Target Karachi Port…………………
కొద్దిరోజులుగా అరేబియా సముద్రంలో మోహరించిన భారత్ విమాన వాహక నౌక INS విక్రాంత్ పాకిస్తాన్ కి చెందిన కరాచీ ఓడరేవు ను టార్గెట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఓడరేవుపై క్షిపణులతో దాడులు చేసినట్టు ..ఫలితంగా ఓడరేవు ధ్వంసమైనట్టు ప్రచారం జరుగుతోంది.
కరాచీ తీరం వెంబడి ఉన్నఎకనామిక్ ఎక్స్ క్లూజివ్ జోన్లో నుంచి పాక్ క్షిపణి ప్రయోగాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం అందటంతో ఈ దాడులకు దిగినట్టు చెబుతున్నారు.
పాక్ కు కరాచీ ఆయువుపట్టు. అందుకే కరాచీపై దృష్టి పెట్టిందని అంటున్నారు.అలాగే పాకిస్తాన్ నావికాదళానికి కరాచీ, ఒర్మారాలో స్థావరాలు ఉన్నాయి. పాక్ నేవీ ప్రధాన కార్యాలయాలు,యుద్ధనౌకలు, జలాంతర్గాములు కరాచీలో,ఒర్మారాలో ఉన్నాయి.
ఈ రెండు నావికా స్థావరాలను దెబ్బ తీస్తే .. పాక్ బాగా బలహీన పడుతుందని భావిస్తున్నారు. అందుకే విక్రాంత్ ను ప్రయోగించారని అంటున్నారు.ఇదే నిజమైతే పాక్ కి పెద్ద నష్టమే అని చెప్పుకోవచ్చు. పాక్ ఎలాంటి దాడులు జరగలేదని అంటోంది
INS విక్రాంత్ బాహుబలి లాంటిది .. అది రంగంలోకి దిగితే కష్టమే అని పాకిస్తాన్ భయపడుతోంది. పాకిస్తాన్ దగ్గర ఒక్క విమాన వాహక నౌక కూడా లేదు .. అది భారత్ కి ప్లస్ పాయింట్. విక్రాంత్ నౌక MiG-29K, Kamov-32, MH-60R, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లతో సహా 30 రకాల విమానాలు, హెలికాప్టర్లను మోసుకెళ్లగలదు. దీనితో పాటు, ఇది తేలికపాటి యుద్ధ విమానాలను కూడా క్యారీ చేసే కెపాసిటీ కలిగి ఉంది.
ఇక కరాచీ రేవు గురించి చెప్పుకోవాలంటే … పాకిస్థాన్లోనే అతిపెద్ద పోర్ట్. అలాగే దక్షిణాసియాలోనే అతి పెద్ద, అత్యంత రద్దీగా ఉండే పోర్టు. పాకిస్థాన్ సరుకు రవాణాలో దాదాపు 60 శాతం, విదేశీ వాణిజ్య కార్యకలాపాలు 95% వరకు ఈ పోర్ట్ ద్వారానే జరుగుతాయి.
దీన్నిబట్టి కరాచీ పోర్టు పాకిస్తాన్ కి ఎంతో కీలకమని చెప్పుకోవచ్చు. కరాచీ పోర్ట్ పాకిస్తాన్ కు భారీ ఆదాయాన్నితెచ్చి పెడుతుంది. పాకిస్తాన్ పన్ను రాబడిలో కరాచీ నగరం వాటా 35 శాతం మేరకు ఉంటుంది.పాక్ జీడీపీలో కరాచీ వాటా 25 శాతం ఉంటుంది. అలాగే పాక్ నాకౌదళం కేంద్ర కార్యాలయం ఇక్కడే ఉంది.
మొత్తం మీద చూస్తే పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు కరాచీ గుండెకాయ వంటిది. ఆర్థికపరంగా.. రక్షణపరంగా కరాచీ కీలకం కాబట్టే భారత్ దీన్ని టార్గెట్ చేసింది. దీనిపై దాడి జరిగితే ఆర్ధిక మూలాలు దెబ్బ తింటాయి. ఇప్పటికే పాకిస్తాన్ పీకల్లోతు అప్పుల్లో ఉన్న విషయం తెలిసిందే. కరాచీ విధ్వంసం అయితే పాక్ కుదేలు అవుతుందని భావిస్తున్నారు.
గతంలో కరాచీ ఓడరేవుపై ఇండియా రెండుసార్లు దాడి చేసింది. 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో భారత నౌకాదళం కరాచీ పోర్టుపై రెండుసార్లు మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ ట్రైడెంట్ పేరిట చిన్న మిస్సైల్ బోట్లను ఉపయోగించిన ఇండియన్ నేవీ కరాచీ పోర్టుపై మెరుపుదాడి చేసింది.
ఈ దాడిలో పాకిస్తాన్ నౌకలు మునిగిపోయాయి, కరాచీలోని చమురు నిల్వ కేంద్రాలు భగ్గుమన్నాయి. ఈ ఆపరేషన్ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్ 4న భారత్ ‘నేవీ డే’ జరుపుకుంటున్నాం.
ఆ తర్వాత ‘ఆపరేషన్ పైథాన్’ పేరిట ఇండియన్ నేవీ మరోసారి ఆ పోర్టుపై దాడి చేసింది. దీంతో మిగిలిన ఇంధన నిల్వలు, పోర్ట్ మౌలిక సదుపాయాలు మరింతగా దెబ్బతిన్నాయి. ఈ దాడుల వల్ల యుద్ధ సమయంలో కరాచీ పోర్ట్ పనికి రాకుండా పోయింది. ఇది పాకిస్తాన్ కు తీవ్ర నష్టాన్ని కలిగించింది.ఇక తాజాగా దాడి జరిగి ఉంటే భారీగా నష్టపోవచ్చు అంటున్నారు. కొద్దీ రోజులు పోతే కానీ వాస్తవాలు బయటకు రావు.