అలరించే డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ !!

Sharing is Caring...

Paresh Turlapati…………

మళయాళ ‘కిష్కింధాకాండం’ చూసారు కదా…అదే దర్శకుడినుంచి ఇప్పుడు ‘ఎకో’ మూవీ వచ్చింది.సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి ‘ఎకో’ నచ్చుతుంది..కేరళ కథకులకు క్రైమ్ స్టోరీ రాయాలంటే మొత్తం ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అవసరం లేదు. చిన్నవేలిముద్ర ఆచూకీ దొరికినా చాలు కథ అల్లేస్తారు అని మరోమారు నిరూపించారు.

ఐదు కోట్లు ఖర్చుపెట్టి తీసిన మళయాళ సినిమా ఇప్పటికే 50 కోట్ల వసూలు చేసి దూసుకు పోతుంది..తాజాగా NETFLIX లో కూడా రిలీజ్ అయి ట్రెండింగ్ లో ఉంది.ఇందుకు ప్రథమ కారకుడు దర్శకుడు దింజిత్ అయ్యతాన్  గతంలో ఈయన దర్శకత్వంలోనే వచ్చిన ‘కిష్కింధ కాండం’ మూవీ ప్రేక్షకులని సస్పెన్స్ తో కట్టిపడేసింది

‘కిష్కింధ కాండం’ లో కోతులతో కథ నడిపిన దర్శకుడు ‘ఎకో’లో కుక్కలతో నడిపాడు.అసలు దర్శకుడు కథ కోసం ఎన్నుకున్న లొకేషనే సినిమాకి సగబలం..  ఎక్కడో కేరళ ,కర్ణాటక సరిహద్దుల్లోని ఓ మారుమూల ఎత్తైన కొండమీద నుంచి కథ మొదలౌతుంది..  ఆ కొండమీద మలేషియా నుంచి వచ్చిన మిలాతియా (బియానా మోమిస్) ఒంటరిగా నివసిస్తూ ఉంటుంది.. ఆమెను గ్రామానికి తీసుకెళ్లడానికి కొడుకులు ప్రయత్నించినా రాకపోవడంతో పియోస్ (సందీప్ ప్రదీప్ ) అనే కుర్రాడ్ని సహాయకుడిగా పెట్టి వెళ్ళిపోతారు.. 

కానీ అప్పటికే ఆమెకు సాయంగా అక్కడ భయంకరమైన మలేషియన్ జాతి కుక్కలు కావలి కాస్తూ ఉంటాయి.. చూసారా.. కథ మొదట్లోనే ఆ ఒంటరి వృద్ధ మహిళ అడవిలో కొండమీద ఒంటరిగా ఎందుకుంటుంది ? పైగా ఆమెకు కుక్కల కాపలా ఏంటి ? అనే క్యూరియాసిటీ కలుగుతుంది.. మరోపక్క ఈమె భర్త కురియాచన్ (సౌరభ్ సచ్ దేవ్ ) కోసం నావీ అధికారులు , పోలీసులు గాలిస్తుంటారు.. 

ఇతను పోలీసులకు దొరక్కుండా కుక్కలను కాపలాగా పెట్టుకుని అడవిలో రహస్యంగా ఉంటున్నాడని వాళ్ళ అనుమానం.. అదే సమయంలో ఈ కురియాచన్ కోసం అడవిలోకి వెళ్లిన మోహన్ పోతన్  (వినీత్ ) హత్యకు గురవుతాడు.. కురియాచన్ అడవిలోనే ఉండి కుక్కలను ఉసిగొల్పి ఈ హత్యను చేయించి ఉంటాడని అందరూ అనుకుంటారు.. 

అసలు ఇంతకీ మోహన్ పోతన్ ను ఎవరు హత్య చేసారు ? పోలీసులు కురియాచన్ కోసం ఎందుకు గాలిస్తుంటారు ? మిలాతియా ఒంటరిగా అడవిలో కొండమీద ఎందుకుంటుంది ? అడవిలో కుక్కలను శాసిస్తున్న అసలు యజమాని ఎవరు ? లాంటి ప్రశ్నలకు జవాబులు మిగతా కథలో తెలుస్తాయి.

ఇదే కథను స్టుడియోలోనో, సిటీలోనో తీసుంటే ఈ కిక్ వచ్చేది కాదు… వాహనాల రణగొణ ధ్వనులు లేవు , అరుపులు కేకలు లేవు.. అప్పుడప్పుడు వినిపించే జంతువుల అరుపులు తప్ప అంతా నిశ్శబ్దం..ప్రేక్షకుడ్ని ఆ వాతావరణానికి కనెక్ట్ చేయడంలోనే దర్శకుడి పనితనం బయటపడుతుంది.. రొటీన్ కు భిన్నంగా చుట్టూ అడవి ,కొండపైన ఒంటరి వృద్ధ మహిళ , ఆమెకు కాపలాగా మలేషియన్ జాతి కుక్కలు .. లాంటి సెటప్పులు సహజంగా ప్రేక్షకుడికి కొంత థ్రిల్ ను కలిగిస్తాయి

ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది ఆ కుక్కలగురించే.. ఉత్తమ నటనకుగాను సినీ ఆర్టిస్టులకు అవార్డులు ఇచ్చే మాదిరి ఈ కుక్కలకు కూడా అవార్డులు ఇవ్వాలని రికమెండ్ చేయొచ్చు..ఎవరు ట్రైనింగ్ ఇచ్చారో , ఎక్కడ్నుంచి తీసుకొచ్చారో కానీ కొన్ని సీన్స్ లో భయపెట్టాయి.

ఆదరించాలే కానీ మనిషికి కుక్కకి మించి నమ్మకస్తులు ఎవరూ ఉండరు అనే కాన్సెప్ట్ తో అడవిలో కొండమీద ఒంటరి మహిళ జీవితాన్ని చూపించారు.. ఇలాంటి సినిమాల్లో ట్విస్టులు సహజం… పైగా క్రైమ్ రిలేటెడ్ సీన్స్ లో ఒకదానికొకటి లింకులు ఉంటాయి.. 

మొదట్నుంచీ జాగ్రత్తగా చూస్తేనే కానీ క్లైమాక్సులో సస్పెన్స్ చిక్కుముడి వీడదు.. ఓటిటిలోనే కదా అని మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ చూస్తే మనకు ఆ థ్రిల్ రాదు.. పైపెచ్చు కథ వాయువేగంతో పరుగులు పెట్టదు.. స్లోగా గూడ్స్ బండి మాదిరి నెమ్మదిగా నడుస్తుంది. అయితేనేమి కాస్త ఓపిగ్గా చూస్తే ఎన్నో ప్రకృతి రమణీయ దృశ్యాలు కంటికి ఇంపుగా కనిపిస్తాయి.. అలా మైమరచి చూస్తుండగానే సడెన్గా కుక్కలు మీదకు ఉరకడంతో ఒంటికి చెమటలు పడతాయి

చివరి అర్ధగంటలో క్లైమాక్స్ సన్నివేశాలు వచ్చేసరికి ఒకటొకటిగా ట్విస్టులు విడిపోయి అసలు విషయం ఏంటో తెలిసేసరికి సస్పెన్స్ వీడిపోతుంది.కాకపోతే ఆ కురియాచన్ పాత్రలో ఎక్కడో క్లారిటీ మిస్ అయినట్టు అనిపించింది.. ఎందుకంటే కధకు అతడి పాత్ర కూడా ప్రధాన ముడి సరుకే ఆ పాత్రను ఇంకొంచెం జాగ్రత్తగా ఎలివేట్ చేసుంటే బాగుండేది.. 

‘ప్రేమదేశం’ సినిమాలో అబ్బాస్ తో కలిసి ముస్తఫా , ముస్తఫా అని పాట పాడిన కుర్రాడు గుర్తున్నాడు కదా ఎస్ .. వినీత్. అతడొక్కడే ఇక్కడ మనకు తెలిసిన మొహం.. మిగతావన్నీ మళయాళీ  ముఖాలే .. అయితేనేమి ఎవరి పాత్రలో వారు జీవించేసి సినిమాకి  50 కోట్లు  తీసుకొచ్చేసారు.

కథలో ప్రధాన పాత్రధారులు మిలాతియా గా బియానా మోమిస్, కురియాచన్ తమ  పాత్రలను రక్తి కట్టించారు.. స్టూడియోల్లో తీసే సినిమాలకు ఎటువంటి ఫోటోగ్రఫీ అయినా పర్లేదు.. లైటింగ్ అటూఇటూ జరిపి అడ్జస్ట్ చేయొచ్చు.. కానీ ప్రకృతిలో, అది కూడా దట్టమైన అడవుల నేపథ్యంలో తీసే సినిమాలకు నాచురాలిటీ చెడకుండా చూపించడం చాలా అవసరం.

బాహుల్ రమేష్ స్క్రిప్ట్ తో పాటు తన కెమెరా పనితనం చూపారు. కేరళ అడవుల అందాన్ని అద్భుతంగా  చూపించారు.ఇక అడవి , కుక్కలు లాంటి కీలక సన్నివేశాలకు బీజీఎమ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.. ముజీబ్ మజీద్ చక్కటి నేపధ్య సంగీతం అందించాడు.. సినిమాలో సస్పెన్స్ చిక్కుముడి విడిపించడానికి దర్శకుడు ఏ మాత్రం తొందరపడలేదు.. స్లోగా ఒకటొకటిగా రహస్యాలను ఛేదిస్తూ క్లైమాక్సులో మాత్రమే సస్పెన్స్ గుట్టును విప్పాడు. 

కట్టే కొట్టే తెచ్చే అనే టైపులో చకచకా సినిమా అయిపోవాలి అనుకునేవాళ్ళకి ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు .. స్లోగా నడిచినా కథలో లీనమైపోయి ఓపిగ్గా చూసేవాళ్ళకి క్లైమాక్స్ తర్వాత మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూశామనే ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!