SivaRam…………………
Why didn’t the two of them act together for 14 years?
తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధిలో ఎందరో కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ .. ఏఎన్ఆర్ అదే బాట అనుసరించారు.సినిమా రంగానికి ఈ ఇద్దరూ ఎనలేని సేవ చేశారు.ఎంతోమంది దర్శక నిర్మాతలు ఇండస్ట్రీకి రావడానికి అద్భుతమైన సినిమాలు చెయ్యడానికి వారే కారణం. అప్పట్లో ఆ ఇద్దరూ టాప్ హీరోలు అయినప్పటికీ ఎలాంటి భేషజాలకు పోకుండా అన్నదమ్ముల్లా కలిసి మెలిసి తిరిగేవారు…
ఇద్దరూ మంచి పొజీషనల్లో ఉన్నప్పటికీ కలసి నటించేందుకు సంశయించేవారు కాదు. అలా ఇద్దరూ కలిసి 14 సినిమాల్లో నటించి వారి కాంబినేషన్ అదుర్స్ అనిపించుకున్నారు.
అలాంటిది ఒక్కసారిగా వారి సినీ బంధానికి బ్రేక్ పడిపోయింది. దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఇద్దరూ కలిసి నటించలేదు.
ఉప్పూ నిప్పులా కాకపోయినా వారి మధ్య మాటలు కూడా లేకుండా పోయాయని అప్పట్లో అనుకునే వారు. అలా వారిద్దరూ విడిపోవడానికి సినిమాలు చెయ్యకపోవడానికి కారణం మాత్రం అక్కినేని భార్య అన్నపూర్ణ.ఎన్టీఆర్తో కలిసి నటించవద్దని అక్కినేనికి సూచించారట. ఈ క్రమంలోనే కొన్నేళ్లు ఇద్దరూ కలిసి నటించలేదు.
అసలు అన్నదమ్ముల్లాంటి వారి మధ్య అలాంటి అగాధం ఏర్పడటానికి కారణం ఏమిటి… అన్నపూర్ణ గారు ఎందుకు అక్కినేనిని ఎన్టీఆర్తో కలిసి నటించకూడదని మాట తీసుకున్నారో తెలుసుకోవాలంటే కాస్త ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లాల్సిందే.
అక్కినేని నాగేశ్వరరావు 1941లో ‘ధర్మపత్ని’ సినిమాలో చిన్న క్యారెక్టర్తో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. 1944లో ‘సీతారామ జననం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తరువాత 5 సంవత్సరాలకు ‘మనదేశం’ చిత్రం ద్వారా ఎన్టీఆర్ చిత్రరంగ ప్రవేశం చేసారు.
వీరిద్దరూ ఫస్ట్టైం 1950లో బీఏ సుబ్బారావు డైరక్షన్లో రూపొందిన ‘పల్లెటూరి పిల్ల’ చిత్రంలో కలిసి నటించారు. ఆ తరువాత ఎన్నో చిత్రాల్లో కలిసి నటించి ఆబాలగోపాలాన్ని అలరించారు..
ఇద్దరూ టాప్ హీరోలుగా వెలుగొందుతున్నప్పటికీ కలిసి నటించేందుకు ఏ మాత్రం విముఖత చూపేవారు కాదు. అలాంటిది 1963లో వచ్చిన ‘శ్రీకృష్ణార్జున యుద్దం’ చిత్రంతో వీరి కాంబినేషన్కు బ్రేక్ పడింది.
ఆ సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడుగా,ఏఎన్ఆర్ అర్జునుడుగా నటించారు.కేవీరెడ్డి డైరక్షన్లో ఈ సినిమా ప్రారంభం కావడానికి నాలుగేళ్ల ముందే డైరక్టర్ కేబీ తిలక్ ‘కృష్ణార్జున’ అనే సినిమాను తీయాలనుకున్నారు.
ఎన్టీఆర్ కృష్ణుడుగా జగ్గయ్య అర్జునుడిగా అనుకున్నారు.అదే సమయంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ‘గుండమ్మ కథ’ విడుదలైంది.ఈ సినిమాను చూసిన తిలక్ అర్జునుడిగా ఏఎన్ఆర్ అయితే బాగుంటుందని ఆలోచించారు..ఈ విషయాన్ని జగ్గయ్యకి చెప్పి ఆయన్ని బలరాముని క్యారెక్టర్ చెయ్యమన్నారు. జగ్గయ్య కూడా ఎటువంటి భేషజానికి పోకుండా ఓకే చెప్పారు.
ఆ తరువాత ఆర్టిస్టుల ఎంపికతో పాటు మరికొన్ని ఇబ్బందులు ఎదురవ్వడంతో పాటు ఈ సినిమా నిర్మాణాన్ని మొత్తానికే ఆపేశారు. కానీ 1963లో మాత్రం మరోసారి అక్కినేనికి అర్జునుడిగా నటించాల్సిన పరిస్థితి ఏర్పడింది..
కేవీరెడ్డి స్వీయదర్శకత్వంలో’ శ్రీకృష్ణార్జున యుద్ధం’ చిత్ర నిర్మాణాన్ని చేపట్టారు. ఎన్టీఆర్ కృష్ణుడుగా ఏఎన్నార్ అర్జునుడుగా అనుకున్నారు ఇదే విషయాన్ని అక్కినేనికి తెలిపారు కేవీ రెడ్డి. ఈ క్యారెక్టర్ చెయ్యడానికి మొదట ఏఎన్నార్ సంశయించారు.
‘నో’ చెప్పారు కూడా… అయితే కేవీ రెడ్డి పట్టుబట్టడం, అంతకుముందే తమ సొంతబ్యానెర్లో ‘దొంగరాముడు’ చిత్రానికి కేవీ రెడ్డి దర్శకత్వం వహించారన్న గౌరవంతో ఆయన కోసం అర్జునుడిగా నటించడానికి ఒప్పుకున్నారు.
1963లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారధ్యంలో రూపొందిన పాటలు అందర్నీ అలరించాయి. ఇక అప్పుడే అసలు సమస్య మొదలైంది.
మహాభారత కథ కావడంతో అందులో కృష్ణుడి పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. దీంతో అక్కినేని పాత్ర తేలిపోయింది. ఇది అక్కినేని అభిమానుల్ని ఎంతో బాధించింది. ఎన్టీఆర్ ముందు పౌరాణికాల్లో ఎవరూ కూడా నిలువలేరని మరోసారి నిరూపితమైంది. ఇదే విషయాన్ని అక్కినేని సతీమణి అన్నపూర్ణకు చేరవేశారు అక్కినేని అభిమానులు.
సినిమా చూసిన తరువాత ఆవిడకి కూడా ఇదే అభిప్రాయం కలిగింది.తన మనసులో మాట అక్కినేనికి తెలియ జేశారు. పౌరాణికాలలో నటించే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోమని భర్తకు సూచించారు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తో కలసి నటించే ముందు పాత్ర, దాని ప్రాధాన్యత తెలుసుకుని నటించాలని అక్కినేని నిర్ణయించుకున్నారు.
తర్వాత కాలంలో ఒకటి రెండు ఆఫర్లు వచ్చినా అంగీకరించలేదు.అప్పటినుంచి 14 సంవత్సరాలు ఏఎన్ఆర్ ఎన్టీఆర్తో కలిసి ఒక్క సినిమా కూడా చెయ్యలేదు.అయితే 1977లో ‘చాణక్య చంద్రగుప్త’ సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటించారు..
తన సినిమాలో నటించాల్సిందిగా స్వయంగా ఎన్టీఆరే వచ్చి అడగడంతో ఏఎన్ఆర్ కాదనలేకపోయారు. 14 సంవత్సరాల తరువాత ఇద్దరు కలిసి నటించడంతో దానిపై ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి.ఈ సినిమాలో చాణుక్యుడి పాత్ర కీలకమైనది.. అక్కినేని పాత్రకు విలువ నిచ్చారు. సన్నివేశాలు కూడా అలా అల్లుకొచ్చారు.
ఆ ఎక్స్పెక్టేషన్స్ను రీచ్ కాలేక అనుకున్న స్థాయిలో ఆ సినిమా హిట్ కాలేదనే చెప్పాలి.. ఈ సినిమా తరువాత 1978లో ‘రామకృష్ణులు’, 1981లో ‘సత్యం శివం’ చిత్రాల్లో ఇద్దరూ కలిసి నటించారు. ఇక 1982 లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా సినిమాలు చేసారు కానీ ఆ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు.