బాలగోపాల్ ఉంటే ఎంత బాగుండేది..! (1)

Sharing is Caring...

Taadi Prakash ………………………….

MOHAN’S TRIBUTE TO BALAGOPAL……………………………బాలగోపాల్ ఆ సాయంకాలం మనసుకి చాలా కష్టంగా ఉంది. దాదాపు అందరూ కన్నీళ్ళతో ఉన్నారు. బాలగోపాల్ అంత్యక్రియలకి వందల మంది వచ్చారు. ఒక వేదన, ఒకలాంటి నిశబ్దం… డొక్కా మాణిక్య వరప్రసాద్, ఆర్టిస్ట్ మోహన్, నేనూ, ఇంకొందరు ఒక పక్కగా నుంచొని ఉన్నాం. అక్కడ నుంచి మోహన్ నేను ‘సాక్షి’ ఆఫీస్ కి వచ్చాము. రావడం రావడమే మోహన్ ఒక తెల్ల కాగితం తీసుకొని, బాలగోపాల్ పొట్రైట్ వేసాడు. నిమిషంన్నర సేపు ఉండే ఒక యానిమేషన్ ఫిల్మ్ కి గబ గబా బొమ్మలు వేశాడు. యానిమేషన్ అంటే ఒకటి రెండు కాదు కొన్ని డజన్ల బొమ్మలు వెయ్యాలి.

పది మంది ఆర్టిస్టుల్ని పిలిచి కలరింగ్ ఎలా చేయాలి? బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎలా రావాలి? పాట ఎక్కడ మొదలవ్వాలి? లాంటి ప్రతి డీటెయిల్ వాళ్ళకి చెప్పి షార్ట్ ఫిల్మ్ ఎఫెక్టివ్ గా వచ్చేలా నిమిషాల్లో ప్లాన్ చేశాడు. “హృదయమున మీ చరిత్రలు పదిలమాయేమరతుమన్నన్ మీ స్మృతుల్ మరపురావు”అంటూ అరుణోదయ రామారావు ఉద్వేగంగా పాడిన పాట ఎవరినైనా వెన్నాడి తీరుతుంది. ఆర్టిస్ట్ కుర్రాళ్ళు హై స్పీడ్ తో పనిచేసి, కొన్ని గంటల్లోనే ఫిల్మ్ ముగించి అర్థ రాత్రి దాటాక సాక్షి ఛానల్ కి ఇచ్చారు. క్షణాల్లో ఇంత మంచి ఫిల్మ్ రావాలంటే మోహన్ లా మేజిక్ చేయగలగాలి.

మోహన్ ఎంతో ప్రేమతో, ఇష్టంతో ఈ ఫిల్మ్ చేశాడు. ఆ మంటలు, నడిచే జనసమూహాలు, ఆ డప్పుల చప్పుడు… రామారావు గొంతు… బాలగోపాల్ బొమ్మ మన మనసులోంచి ఎప్పటికి చెరిగిపోవు. బాలగోపాల్ మనల్ని వొదిలి వెళిపోయాక వసంత లక్ష్మి గారు తెచ్చిన ‘నిగాహ్’ ముందు మాటగా మోహన్ ఈ వ్యాసం రాశాడు. 2009 అక్టోబర్ 8న బాలగోపాల్ కన్నుమూశారు. ఐదారేళ్ల క్రితం మోహన్ రాసిన వ్యాసం ఇది. చదవండి…

అనగనగనగా 1987 ఫిబ్రవరిలో ‘జెంటిల్మన్’ పత్రిక వచ్చింది. అందులో “ఛాంపియన్ ఆఫ్ ది అప్రెస్డ్” శీర్షిక కింద 34 ఏళ్ల బాలగోపాల్ పై ఒక వ్యాసం ఉంది. పౌర హక్కుల కోసం పూర్తికాలం పని చేస్తున్నాడు, పోరాడుతున్నాడు, అతను ఆ నిర్ణయం కనుక తీసుకోకపోతే ఈపాటికి మేథమేటిక్స్ లో నోబెల్ ప్రైజ్ వచ్చి ఉండేదని ఆయన ప్రొఫెసర్లు అంటారని – ఆ పత్రిక రాసింది. లెక్కలంటే డొక్క చీరేంత భయం ఉండడం వల్ల నాకు అదంత గొప్పగా అనిపించలేదు కాని ఈయన అంతర్జాతీయ స్థాయిగల మాథమెటీషియన్ అని మాత్రం అర్థమైంది.

తర్వాత తెలిసిందేంటంటే మేథమేటిక్స్ కు నోబెల్ లేదట. దానికి సమానమైన మరో ప్రైజ్ ఏదో ఉందట.వరంగల్ లో చదివిన చాలామంది స్టూడెంట్స్ ఈయన విషయాలు ఇంకా వివరంగా ఆరాధనతో చెప్పడమూ విన్నాను. కాకతీయ యూనివర్సిటీలో ఈయనా, బయట వరవరరావూ రెండు మూడు తరాల విద్యార్థులను ఆదర్శాల వైపు మళ్లించారు. ఈరోజుకీ వాళ్లంతా నాటి ఇన్స్పిరేషన్ ని తలుచుకుని తన్మయులై పోతుంటారు.మరి ఇంతా చదివీ, శాస్త్రాలు తెలిసీ మానవహక్కులనీ, ఉద్యమాలనీ ఎందుకనడం? ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ ఇవతల ‘ఉదయం’ డైలీ ఆఫీసు పక్కనుంచి చార్మినార్ ఫ్యాక్టరీ మీదుగా ఒక్కడే నడుచుకుంటూ వెళ్లడం ఎందుకు? ఏ పెద్ద యూనివర్సిటీకెళ్లినా దణ్ణాలు పెట్టి పెద్ద ఉద్యోగాలిస్తారు. దర్జాగా ఉండొచ్చు.

అదంతా వదులుకుని ముళ్లదారినెంచుకుని, ప్రతిక్షణం ప్రాణానికి ముప్పే అనే స్థితిలో వీళ్లు బతికారు. బాలగోపాల్ మీద చాలా దాడులు జరిగాయి. గూండాలు కొట్టి పారేసి పోయారు. పోలీసులూ అదే పని చేశారు. ఒకసారి కిడ్నాప్ కూడా చేశారు. పోలీసు నిఘా ఎప్పుడూ ఉండేది.ఆయనొకసారి ట్రైన్ లో కలకత్తా వెళ్లాడు. అక్కడ మృణాల్ సేన్ ని కలిసే పనుందట. కంపార్టుమెంట్ లో రద్దీ వల్ల కిందికి దిగలేక విశాఖలో తనను కలుద్దామని వచ్చిన వాళ్లను కలవలేకపోయాడు. పెద్ద గందరగోళం. విశాఖ నుంచి చలసాని ప్రసాద్ స్టేట్ మెంట్. హైదరాబాద్ లో మాతో ‘ఉదయం’ పత్రిక జర్నలిస్టుగా పనిచేస్తున్న ఆయన భార్య వసంతలక్ష్మి, (అప్పటికింకా భార్య కాలేదనుకోండి) చెల్లెలు మృణాళిని, ఇంకా వందల, వేల మంది కంగారుపడ్డారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లూ, పత్రికల నిండా స్టేట్మెంట్లు. అందరూ పోలీసుల్ని అనుమానించారు.

ఈలోగా బాలగోపాల్ లక్షణంగా కలకత్తా చేరాడని తెలిసింది. ప్రతిదానికీ మామీద వొంటికాల్తో లేస్తారని పోలీసులంతా ఉద్యమకారుల్ని దుమ్మెత్తిపోశారు.అయితే అప్పుడున్న పరిస్థితులు అలాంటివి. గాలినిండా అనుమానం, భయం ఆవరించి ఉండేవి. అటువంటి భయాలు, పరిస్థితులనెన్నో జయించినవాడు బాలగోపాల్. ఈ వ్యాసాల నిండా ఆ నిర్భీతి కనిపిస్తుంది. ‘ నిగాహ్ ‘ కాలమ్ ‘ప్రజాతంత్ర’ వీక్లీలో క్రమం తప్పకుండా దశాబ్దం పైగా వచ్చింది. దేవులపల్లి అమర్ నడిపిన పత్రిక అది. వీటిలో స్థానికం నుండి జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు, మతం, కులం, పార్టీల తీరు, అభివృద్ధి తెన్నులు అన్నీ ఉంటాయి.ఈ ఏడాదీ, వచ్చే ఏడాదీ రావలసిన వ్యాసాలన్నీ చాలా ఏళ్ల క్రితమే రాసేసినట్టుంటాయవన్నీ. తాడిపత్రి ఫాక్షన్ రాజకీయాల నుండి బుష్, సద్దాం యుద్ధాల వరకు ఎన్నో సంగతులొస్తాయి.

బాక్సైట్ తవ్వకాలు, పోలవరం ప్రాజెక్టు, నర్మదాబచావో ఆందోళన్ – అన్నిట్లోనూ దారం లాగా ఓ రీజన్ ఉంటుంది. దానికి ఆధారం మనుషుల బతుకులు, వాళ్ల ప్రాణాలు, హక్కులు, స్వేచ్ఛ.. ఇవే.ఆదిలాబాద్, కరీంనగర్ గవర్నమెంట్ ఆస్పత్రుల్లో అవకతవకలు, చిన్న పిల్లల చావుల గురించి రాసినపుడు చాలా సీరియస్ కన్సర్న్ కనిపిస్తుంది. అది ఏడిపిస్తుంది కూడా.80వ దశకం నుండి బాలగోపాల్ ప్రసంగాలూ, రాతలూ తెలిసినవే. ఆయన తెచ్చిన రిపోర్టులు, స్టేట్మెంట్లు చదివినవే. అయినా ఇవి వేరు. బాగా సిగ్గరిగా అంతర్ముఖుడుగా కనిపించే మనిషి ఇలా దాష్టీకంగా రాస్తాడనీ, చిలిపిగా జోకులు పేలుస్తాడనీ ఊహించలేం. చెదిరిన జుట్టు, నలిగిన చొక్కా, ఆకుచెప్పులతో కనిపించే మనిషి ఇంత ఫైటింగ్ స్పిరిట్ ప్రదర్శించగలడని అనిపించదు. కత్తులు మింగీ నిప్పులు ఊదే బ్రాండెడ్ రెడ్ రివల్యూషనరీలా బొత్తిగా కనిపించడు.

మన కళ్లకి కనిపించేదంతా కరెక్ట్ అనుకోవడం అంత కరెక్ట్ కాదేమో! ఈ పాపిష్టి కళ్లు అంత తిన్నమైనవనే గ్యారంటీ ఏముంది!
అసలు సంగతి ప్రపంచాన్ని చూడ్డంలో ఉంది.అర్థం చేసుకోవడంలో ఉంది.భాష్యం చెప్పడంలో ఉంది. దానికోసం చదువు కోవడం, ఫీలవడం, పోరాడడం గొప్పవని బాలగోపాల్ బతికిన బతుకు చెప్తుంది. రోజువారీ చిల్లర విషయాలు, పనికిమాలిన కంఫర్ట్ లు, సుఖాలను సునాయాసంగా వదిలేయడం ఎలాగో ఈ మనిషిని చూస్తే అర్థమవుతుంది. 

Read Also ………………. బాలగోపాల్ ఉంటే ఎంత బాగుండేది..! (2)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!