దేవదాసు vs దేవదాసు! (2)

Sharing is Caring...

Many movies with one story ………………………………

అక్కినేని నటించిన దేవదాసు విడుదల అయిన 21 ఏళ్ల తర్వాత 1974 లో కృష్ణ దేవదాసు విజయ నిర్మల దర్శకత్వంలో వచ్చింది.ఇందులో పార్వతిగా విజయనిర్మల ,చంద్రముఖిగా జయంతి నటించారు. భారీ బడ్జెట్తో ఈ సినిమాను రూపొందించారు.

ఈ సినిమా కోసం అప్పట్లో అందుబాటులో ఉన్న టెక్నాలజీ అంతా ఉపయోగించారు. సినిమా కూడా చాలా రిచ్ గా ఉంది. కలర్ సినిమా,మంచి పాటలు, ఆకట్టుకునే సన్నివేశాలున్నాయి.కానీ కృష్ణ దేవదాసు విడుదల సమయంలోనే అక్కినేని దేవదాసు సినిమా కూడా విడుదలైంది.

కొత్త దేవదాసు థియేటర్ల పక్కన పాత దేవదాసు విడుదల చేయడంతో రెండు సినిమాల మధ్య పోలిక మొదలైంది. మంచి పాటలు, సాంకేతిక విలువలు ఉన్నప్పటికీ కృష్ణ దేవదాసు ప్రజలను అంతగా ఆకట్టుకోలేకపోయింది. నిజానికి పాత దేవదాసు పోటీగా విడుదల కాకపోయుంటే కృష్ణ దేవదాసు సూపర్ హిట్ అయ్యేదేమో. అప్పట్లో కృష్ణ ప్రయోగానికి కూడా ప్రశంసలు కూడా లభించాయి.

కొత్త దేవదాసు కొన్ని అంశాలలో ఉన్నతంగా రూపొందింది. ఆత్రేయ మాటలు, ఆరుద్ర గీతాలు వాటిలో సాహితీ విలువలు, ఆ గీతాలను రమేష్ నాయుడు స్వరపరచిన విధానం చిత్రానికి ప్రత్యేకతను చేకూర్చాయి. పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువ, మేఘాలమీద సాగాలి, కల చెదిరింది కథ మారింది, ఇది నిశీధి సమయం మొదలైన పాటలు పాత దేవదాసులో పాటలతో పోలిస్తే తక్కువేమి కాదు. తెలుగు దనంతో సంగీత సాహిత్య పరంగా పాటలన్నీ ప్రేక్షకులను అలరించాయి.

ఇక అప్పట్లో అక్కినేని కావాలనే దేవదాసు హక్కులు కొనుక్కుని కొత్త దేవదాసు పై పోటీగా విడుదల చేశారని ఫిలిం సర్కిల్స్ లో ఇప్పటికి చెప్పుకుంటారు. రెండూ ఒకేసారి విడుదల కావడంతో పోలిక అనివార్యమై కొత్త దేవదాసు జనాన్ని మెప్పించ లేకపోయింది.కృష్ణ నటనను అక్కినేని నటనతో పోల్చలేం. కానీ కృష్ణ తనకు చేతనైన రీతిలో ఆ పాత్రను పోషించారు.

ఈ క్రమంలోనే  కొత్త దేవదాసుకు డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరించిన నవయుగ వారికి అక్కినేని వ్యవహారశైలి పై కోపం వచ్చింది.సారధీ స్టూడియోస్ అప్పటికి నవయుగ వారి అజమాయిషీలోనే ఉండేది. కృష్ణ దేవదాసు ను దెబ్బతీసేందుకు అక్కినేని ప్రయత్నించారని నవయుగ యాజమాన్యం నమ్మింది. అప్పటికప్పుడే అక్కినేని నటించే సినిమాలకు స్టూడియో ఇవ్వకూడదని నవయుగ వారు నిర్ణయం తీసుకున్నారు.

అక్కినేని కి ఇది పెద్ద షాక్. దీంతో అక్కినేని తన షూటింగులన్నీ బెంగుళూరుకు తరలించుకున్నారు. ఆ తర్వాతనే అన్నపూర్ణ స్టూడియో ను నిర్మించారు. ఆ తర్వాత కాలంలో అక్కినేని కృష్ణ ల మధ్య రాజీ కుదిరింది. కృష్ణ ఏదీ మనసులో పెట్టుకుని కక్ష సాధించే రకం కాదు. 1979లో విజయ కృష్ణ పిక్చర్స్‌ బ్యానర్ పై “ హేమాహేమీలు చిత్రంలో అక్కినేని ని ప్రధాన పాత్రలో పెట్టి కృష్ణ సినిమా తీశారు.

కాగా దేవదాసు కథ నేపథ్యంలోనే నాటి ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ‘ దేవదాసు మళ్లీ పుట్టాడు ’ అనే సినిమా తీశారు. చంద్రముఖి , దేవదాసు లు మళ్లీ జన్మించినప్పుడు వృద్ధాప్యంలో ఉన్న పార్వతి వారిని ఏకం చేయడం అనే పాయింట్ తో దాసరి చేసిన సాహసోపేతమైన ప్రయత్నం ఇది.ఇందులో అక్కినేని, వాణిశ్రీ, సావిత్రి నటించారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!