోనే:
“మే, 2014.
“పోటాపోటీగా ఆంద్ర ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం అంతా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఆ క్రితం రాత్రి సరిగా నిద్రపట్టలేదు. ఫోన్లలో వచ్చే రకరకాల మెసేజ్ లు చాలా చీకాకు పెట్టాయి. కొందరు ఫారిన్ నుంచి కూడా ఫోను చేసారు. ‘ఏమవుతుంది? జగన్ గెలుస్తాడా? ఏదో సర్వే చెప్పిందట కదా!’ మరికొందరు భయం భయంగా చంద్రబాబు రావాలి సార్, రాకపోతే యెట్లా?’ ఇలాటి పలకరింపులు ఆందోళనను మరింత పెంచాయి.
అర్ధరాత్రి దాటిన తరువాత మరో ఫోను. ఇంటలిజెన్స్ లో పనిచేసిన ఓ అధికారి. ‘ఇంత రాత్రివేళా’ అన్నాను. ‘ఇప్పుడే చాలా నమ్మకంగా తెలిసింది. తెలంగాణాలో భారీ మెజారిటీతో టీఆర్ ఎస్, ఆంధ్రాలో కొద్ది తేడాతో జగన్ గెలుస్తారని” “అయినా మనసు మూలల్లో ఏదో నమ్మకం, అలా జరగదనీ, చంద్రబాబు గెలుస్తారనీ. “ఉదయం పదకొండు గంటలకు చంద్రబాబు ఇంట్లో వున్నాం. ఫలితాలు వస్తున్నాయి. ఒక్కో సీటు గెలుస్తుంటే ఉత్సాహం, కేకలు. తొంభయ్ సీట్లు రాగానే చంద్రబాబునాయుడు దగ్గరకు వెళ్లి అభినందనలు చెప్పబోయాం. ‘వంద రానివ్వండి అప్పుడు చెబుదురు కాని’ అన్నారు ఆయన నిబ్బరంగా. రాత్రంతా పడ్డ ఆందోళన దూదిపింజలా ఎగిరి పోయింది.”
తెలంగాణ ప్రాంతానికి చెందిన సీతారామరావు, ఈ పుస్తకంలో రాసిన ఓ ఆసక్తికర విషయంతో దీన్ని ముగిస్తాను. “ మా నాన్న తొంభయ్ సంవత్సరాల వృద్ధుడు. తెలంగాణా రాష్ట్రాన్ని డిక్లేర్ చేసిన సందర్భంగా హైదరాబాదు అంతా పండుగ వాతావరణంలో మునిగి తేలుతోంది. మా తమ్ముడి కూతురు ‘జై తెలంగాణా’ అంటూ ఆయన మంచం దగ్గరికి వెళ్లి, ‘తాతయ్యా! తెలంగాణా వచ్చింది. జై తెలంగాణా అను’ అని ఆయన చేయి అతికష్టం మీద పైకెత్తింది.
అప్పటికే ఆయన చాలా అస్వస్థతగా వున్నారు. అయినా అయన తన చేతిని బలవంతంగా ఎత్తి పెట్టుకుని, ‘జై విశాలాంధ్ర’ అని కళ్ళు మూసు కున్నారు. ఈ చిన్నపిల్లకు అర్ధం కాలేదు. ఆ మాట కొత్తగా విన్నది. విశాలాంధ్ర కోసం శ్రమించిన వ్యక్తి ఆయన. విలువలను మార్చుకోలేని ఆశక్తుడు’.
(ఇలా అనేక సంగతులు అలవోకగా చెప్పుకుంటూ పోయిన ఈ పోలీసు రచయిత రాసిన మరో పుస్తకం ‘ఖాకీ కలం’ కు కథానిక ప్రక్రియలో తెలుగు విశ్వ విద్యాలయం ఆ మధ్య సాహితీపురస్కారం ప్రకటించింది. ఆరేళ్ల క్రితం రాసిన పుస్తక పరిచయం ఇది. )

