Temple City ……………………….
ఒక పర్వతంపై ఒక ఆలయం ఉంటుంది.. లేదంటే రెండు.. మూడు ఆలయాలు ఉంటాయి… కానీ ఏకంగా 900 ఆలయాలు ఒకే చోట..అదీ ఒక పర్వతంపై ఉండటం అరుదైన విషయమే.అది కూడా ఇండియాలోనే .. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే . మనదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ‘శత్రుంజయ పర్వతం’ పై 900 ఆలయాలు ఉన్నాయి.
ఈ పర్వతం పాలీతానా పట్టణం సమీపం లోని శత్రుంజయ నది ఒడ్డున ఉంది. పాలీతానా భావ్నగర్ జ్లిలా భావ్నగర్ కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. పర్వతంపై అన్ని ఆలయాలు ఉన్నకారణంగా ప్రతీయేటా భక్తులు ఇక్కడికి తండోపతండాలుగా తరలివస్తుంటారు
ఈ పర్వతంపై జైన తీర్థంకరుడు భగవాన్ రుషబ్దేవ్ ధ్యానం చేశాడని చెబుతారు. ఆయన ఇక్కడే తన తొలి ఉపదేశాన్ని ప్రవచించారని అంటారు. ఈ పర్వతంపై ఉన్న ప్రధాన ఆలయం అత్యంత ఎత్తున ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే సుమారు 3 వేలకు పైగా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. 24 తీర్థంకరుల లోని 23 మంది తీర్థంకరులు ఈ పర్వతాన్ని సందర్శించారు. ఈ కారణంగా ఈ పర్వతానికి ఇంత మహత్తు వచ్చిందని అంటారు.
ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ పర్వతం జైనులకు పరమ పవిత్రమైన క్షేత్రం.జీవితంలో హిందువులు కాశీకి ఒక్కసారైనా వెళ్లాలని ఎలా అనుకుంటారో …. జైనులు ఆ క్షేత్రాన్నీ ఒక్కసారైనా దర్శించాలని కోరుకొంటారు.ఇక్కడ మహావీర్ జయంతి .. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.
ఈ పాలితానా కు అతి సమీపంలో ఉన్న శత్రుంజయ పర్వత పంక్తులు ఉన్నాయి. జైన మతానికి ఈ శత్రుంజయ పర్వత పంక్తులకు విడదీయరాని బంధం ఉంది. ఈ పర్వత పంక్తుల్లో మొత్తం 3వేల దేవాలయాలు ఉండగా అందులో పాలితానా లో మాత్రమే 900 ఆలయాలు ఉన్నాయి.
ఈ మొత్తం ఆలయాల్లోప్రధానమైనది రిషభనాధ దేవాలయం. ఈ రిషభనాధ దేవాలయంతో పాటు ఇక్కడ ఉన్నదాదాపు అన్ని ఆలయాలు చల్లని పాలరాతి నిర్మితాలే. ముఖ్యంగా కుమార్ పాల్, విమల్ షా, సంప్రీతి దేవాలయాలు ముఖ్యమైనవి. కుమార్ పాల్ ఆలయంలో అనేక పురాతన బంగారు ఆభరణాలను భద్రపరిచారు.
ఇక్కడ ఉన్న శిల్ప సంపద కూడా పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటుంది. అద్భుతమైన పలు కళాకృతులు కనిపిస్తాయి. సూర్యకిరణాలు పడినంతనే ఈ ఆలయం శోభాయమానంగా వెలిగిపోతుంటుంది. అలాగే చంద్రుని వెలుగులోనూ ఆలయాలు తళుకులీనుతుంటాయి.
ఈ కొండ పర్వత పాదం నుంచి పర్వత శిఖరంపై వరకూ కొండనే తొలచి 3,750 రాతి మెట్లను నిర్మించారు. పర్వతం పైకి వెళ్లే సమయంలో జైనులు ఆహారాన్ని, నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించరు. కఠిన ఉపవాసంతో జైనులు ఈ తీర్థయాత్రను పూర్తి చేస్తారు. ఎంత వేగంగా ఎక్కినా పర్వత శిఖరం పై భాగం చేరడానికి దాదాపు గంటన్నర సమయం పైగా పడుతుంది.
ఈ పర్వత శిఖరం పై ఉన్న మొత్తం ఈ దేవాలయాల నిర్మాణం 11వ శతాబ్ద కాలం నుంచి 20వ శతాబ్దం వరకూ కొనసాగింది. అదే విధంగా 11వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకూ ఈ దేవాలయాల నిర్వహణ ను ‘ఆనంద్ జీ, కళ్యాణ్ జీ ‘అనే స్వచ్ఛంద సంస్థ చూస్తోంది.
ఇక్కడకు దగ్గరగా అంటే భావ్ నగర్ లో విమానాశ్రయం ఉంది. అక్కడి నుంచి పాలితానా కు ప్రైవేటు ట్యాక్సీలు లభిస్తాయి.పాలితానా లో రైల్వే స్టేషన్ కూడా ఉంది. భావ్ నగర్ నుంచి పాలితానాకు ప్రతి గంటకు ఒక ప్రభుత్వ బస్సు అందుబాటులో ఉంది.
ప్రపంచంలోని ఏకైక శాకాహార పట్టణం గా గుర్తింపు పొందిన సిటీ పాలీతానా ఒక్కటే.ఈ సిటీ శాకాహారులకు చెందినదిగా పేరు గడించింది. ఇక్కడివారెవరూ మాంసం ముట్టరు. ఈ ప్రత్యేకతే ఈ సిటీ కి ఒక గుర్తింపును తీసుకువచ్చింది. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ పర్వతాన్ని అధిరోహిస్తుంటారు.
కొన్నివందల సంవత్సరాలుగా ఈ పట్టణం జైనులకు విశ్వాస కేంద్రంగా అలరారుతోంది.పాలితానాలో హోటళ్ళు, రిసార్ట్లు, ధర్మశాలలు అందుబాటులో ఉన్నాయి . ఇక్కడ సాధారణ హోటళ్ల నుంచి మరింత విలాసవంతమైన వసతి వరకు వివిధ బడ్జెట్లలో లభిస్తాయి.