Trekking can be a thrilling experience………………………………..
‘నంగా పర్బత్’… ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన శిఖరాల్లో తొమ్మిదవ శిఖరం ఇది. ‘నంగా పర్బత్’ పై ట్రెక్కింగ్ చేస్తే థ్రిల్లింగ్ అనుభవాలను పొందవచ్చు. పాకిస్తాన్లోని రెండవ ఎత్తయిన పర్వతం ఇది.ఆక్రమిత కాశ్మీరులోని గిల్లిట్ బాల్టిస్తాన్ లో చిలాస్, అస్తోర్ ప్రాంతాల మధ్య ఉన్న ఈ శిఖరం ఎత్తు 26,660 అడుగులు (8,130 మీటర్లు). ఇక్కడ వాతావరణం భయంకరంగా ఉంటుంది. హిమపాతాలు, హిమనీ నదాలను దాటుకుంటూ వెళ్లడం కష్టమే.
ఈ పర్వతం నిటారుగా ఉండడం వల్ల దీన్ని ఎక్కడం చాలా కష్టం. 20వ శతాబ్దం మొదట్లో ఈ పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నంలో అనేకమంది మరణించడంతో దీనికి ‘కిల్లర్ పర్వతం’ అనే పేరు వచ్చింది. దారి చాలా ఇరుకుగా ఉంటుంది. ప్రయాణం చాలా ప్రమాదకరం.. 1953లో హెర్మన్ బుల్ (ఆస్ట్రియన్ జర్మన్) అనే పర్వతారోహకుడు మొదటిసారి ఈ పర్వతాన్ని అధిరోహించాడు.
అంతకుముందు బ్రిటిష్ ఆల్పైన్ పర్వతారోహకుడు ఆల్బర్ట్ ఎఫ్ . మమ్మెరీ 1895లో మంచుతో కప్పబడిన ఈ పర్వతాన్ని అధిరోహించే మొదటి ప్రయత్నానికి నాయకత్వం వహించాడు , కానీ అతను ఆ ప్రయత్నంలో మరణించాడు. కనీసం 30 మంది అధిరోహకులు (ఎక్కువగా జర్మన్ వారే ) నంగా పర్బత్లో మరణించారు.
నంగా పర్బత్ శిఖరాన్ని పంతొమ్మిదవ శతాబ్దంలో యూరోపియన్లు కనుగొన్నారు. మ్యూనిచ్ (జర్మనీ) నుండి ష్లాగింట్వైట్ సోదరులు 1854లో హిమాలయాలకు వచ్చారు.నంగా పర్బత్ మొట్టమొదటి చిత్రంగా గుర్తింపు పొందిన దృశ్యాన్ని గీశారు. కారకోరం హైవే దగ్గర ఆరంభమయ్యే ఈ పర్వత మార్గం గుండా.. 10 మైళ్ల దూరంలో ప్రయాణిస్తే ఒక అందమైన పల్లెటూరు వస్తుంది.
అదే నంగా పర్బత్ బేస్ క్యాంప్ .. ఫెయిరీ మెడోస్ నుండి కేవలం నాలుగు గంటల దూరంలో ఉంటుంది. అనుభవం లేని ట్రెక్కర్లు కూడా అంతవరకు ఈజీగా వెళ్లవచ్చు. ఫెయిరీ మెడోస్ నుంచి నంగా పర్బత్ వెళ్లే దారిలో అద్భుతమైన అందాలను వీక్షించవచ్చు.
నంగా పర్బత్ పర్వతాలలో చిరుతలు, గోధుమ ఎలుగుబంట్లు,మార్కో పోలో గొర్రెలు వంటి వివిధ జంతువులు సంచరిస్తుంటాయి..వలస పక్షులకు ఇది నిలయం.పెద్ద సంఖ్యలో పక్షులు ఇక్కడికి వలస వస్తుంటాయి. ఈ క్యాంప్లోనే ట్రెక్కింగ్ ప్లాన్ చేస్తారు.
అక్కడనుంచి అయిదు మార్గాల్లో ట్రెక్కింగ్ చేయవచ్చు. పర్వతాన్ని అధిరోహించడానికి జూన్ నుండి సెప్టెంబర్ వరకు అనుకూలంగా ఉంటుంది. అక్కడకి చేరుకోవడానికి రకరకాల మార్గాలున్నాయి. అన్నట్టు నంగా పర్బాత్ అంటే ‘నగ్న పర్వతం’ అర్ధం. అసలు ఆపేరు ఎందుకు పెట్టారో మరి ???