చిన్నమ్మ మళ్ళీ చిటికెలు వేస్తుందా ?

Sharing is Caring...

జయలలిత నెచ్చెలి  శశికళ  కొద్దీ రోజుల్లో జైలునుంచి విడుదల కాబోతోంది.  ఇటీవలే జరిమానా మొత్తం రూ.10కోట్ల 10 వేలు చెల్లించడంతో చిన్నమ్మ విడుదలకు మార్గం సుగమమయింది. శశికళ జైలునుంచి వచ్చాక సైలెంట్ గా ఉంటారా ? మళ్ళీ రాజకీయాల్లోకి  వస్తారా ? లేదా అనేది ఇంకా సస్పెన్సుగా నే ఉంది.  2017 లో శశికళ కర్ణాటక జైలుకు  వెళ్లే ముందు తన నెచ్చెలి జయ సమాధి వద్దకు వెళ్లి  నివాళులు అర్పించింది. ఆ సందర్భంగానే మూడు మార్లు చేతితో సమాధిపై  చరిచి శపథం పూనింది.   ఆ సమయంలో శశికళ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు ఆమె ముఖ కవళికలు చెప్పకనే  చెప్పాయి . అందరూ టీవీల్లో కూడా చూసారు. మూడు మార్లు చేతితో సమాధిపై  ఆలా చరిస్తే వారి ఆచారం ప్రకారం అది శపథం పూనినట్టు అని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఆమె శపథం ఎవరిపై ? ఎందుకు అనేది ఎవరికి తెలీదు.

శశికళ కూడా బయటకు చెప్పలేదు.అయితే అప్పటి తాత్కాలిక సీఎం  పన్నీర్ సెల్వం  మరికొందరు బీజేపీ నేతలపై ఆమె గుర్రుగా ఉన్నారని … కుట్ర చేసి జైలుకు పంపారని పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే చెప్పుకున్నారు. చిన్నమ్మ జైలుకెళ్లాక కథ  మొత్తం మారిపోయింది. అన్నా డీఎంకే పార్టీ ఏకంగా శశినే బహిష్కరించింది.  దీంతో చిన్నమ్మ మేనల్లుడు దినకరన్ “అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం “అనే పార్టీ పెట్టారు. చీలిపోయిన పన్నీర్ పళని వర్గాలను కలిపి  ప్రభుత్వం కూలిపోకుండా బీజేపీ తెర వెనుక నుంచి చక్రం తిప్పింది.  దినకరన్ కూడా మొదట్లో ఒకటి రెండు సార్లు వెళ్లి తర్వాత దూరంగా ఉండిపోయాడు. గడచిన నాలుగేళ్ళ కాలంలో చిన్నమ్మ జైలుకే పరిమితమైంది . బెయిల్ కూడా రాలేదు.

జైలునుంచి చక్రం తిప్పుదామని  శశికళ  కన్న కలలు  కరిగిపోయాయి.జయ ఆస్తులు మిగులుతాయి అనుకుంటే అవి దీపకు వెళ్లాయి . ఇటు పార్టీ పోయింది. మరో పక్క కట్టుకున్న భర్త పోయాడు . మేనల్లుడు మాట వినడం లేదు.పాపం చిన్నమ్మకు షాకులపై షాకులు తగిలాయి. ఇంకొకరైతే ఇన్ని షాకులకు గుండె ఆగి పోయేవారు. కొంచెం గుండె దిటవు చేసుకుని జైలు నుంచి విడుదల అయ్యాక వచ్చే మేలో జరగనున్న ఎన్నికల్లో చక్రం తిప్పుదామని ప్లాన్ చేసుకుంటే … మళ్ళీ మరో మెగా షాక్.  శశికళ కు  చెందిన 1600 కోట్ల ఆస్తులను ఐటీ శాఖ అటాచ్ చేసింది. ఇంకా  చెన్నై శివార్లలో ఉన్న భూములు , మరికొన్ని ఆస్తులపై కూడా ఐటీ శాఖ దృష్టి పెట్టింది. జయ ఇంటి ఎదురుగా ఉన్న స్థలంలో శశి బంధువులు నిర్మిస్తున్న భవన నిర్మాణం పై కూడా అధికారులు కన్నేశారు. ఇది  300 కోట్ల విలువైన స్థలం . ఇది శశి బినామీ ఆస్తిగా భావిస్తున్నారు.

ప్రస్తుతం పరప్పన అగ్రహారం జైలులో ఉన్న శశి విడుదలైన వెంటనే  ఈ భవనం నుంచే రాజకీయాలు మొదలెట్టాలని లెక్కలు వేసుకుంది.  అయితే ఇపుడు ఆస్తులు సీజ్ చేసి , జప్తు చేసాక  ఏం చేయాలా అని మథనపడుతోంది. చేతిలో డబ్బులు లేనిదే చిన్నమ్మను లెక్క చేసేదెవరు ? రాజకీయాలు ఎలానడుపుతుంది? అన్ని జవాబుల్లేని ప్రశ్నలే.

ఇక మేలో జరగనున్న ఎన్నికల్లో పళనిస్వామిని  సీఎం  అభ్యర్థిగా ఇప్పటికే అన్నాడీఎంకే నిర్ణయించింది. పళని, పన్నీర్ లు కలసి ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు . బీజేపీ తో కూడా పొత్తుకు సిద్ధమౌతున్నారు.ఈ నేపథ్యంలో శశికళ రాకతో ఈక్వేషన్లు మారే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పన్నీర్, పళనిల మీద అసంతృప్తితో ఉన్ననేతలు వేరే మార్గం లేక అన్నాడీఎంకేలోనే ఉన్నారు. వీరంతా ఆమె పంచకు చేరతారని అంటున్నారు.
అదే జరిగితే అన్నాడీఎంకే లో చీలిక రావచ్చు. అప్పుడు డీఎంకే లాభపడటం ఖాయం. అయితే ముందే చెప్పుకున్నట్టు అసమ్మతి రాజకీయాలు నడపాలన్న సొమ్ములు కావాలి.అవన్నీఅలా ఉంటే చిన్నమ్మ మళ్ళ్లీ రాజకీయాల్లో కొస్తే పాతకేసులు తవ్వి మళ్ళీ జైలుకు పంపరని గ్యారంటీ ఏంలేదు. ఏతవాతా  చిన్నమ్మ ఏం చేయబోతున్నదనేది కొంత కాలం పోతే కానీ తేలదు.

————— KNM 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!