సుదర్శన్ టి………….
చాలా మందికి తెలియని సంఘటన ఇది…స్వాతంత్రానికి ముందు బ్రిటీషు వారి ఆధ్వర్యంలో పనిచేసే భారత సైన్యం కులమతాలకు అతీతంగా పోరాడింది. వీళ్ళ వీరోచిత గాథలు ఎన్నో.
ఇంతటి శక్తివంతమైన సైన్యం ఒకచోట వుంటే ఎప్పటికైనా ప్రమాదం అని గ్రహించిన బ్రిటీష్ వారు సైన్యాన్ని చీల్చడానికి పన్నాగం పన్నారు.
దేశ విభజనకు ముందే 20 లక్షల భారత సైనికులు తాము పాకిస్థాన్ సైన్యంలో పనిచేయాలో లేక భారత సైన్యంలో పనిచేయాలో తేల్చుకుని లిఖిత పూర్వకంగా తెలియజేయాలని ఆదేశాలు ఇచ్చారు. హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, పారశీలు భారత్ వైపే వుంటారని వాళ్లకు తెలుసు కానీ వీరి నుండి ముస్లిం సైనికులను విడగొట్టినా భారత సైనిక శక్తి అనూహ్యంగా తగ్గుతుందని వారికి తెలుసు.
వీళ్లలో ఒకరు మేజర్ సాహెబ్ జ్యాదా యాకూబ్ ఖాన్. ఇతని పూర్వీకులు యూపీ రాంపూర్ సంస్థానానికి చెందినవారు. యాకూబ్ ఖాన్ నిర్ణయం తీసుకోడానికి ఇంటికి వెళ్ళాడు. తాను పుట్టి పెరిగిన సందులు, పొలాలు మహల్లలో తిరిగాడు. తాను సాధించిన పతకాలను చూసుకున్నాడు, ప్రేమతో నిమిరాడు. మర్నాడు పొద్దున కల్లా ఓ నిర్ణయానికి వచ్చాడు. పాకిస్థాన్ సైన్యంలో భాగం కావాలని నిర్ణయించుకున్నాడు.
తల్లికి తన నిర్ణయం చెప్పి ఆమెను కూడా తనతో పాకిస్థాన్ కు బయలుదేరమన్నాడు. అమ్మ వారించింది. ఈ గడ్డ మన దేశం, నీ పూర్వీకులు ఇక్కడ నుండే బ్రిటీషు వాళ్ళ మీద తిరుగుబాటు చేసి అసువులు బాసారు. నాకు మత రాజకీయాలు అర్థం కావు. కానీ ఇది మన మాతృభూమి, నువ్వుకూడా ఇక్కడే ఉండు అని బ్రతిమలాడింది. కానీ యాకూబ్ ఖాన్ మనసు మారలేదు. తల్లిని తన ఆస్తిపాస్తులను, తాను గెలిచిన పతకాలను వదలి పాకిస్థాన్ కు పయనమయ్యాడు.
కాలం కదిలింది, పాకిస్థాన్ సైన్యం ఏర్పడింది. దేశ విభజన తర్వాత పాక్ సైన్యం కశ్మీర్ మీద దండెత్తింది. ఆ సైన్యానికి నేతృత్వం యాకూబ్ ఖాన్ వహించాడు. పాక్ సైన్యం విజయవంతంగా కశ్మీర్ లో ప్రవేశించింది. కానీ వారి ఆటలు ఇక్కడ సాగలేదు.
భారత సైన్యం రంగంలోకి దిగింది. యాకూబ్ ఖాన్ ను భారత సైన్యం నిలువరించింది. భారత సైన్యానికి నాయకత్వం వహించిన వ్యక్తి మరెవరో కాదు సాహెబ్జ్యాదా యూనస్ ఖాన్..యాకూబ్ ఖాన్ సొంత అన్నయ్య.. ఇద్దరూ యుద్ధభూమిలో తలబడ్డారు. ఇద్దరూ ఖాన్ లే, ఇద్దరూ రాంపూర్ సంస్థానానికి వారసులే.
కానీ ఎవరి దేశంకోసం వారు పోరాడారు. యూనస్ ఖాన్ తన తమ్ముణ్ణి తుపాకీతో కాల్చాడు. తమ్ముడు గాయపడ్డాడు. అప్పుడు యూనస్ ఏమన్నాడంటే ” Don’t grieve Chotey. We are soldiers and we did our duty” cried out Younus Khan after shooting and injuring his brother on Pakistan side of the border. ఇది ఆనాడు విధి ఆడిన వింత నాటకం!
కొందరు ముస్లిములు పాకిస్థాన్ వెళ్లి ఉండవచ్చు. కానీ వాళ్ళ తోబుట్టువులు తల్లిదండ్రులు భారత్ వైపే నిలబడ్డారు.. పోరాడారు.
Tharjani ………………..
ఆ తర్వాత రోజుల్లో కూడా ఆ ఇద్దరూ సైన్యంలో కీలక స్థానాల్లో ఉండటం వల్ల సంబంధ బాంధవ్యాలు లేవు.1960లో యాకూబ్ కోల్కతాకు చెందిన ‘తుబా ఖలీలీ’ అనే భారతీయ అమ్మాయిని వివాహం చేసుకున్నప్పుడు యూనస్ పాకిస్తాన్లోని తన తమ్ముడికి వివాహ శుభాకాంక్షలు పంపాడు.
1965లో ఇండో పాక్ యుద్ధ సమయంలో యాకూబ్ ఒక ఆర్మర్డ్ డివిజన్కు నాయకత్వం వహిస్తున్నాడు. కానీ అప్పటికి కల్నల్ అయిన యూనస్ పదవీ విరమణ చేశాడు. యాకూబ్ 3-స్టార్ జనరల్ అయ్యాడు. 1982లో ఆ సోదరులు మళ్ళీ కలుసుకున్నారు.
యాకూబ్ విదేశాంగ మంత్రిగా అధికారిక హోదాలో ఢిల్లీకి వచ్చారు. అపుడు వారిద్దరూ ఆలింగనం చేసుకున్నారు..1948లో యుద్ధంలో జరిగిన ఘటనలు గురించి ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు.
ఇద్దరూ తమ తమ దేశాల కోసం అంకితభావంతో సేవ చేశారు. ఆ ఇద్దరూ తమ దేశ ప్రజల దృష్టిలో హీరోలు.కానీ సోదరులుగా వారు శారీరకంగా దూరంగా ఉన్నప్పటికీ ఎవరూ ఒకరినొకరు మర్చిపోలేదు.