ఈ తరానికి తెలియని ‘బిజూ’ సాహసాలు!!

Sharing is Caring...

రమణ కొంటికర్ల…………………………  A leader the nation can be proud of

తన వారసులకు నిరాడంబరత కున్న ప్రాధాన్యత నేర్పిన ఖ్యాతి ఆయనది.  వ్యాపార దక్షతలో ఆయన ఓ మేనేజ్ మెంట్ గురు .. వారసత్వ రాజకీయాలపై విమర్శలు వెల్లువెత్తే దేశంలో.. తన వారసుడే  తమ  ప్రాంతానికి న్యాయం చేయగలరని నమ్మిన వ్యక్తి..  . ఫైటర్ పైలట్.. ఓ బిజినెస్ మ్యాగ్నెట్… ఆయనే బిజూ పట్నాయక్.

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తండ్రి.. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్. మన ప్రాంతంలోనో.. మన దేశంలోనో మనకొక గుర్తింపు, గౌరవం దక్కడమే గొప్పగా భావిస్తాం. కానీ, ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా స్మరించుకుంటున్నాయి. తమ రాయబార కార్యాలయాల్లో  చిరస్మరణీయుడిగా ఉండేందుకు.. ఆయన జ్ఞాపకాలను నిక్షిప్తం చేశాయి.

ఈ లెజెండరీ  పొలిటీషియన్ బిజూ పట్నాయక్  గురించి  ఈ తరంలో చాలామందికి తెలియకపోవచ్చు .  తెలిసినా, కేవలం రాజకీయ నాయకుడిగా, ఓ ముఖ్యమంత్రిగా మాత్రమే .. తెలిసినవారికి.. అంతకుమించి ఆయన గురించి తెలియజెప్పే కథనమిది.

ఇప్పటికీ రష్యా, ఇండోనేషియా ఈ రెండు దేశాలు బిజూ తమకు చేసిన సేవల్ని తల్చుకుంటూనే ఉంటాయి. ఇండోనేషియా డచ్ పాలకుల నుంచి స్వాతంత్య్రం సాధించడంలో బిజూ పట్నాయక్ అనే భారతీయుడి పాత్ర ఆ దేశమెన్నటికీ మరువలేనిది. అందుకే.. ఇండోనేషియా తమ దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భూమిపుత్ర అవార్డుతో బిజూను సత్కరించింది.

మరలాంటి బిజూ నాటి సేవలను కొనియాడుతూ ఏకంగా దేశ ప్రధాని మోడీ కూడా గతంలో ట్వీట్ చేశారు. అందుకే ఓసారి నాటి ఆయన సాహస ఘట్టాలను తలచుకుందాం.  బిజూపట్నాయక్ ముఖ్యమంత్రి అయ్యేకంటే ముందు ఓ పైలట్. రాయల్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి.  ఓవైపు బ్రిటిష్ పాలనలో ఆ ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు తన దేశభక్తి చాటుకున్న స్వాతంత్య్ర  సమరయోధుడు బిజు. అంతకుమించి నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వ్యూహాలను అమలు చేసే క్రమంలో ఓ పైలట్ గా సవాళ్లను స్వీకరించి.. సమర్థవంతంగా బాధ్యతలను నెరవేర్చిన ధీశాలి బిజు.

రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ అధికారికంగా లొంగిపోయిన తర్వాత.. ఆగ్నేయాసియాలో ఆక్రమించిన దేశాల నుంచి కూడా డచ్ పాలకులు వైదొలగారు. ఇండోనేషియా 1945, ఆగస్ట్ 17వ తేదీన స్వాతంత్య్రం సాధించింది. ఇండోనేషియా వ్యవస్థాపకులుగా సుకర్ణో, జహ్రీర్, మహమ్మద్ హట్టా వంటివారి పాత్రెంత కీలకమో.. ఆ సాధనలో బిజూది అదే స్థాయి పాత్ర.

డచ్ పాలకులు స్వతంత్ర రాజ్యంగా ఇండోనేషియాను ప్రకటించడానికి.. తిరిగి వెళ్లిపోవడానికి తిరస్కరించారు. కానీ, నాడు భారత ప్రధానిగా ఉన్న నెహ్రూ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. యూరప్ వలసవాదుల పెత్తనంపై దూకుడు ప్రచారం సాగించాడు. ఇండోనేషియా పరిస్థితిపై చర్చించడానికి ఆసియా దేశాలను ఏకతాటిపైకి తెచ్చి ఢిల్లీలో సమావేశం నిర్వహించారు.

అయితే రిపబ్లికన్లు జకర్తా స్వాధీనం కోసం యత్నిస్తున్న సమయంలో.. నెహ్రూ అభ్యర్థన మేరకు అప్పటికే బ్రిటీష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి.. స్వాతంత్రోద్యమంలో చేరిన బిజూ మళ్ళీ ఫైటర్ పైలట్ అవతారమెత్తాడు. డచ్ గగనతల నిఘాను కూడా తప్పించుకుని ఎన్నో సవాళ్లను ఛేదిస్తూ.. ఇండోనేషియాకు చేరుకుని.. ఇండోనేషియా ప్రధానితో పాటు.. వైస్ ప్రెసిడెంట్ ను ఢిల్లీలో జరుగుతున్న చర్చలకు తీసుకురాగలిగారు.

ఆ సమయంలో తన భార్య జ్ఞానాదేవితో కలిసి జకర్తా ప్రయాణమయ్యాడు. ఇండోనేషియా గగనతలంలోకి బిజూ విమానం వస్తే కూల్చేస్తామన్న డచ్ పాలకుల హెచ్చరికలను అసలు పట్టించుకోలేదు.   అంతేకాదు.. అదే జరిగితే, భారత గగనతలంలో ఎగిరే ప్రతీ డచ్ విమానాన్ని తామూ కూల్చేస్తామంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు బిజు. ఇండోనేషియా ప్రజలపై డచ్ వలస పాలకుల సార్వభౌమాధికారానికి ఒప్పుకునే ప్రసక్తే లేదని సందేశం పంపారు.

ఈ చరిత్రతో పాటు.. ఆ సమయంలో బిజూపై జరిగిన దాడులకు సంబంధించిన పలు ఘట్టాలను వివరించేలా ఇండోనేషియా రాయబార కార్యాలయంలో.. బిజు మెమరీస్ కోసం ఓ ప్రత్యేక గదినే కేటాయించడం విశేషం. మరో దేశం నుంచి మన భారతీయుడికి దక్కిన ఓ అరుదైన గౌరవం.

ఆమధ్య  ‘ఏ మూమెంట్ ఆఫ్ రిఫ్లెక్షన్’ ప్రదర్శనలో భాగంగా 70 ఏళ్ల ఇండోనేషియా-ఇండియా బంధాన్ని వివరించేలా ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసింది ఆ కాన్సులేట్. అందులో ఎందరో ప్రధానుల చెంత ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బిజూ సేవలనూ స్మరించుకోవడం విశేషం. అందుకే బిజూ సేవలకు ఆ దేశ అత్యున్నత పురస్కారమైన భూమిపుత్ర అవార్డ్ వరించడమే కాదు.. ఆ దేశ గౌరవ పౌరసత్వాన్నీ ఇచ్చి సత్కరించింది ఇండోనేషియా.

కొసమెరుపేంటంటే.. బిజూ సూచించిన పేరునే ఇండోనేషియా ప్రెసిడెంట్ సుకర్ణో.. తన కూతురుకు మెగావతి సుకర్ణోపుత్రిగా నామకరణం చేయడం మరో విశేషం. ఆ మెగావతే ఇండోనేషియా ఐదో అధ్యక్షురాలిగా 2001-04 మధ్య కాలంలో ఎన్నికయ్యారు.

బ్రిటీష్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా.. బర్మా రంగూన్ లో జరుగుతున్న జపనీస్ దాడుల నుంచి ఎందరో బ్రిటీషర్స్ ఫ్యామిలీస్ ను రెస్క్యూ చేసి కాపాడిన బిజు.. హిట్లర్ దాడుల నుంచి నాడు భారత్ మిత్రదేశమైన సోవియట్ యూనియన్ రష్యాకూ అదే సాయమందించారు. బిజూ సేవలకుగాను.. రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 50 ఏళ్లైన సందర్భంగా ఆయన్ను రష్యా కూడా  ప్రత్యేకంగా స్మరించుకుంది.

గాంధీ మార్గానికి ఆకర్షితుడైన బిజూ పట్నాయక్.. బ్రిటీష్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నప్పటికీ.. భారత స్వాతంత్ర సమరానికి అదే స్థాయిలో విధేయతను ప్రకటించేవాడు. అందులో భాగంగానే రహస్యంగా జరిగే సమావేశాలకు నాటి జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, అరుణా అసఫ్ అలీ వంటి వారినెందరినో తన విమానాల్లో అంతే రహస్యంగా చేరవేసేవాడు.

అలా బ్రిటీషర్స్ అనుమానాలకు గురైన బిజూ పట్నాయక్.. తన గూఢచార చర్యలకుగానూ 1943, జనవరి 13వ తేదీన అరెస్టు అయి .. రెండేళ్ల జైలు శిక్షకు కూడా గురయ్యాడు. ఇదే విషయాన్ని సూచించే నాటి లేఖనే ట్విట్టర్ లో ప్రధాని మోడీ షేర్ చేస్తూ ఆయన సేవలను కొనియాడారు.

జ్యుడీషియల్ సర్వీసెస్ లో పనిచేసే తన తండ్రి లక్ష్మీనారాయణ… నాటి ఒరియా ఉద్యమంలో కీలకపాత్రధారి. ఆ సమయంలో తండ్రితో పాటు తిరిగిన బిజూపై.. ఆయన ప్రభావం మెండుగా కనిపించేది.  బిజూ జీవన గమనాన్ని మార్చడంలో రెండు సంఘటనలు కీలక పాత్ర పోషించాయి.

1927లో ఖాదీ పర్యటనలో భాగంగా కటక్ కు వచ్చిన గాంధీని చూడటానికి తన పదకొండేళ్ల వయస్సులో వెళ్లినప్పుడు బ్రిటీష్ ఆఫీసర్ తనపై దాడి చేసిన ఘటనతో పాటు.. తాను కటక్ పాఠశాలలో చదువుతున్నప్పుడు ఎగురుతున్న ఎరోప్లేన్ ను చూసినప్పుడు ఆయన మస్తిష్కంలో రికార్డైన విషయాలే ఆ తర్వాత ఆయన్ను ఓ ఫైటర్ పైలెట్ స్థాయికి ఎదిగేందుకు కారణమయ్యాయి.

ఒరిస్సా అసెంబ్లీకి నార్త్ కటక్ స్థానం నుంచి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బిజూ పట్నాయక్.. చౌద్వారా వేదికగా కళింగ ట్యూబ్స్ పేరుతో ఆసియాలోనే అతి పెద్ద పైపుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన బిజినెస్ మ్యాన్ కూడాను. అంతేకాదు స్వాతంత్ర పోరాటం నడుస్తున్న సమయంలో కళింగ ఎయిర్ లైన్స్ ను కూడా స్థాపించాడు. బిజూ డకోటా ఏరోప్లేన్సే ఇండోనేషియా స్వాతంత్ర పోరాటంలో కీలక భూమిక పోషించాయి. ఆ తర్వాత 1953లో కళింగ ఎయిర్ లైన్స్ ఇండియన్ ఎయిర్ లైన్స్ లో విలీనమైంది. ఇండియా-టిబెట్ మధ్య ఎయిర్ లింక్స్ పునరుద్ధరించడంలోనూ బిజూది కీలకపాత్ర. అప్పటికే చైనా దురాక్రమణలతో సతమతమవుతున్న టిబెటన్ ఫైటర్స్ కూ బిజూ పట్నాయక్ సాయమందించారు.

మొత్తంగా తన జీవన గమనంలో బహుముఖ పాత్రలు పోషిస్తూ.. సాహసాలతో సావాసం చేస్తూ.. ఓ నైపుణ్యం కల ఫైటర్ పైలట్ గా మాతృదేశానికే కాకుండా.. మిత్ర దేశాలకూ సేవలందించిన ఘనుడు బిజూ పట్నాయక్. ఓ బిజినెస్ మ్యాన్ గా కళింగ ఎయిర్ లైన్స్ తో ఆకాశమంతెత్తు ఎదిగిన వ్యాపారదక్షుడు బిజు.

45 ఏళ్ల వయస్సులో 1961లో ఒరిస్సా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. శక్తివంతమైన నాయకుడిగా గుర్తింపు పొందడమే కాకుండా.. తన వారసత్వంగా తన కుమారుడైన నవీన్ పట్నాయక్ నూ ఓ కవిగా, ఓ ముఖ్యమంత్రిగా  జాతికందించాడు. ఆరడుగుల 2 అంగుళాల ఎత్తైన బిజూ అనే విగ్రహం.. 1997లో భౌతికంగా అస్తమించినా.. ఆయన వేసిన చెరగని ముద్రలను.. దేశ, విదేశాలు ఇంకా  గుర్తు చేసుకుంటూనే ఉన్నాయి.

అయితే ఇప్పుడు బిజూ గురించి చెప్పుకుంటున్నవి మచ్చుకు కొన్ని మాత్రమే. శ్రమ, పట్టుదల, సంకల్పం, ఓర్పు, నేర్పరితనం, క్రమశిక్షణ ఇలా ఎన్నో విశేషాలు కలిస్తే కనిపించే కేరీర్ బిజూ పట్నాయక్ ది . అందుకే బిజూ ఈజ్ ఏ లెజెండ్. ఇలాంటివారి బయోగ్రఫీస్ నేటితరానికి తెలియాలంటే సినిమాలు, రచనల రూపంలో కూడా మరింత అందుబాటులోకి రావాల్సి ఉంది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!