రాబోయే రోజుల్లో పది లక్షల గొంతుకలను తయారు చేస్తామంటున్న తీన్మార్ మల్లన్న నాగార్జున సాగర్ ఉపఎన్నికలో పోటీ చేసే యోచనలో ఉన్నారు. ఇక్కడ మల్లన్న బరిలోకి దిగితే పోటీ రసవత్తరం గా మారుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రత్యర్థులకు దడ పుట్టించిన మల్లన్న తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. ఎమ్మెల్యే నోముల నరసింహయ్య ఆకస్మిక మరణంతో సాగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇపుడు అందరి కన్ను ఈ నియోజకవర్గంపైనే పడింది. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి మళ్ళీ బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో కూడా జానారెడ్డే పోటీ చేశారు. కానీ నరసింహయ్య చేతిలో ఓడిపోయారు. ఈ సారి ఇక్కడ జనసేన కూడా అభ్యర్థిని బరిలోకి దించనుంది. హీరో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని వార్తలు వస్తున్నాయి. తెరాస బలమైన అభ్యర్థి కోసం గాలిస్తోంది. నోముల నరసింహయ్య కుమారుడు భగత్ కి టిక్కెట్ ఇస్తారా లేదా అనేది ఇంకా ఖరారు కాలేదు. దుబ్బాక సీటు గెలుచుకుని , గ్రేటర్ లో బలం పెంచుకున్న బీజేపీ కూడా సాగర్ పై కన్నేసింది. బలమైన అభ్యర్థి కోసం ఆపార్టీ కూడా అన్వేషిస్తోంది. టీడీపీ కూడా బరిలోకి దిగవచ్చు.
నల్గొండ జిల్లాలో కీలకంగా ఉన్న జానారెడ్డి కుటుంబాన్ని బీజేపీలో చేర్చుకోవాలని ఆ పార్టీ నేతలు గట్టి ప్రయత్నాలు చేసారు. కానీ జానా రెడ్డి సుముఖత చూపలేదు. ఇక జానారెడ్డి విషయానికొస్తే 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నోముల నరసింహయ్య చేతిలో 7,771 ఓట్ల తేడాతో ఓడిపోయారు, ఆ నాటి ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన కంకణాల నివేదితకు 2675 ఓట్లు వచ్చాయి. ఓడిపోయినప్పటికీ జానా కుటుంబానికి ఆప్రాంతంలో మంచి పలుకుబడి ఉంది.
కాంగ్రెస్ లో 32 సంవత్సరాలనుంచి ఉన్న జానారెడ్డి ఎన్నో పదవులు అనుభవించారు. మొదటిసారిగా 83 లో జరిగిన ఎన్నికల్లో జానా చలకుర్తి టీడీపీ ఎమ్మెల్యే గా గెలిచారు. క్యాబినెట్ మంత్రి అయ్యారు. అప్పట్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఎందరినో రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 1988 లో ఎన్టీఆర్ 31 మంది మంత్రులకు ఉద్వాసన పలికిన తీరుకి నిరసన గా టీడీపీ నుంచి బయటకొచ్చారు. కొన్నాళ్ళు సొంతంగా పార్టీ నడిపారు. తర్వాత కాంగ్రెస్ లో చేరారు. నాటినుంచి నేటి వరకు కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. మొదటి నుంచి జానారెడ్డి ప్రజలతో కలసి తిరుగుతూ , వారి సమస్యల కోసం పనిచేస్తూ జననేత గా ఎదిగారు. అందుకే జనం జానారెడ్డి ని అంతగా ఇష్టపడతారు. కాంగ్రెస్ అధికారం లో వచ్చి ఉన్నట్టయితే జానా యే సీఎం అయ్యేవారు. తెలంగాణ ఏర్పడిన దరిమిలా 2014,2018 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పరాభవాలను ఎదుర్కొంది. ఇక ముందు కూడా కష్టమే. ఇది గమనించి చాలామంది నేతలు బీజేపీలోకి వెళుతున్నారు.
సత్తాగల నేతలను గుర్తించి బీజేపీ పార్టీలో చేర్చుకుంటుంది.ఒకప్పుడు కమ్యూనిస్టుల , కాంగ్రెస్ నేతల హవా నల్లగొండ జిల్లాలోఉండేది. తెరాస వచ్చాక ఆ పార్టీలు బలహీన పడ్డాయి. ఈ సారి ఇక్కడ బహుముఖ పోటీ జరుగుతుంది. ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఓట్ల లెక్కింపు మే 2న జరుగుతుంది. ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 31న నామినేషన్లను పరిశీలిస్తారు.