ఎంత ఎదిగినా ..ఒదిగి ఉండే నిరాడంబర స్వభావి!!

Sharing is Caring...

Modumudi Sudhakar …………………………….

తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు,మధుర గాయకులు,అద్భుత స్వరకర్త గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ సంగీతానికి అంకితమైన ఒక పుంభావ సరస్వతి.1948 నవంబరు 9 న రాజమహేంద్రవరం లో జన్మించారాయన.ప్రఖ్యాత నేపథ్య గాయని శ్రీమతి ఎస్.జానకి ఆయనకు స్వయానా పిన్నిగారు.

శ్రీయుతులు నేదునూరి,పశుపతి,మంగళంపల్లి గార్లు వీరికి గురువులైనా,గరిమెళ్ళవారి బాణి,ఈ ముగ్గురు త్రిమూర్తుల మేలు కలయిక అని చెప్పవచ్చు.నేదునూరి వారిలోని రాగభావం,పశుపతిగారి గాత్రంలోని శ్రుతిశుద్ధం,బాలమురళి వాణిలోని లాలిత్యం కలబోసిన బాణి వీరిది.

అన్నమయ్య చేసిన పదార్చనకు గరిమెళ్ళ వారి రాగాలు ‘బంగారానికి తావి’ అనిపిస్తాయి.150 కి పైగా రాగాలను తీసుకొని, 800 కు పైగా సంకీర్తనలకు వైవిధ్యభరితంగా బాణీలు కట్టిన ఘనత వారిది.ఆయన స్వరపరచిన అన్నమయ్య సంకీర్తన వింటుంటే,సాహిత్యం,దానికి తగ్గ సంగీతం జతగా కలసి,మెలసి,’అన్నమయ్య మనతో మాటాడుతున్నారా!’ అనిపిస్తుంది.

మోహన,హిందోళ,శుద్ధధన్యాసి వంటి రాగాలలో సాధారణంగా ఎవరు స్వరపరచినా పరిమితమైన అవే సంగతులు కనబడతాయి.కానీ గరిమెళ్ళవారు ఒకదానికొకటి భిన్నమైన స్వరప్రయోగాలతో,సాహిత్యంలో ఒదిగిపోయే విధంగా స్వరం సమకూర్చటం విశేషం.ఔడవ(5 స్వరాల) రాగాలలోనే ఆయన అధిక భాగం స్వరపరిచారు.

ఇక ఆయన సృష్టించిన రాగాల విషయానికొస్తే సుందరరంజని,వాణీప్రియ,చిత్ర కల్యాణి వంటి రెండు పదుల రాగాలను, వినూత్న భావావిష్కరణలకు ఆలవాలమయేట్లు ఆయన సృజించారు.ఇది ఆయన మరో నవ్య శోధన. 

ఆయనకు మృదంగ వాదనంలోను ప్రవేశం ఉంది…తిరుమల తిరుపతి దేవస్థానముల రికార్డింగ్ ప్రాజెక్టు ఎక్ష్పర్ట్ కమిటీ సభ్యుడినైన నా అనుభవంలో తెలుసుకున్నది ఏమంటే గరిమెళ్లవారు రూపొందించిన సిడిలకు కళ్లు మూసుకొని ఆమోదం తెలపటం తప్ప మరో ఆలోచన అనవసరం..అంత ప్రామాణికంగా ఉంటాయి అవి.

5000 కు పైగా విశ్వమంతా పర్యటించి,ఆయన నిర్వహించగా శ్రోతలు బ్రహ్మరథంపట్టిన ప్రదర్శనలు, ‘అన్నమయ్య సంకీర్తన మహతి’,’అన్నమయ్య నాద జ్యోతి’ వంటి లెక్కకు మిక్కిలియైన బిరుదాలు, సమర్పించిన అసంఖ్యాక ఆడియో సీడీలు…ఇవన్నీ ఒక ఎత్తు అయితే,ఆయన రచించి,స్వరపరచి,గానంచేసిన లలితగీతాలు మరొక ఎత్తు.

గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి “శివపద” కీర్తనలను స్వరపరచి ఆలపించడం కూడా. దాదాపుగా 150 శివపద కీర్తనలను వారు స్వరపరచి ఆలపించడం జరిగింది.అవి నిజంగా ఆణిముత్యలే..మధురభావ తరంగాలే.

గరిమెళ్ళవారు స్వరసహితంగా వెలువరించిన స్వీయ రచిత ఆంజనేయ కృతిమణిమాల,వినాయక కృతులు,నవగ్రహ కృతులు,సర్వదేవతా స్థుతి రచనలు…అనేకం బహుళ జనాదరణ పొందాయి.

గరిమెళ్ళవారి గళం వినబడని ఆకాశవాణికేంద్రం లేదు… భక్తిరంజని కార్యక్రమం లేదు.
దేశమంతటా పర్యటించి,’అన్నమయ్య నాదయజ్ఞాలు’ ఎన్నో విజయవంతంగా నిర్వహించారు.
తిరుమలకొండపై ఒక భక్తుడు స్వామి దర్శనార్థమై వచ్చి నిలుచున్నప్పుడు,ఏమూల ఉన్నా,ఏ చోటనున్నా, గాలిఅలలపై తేలివచ్చే గరిమెళ్ళవారి గళం చెవికి సోకగానే, మధురానంద భరితుడవటం తథ్యం.

తిరుమల తిరుపతి దేవస్థానానికి అంకితమైనారు గరిమెళ్లవారు… వారి గాన కచేరీలెన్నో ప్రత్యక్షంగా విన్న భాగ్యవంతుణ్ణి.తాను ఏది పాడినా,ఆ పాటలోని ప్రతి మాటను,రాగంలోని ప్రతి సంగతినీ స్ఫటికమంత స్వఛ్ఛంగా పలికించగల గంధర్వ గానం వారిది.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నిరాడంబర స్వభావి వారు.ఆయనకు నాతో పని ఉంటే,స్వయంగా రెండు మూడు సందర్భాలలో మా ఇంటికి స్వయంగా వచ్చి నన్ను కలసి,ఆశ్చర్యపరిచారు. తాను రచించిన ప్రతి గ్రంథాన్నీ ముందుగా నాకు అందచేసి,నా అభిప్రాయం తెలుసుకొనేవారు.

ఒకసారి బెజవాడలో అన్నమయ్య ఆరాధనలో నేను ఆయన సమక్షంలో అన్నీ ఆయన స్వరపరచిన సంకీర్తనలు పాడితే,ఆయన పొందిన ఆనందం వర్ణనాతీతం.ఆ ఆనందాన్ని అభినందన మందారమాలగా నాకు సమర్పించారాయన!తిరుపతి లో ఆయన హాజరుకాని నా కచేరీలు బహు కొద్ది మాత్రమే..నేనంటే అంత అభిమానం ఆయనకు!

ఆయన పలుకు ఎంత మంద్రమో గానమంత మార్దవము.అనవసర విన్యాసాలకు, ఆడంబర విద్వత్ప్రదర్శనలకు ఆయన దూరంగా ఉంటారు.అయితే,సాంప్ర దాయాన్ని గౌరవిస్తూ ఆయన చేయని సంగీత,సాహిత్య ప్రక్రియ లేదు.శ్రోతలను తనతోపాటు తోడ్కొనివెళ్ళి,ఏడుకొండలూ ఎక్కించి,తుట్టతుదకు స్వామి దివ్యదర్శనం చేయిస్తుంది గరిమెళ్ళవారి గానం.అది అనన్యసామాన్యం.

‘అన్నమయ్య కీర్తనలకు బాలకృష్ణప్రసాద్ గారి బాణీలకు సాటి మరిలేవు’ అనటం అతిశయోక్తి కాదు.అందుకే గరిమెళ్ళవారు ‘అన్నమయ్య వరప్రసాది’.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!