India will get special recognition in the field of space………………
‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళుతున్న రెండవ భారతీయుడిగా ‘శుభాంశు శుక్లా’ చరిత్ర పుటల్లో నిలవనున్నారు. ఆక్సియం 4 మిషన్లో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా జూన్ 10 మంగళవారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5గంటల 52 నిమిషాలకు ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లబోతున్నారు.
అంతరిక్షానికి వెళ్లిన తొలి భారతీయుడు రాకేశ్ శర్మ. 1984లో సోవియెట్ యూనియన్ సహకారంతో సోయుజ్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి రాకేశ్ శర్మ వెళ్లారు. నాలుగు దశాబ్దాల తర్వాత ఈ ఘనత సాధించిన రెండో వ్యక్తిగా ‘శుభాంశు శుక్లా’ రికార్డుల్లోకి ఎక్కుతున్నారు. రోదసీ యాత్రకు రంగం సిద్ధమైంది.
ఈ రోదసీ యాత్రలో శుక్లాతో పాటు పోలండ్, హంగేరీకి చెందిన ముగ్గురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళుతున్నారు.ఈ మిషన్కు శుక్లా పైలట్గా వ్యవహరించబోతున్నారు.శుక్లా యాత్రతో అంతరిక్ష రంగంలో ఇండియాకు ప్రత్యేక గుర్తింపు రానుంది.
1985లో ‘శుభాంశు శుక్లా’ ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో జన్మించారు. భారత వైమానిక దళంలో యుద్ద పైలట్ గా పనిచేస్తున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన శుక్లా 2006 జూన్ 17న యుద్ధ విమానంలో నియమితులయ్యారు. గగన్ యాన్ మిషన్ కోసం 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాముల్లో శుక్లా కూడా ఒకరు.
శుక్లా Su-30 MKI, MiG-21, MiG-29, జాగ్వార్, హాక్, డోర్నియర్ 228 , An-32తో సహా వివిధ రకాల విమానాలలో 2,000 గంటలకు పైగా ప్రయాణించిన అనుభవం కలిగి ఉన్నాడు. 2021లో రష్యాలోని గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో ప్రాథమిక వ్యోమగామి శిక్షణను పూర్తి చేశారు. బెంగళూరులోని ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీలో శిక్షణ పొందారు.
ఆక్సియం 4 స్పేస్ మిషన్లో ఐదో క్రూ మెంబర్గా ‘జాయ్’ అనే చిన్న తెల్లని హంస బొమ్మను తీసుకు వెళుతున్నారు. గత పాతికేళ్లలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు 270 మందికి పైగా వ్యోమగాములు వెళ్లారు. వారిలో ఒక్క భారతీయుడు కూడా లేరు. ఆ ఘనత శుభాంశు శుక్లా కు దక్కనుంది.
నాసా సహకారంతో శుక్లా ఐఎస్ఎస్లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేస్తారు.’స్పేస్ఎక్స్’ సంస్థకు చెందిన ‘డ్రాగన్’ వ్యోమనౌక ఈ యాత్ర నిర్వహిస్తున్నది. దీంతో ప్రైవేట్ రోదసి యాత్ర ద్వారా ఐఎస్ఎస్కు వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా శుభాంశు శుక్లా చరిత్రకెక్కనున్నారు.