హిమానీ నదాలు ఎండి పోతున్నాయా ?

Sharing is Caring...

Are glaciers drying up? ………………………..

ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు వేగంగా కరిగి అక్కడిక్కడే ఎండి పోతున్నాయి. హిందూ కుష్ హిమాలయ (HKH) ప్రాంతంలో హిమానీ నదాలు వాతావరణ మార్పుల కారణంగా కుంచించుకుపోతున్నాయి. లేదా ఎండిపోతున్నాయి. ఈ ప్రక్రియ గతంలో కంటే వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే కొన్ని హిమానీ నదాలు 21వ శతాబ్దం చివరి నాటికి పూర్తిగా కనుమరుగవుతాయని అంచనా వేస్తున్నారు.

గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ఇప్పటికే హిమాలయాలను ప్రభావితం చేస్తున్నదని భావిస్తున్నారు. వాతావరణంలో మార్పు కారణంగా వేసవి కాలంలో హిమానీనదాల్లో జలరాశి వేగంగా కుంచించుకు పోవచ్చు.ఫలితంగా తక్కువ ఇన్‌పుట్‌కు దారితీయవచ్చు.

మానవ కార్యకలాపాల వల్ల పెరుగుతున్న గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు భూమి ఉష్ణోగ్రత పెరగడానికి కారణమవుతున్నాయి. దీనివల్ల ధ్రువ ప్రాంతాలు, హిమానీ నదాలున్న ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.  

హిమాలయాలలో దాదాపు 15,000 హిమానీ నదాలు ఉన్నాయి. ప్రతి వేసవిలో ఈ హిమానీ నదాలు కరిగి వచ్చే నీరు సింధు,గంగా, బ్రహ్మపుత్ర నదులలోకి  వచ్చి చేరతాయి. ఈ మూడు నదుల నుండి వచ్చే నీటిపై దాదాపు 500 మిలియన్ల మంది ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది.
 
ప్రపంచంలోని ఇతర నదుల మాదిరిగానే ఈ హిమానీ నదాలు కూడా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా డ్రై అయ్యే ప్రమాదం పొంచి ఉంది. హిమానీ నదాలు ఏటా మంచుతో తిరిగి నిండడానికి భారీ వర్షపాతంపై ఆధారపడతాయి. ఈ హిమానీనదాలు కరిగితే, వాటిపై ఆధారపడిన చాలా మంది ప్రజలు శీతాకాలంలో వరదలకు గురవుతారు.. వేసవిలో కరువుకు గురవుతారు.

ఇటీవల జరిగిన ఒక శాస్త్రీయ అధ్యయనం లో ఈ విషయాలు వెల్లడి అయ్యాయి. పారిస్ ఒప్పందంలో అనుకున్న విధంగా గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేస్తే 40 నుంచి 45 శాతం హిమానీ నదాల మంచు నీటిని సంరక్షించవచ్చని అధ్యయనం చెబుతోంది.

ప్రపంచం ప్రస్తుత 2.7 డిగ్రీల సెల్సియస్ వార్మింగ్ దిశగా కొనసాగితే కేవలం 24 శాతం మాత్రమే నీరు మిగులుతుంది. దీంతో యూరోపియన్ ఆల్ప్స్, ఉత్తర అమెరికా రాకీస్, ఐస్‌లాండ్ వంటి ప్రాంతాలు ప్రమాదంలో పడతాయని అధ్యయనం చెబుతోంది.

200,000కి పైగా హిమానీనదాల భవిష్యత్తును, వివిధ వార్మింగ్ దృశ్యాలను అంచనా వేయడానికి ఎనిమిది హిమానీనద నమూనాలను అధ్యయనంలో పరిశీలించారు.. అధ్యయనకర్తల విశ్లేషణ ప్రకారం, ఉష్ణోగ్రతలను స్థిరీకరించినప్పటికీ, హిమానీనద ద్రవ్యరాశి రాబోయే దశాబ్దాల్లో వేగంగా క్షీణిస్తుంది.

ఈ ప్రభావం శతాబ్దాలపాటు కొనసాగవచ్చు అంటున్నారు .హిమానీ నదాలు కేవలం అందమైన సహజ దృశ్యాలు మాత్రమే కాదు. ఇవి నీటికి జీవనాధారం. ఇవి వ్యవసాయం, జలవిద్యుత్, తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతున్నాయి.ఇపుడు హిమానీ నదాలు కరిగి, డ్రై అయిపోతే ప్రజల భవిష్యత్ ఏమిటి అనేది పెద్ద ప్రశ్న.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!