ఆ ఆలయంలో మంటల మిస్టరీ ఏమిటో ?

Sharing is Caring...

Mystery Temple…………..

మన దేశంలోని కొన్నిఆలయాల్లో చిత్రాలు జరుగుతుంటాయి.అవి ప్రకృతి రీత్యా జరుగుతాయా ? మరేదైనా కారణమో ఎవరికి తెలీదు. వాటిని కనుగొనేందుకు చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు.రాజస్థాన్ లోని ఇడానా మాతా ఆలయం కూడా అలాంటిదే.ఈ ప్రాంతాన్ని పూర్వం “ఇడాణ” లేదా “ఇడాన” అని పిలిచేవారు.అలా ఇక్కడి దేవతను ఇడానా మాత అని పిలుస్తారు.

ఈ ఆలయం సుమారు 1000 ఏళ్ల పురాతనమైనదని నమ్ముతారు. వనవాస సమయంలో పాండవులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజించారని పురాణ గాథలు చెబుతున్నాయి. అలాగే మేవార్ పాలకులు కూడా ఈ దేవిని ఆరాధించేవారు.

ఇక్కడ అమ్మవారు అగ్నిస్నానమాచరిస్తారు. అగ్నిని నీటిగా స్వీకరిస్తారు. మంటలు అవే అంటుకుంటాయి. మరల అవే ఆరిపోతాయి.ఆరావళి పర్వతాల్లో ఉన్న ఈ దేవాలయం రాజస్థాన్ లోని ఉదయపూర్ కు 60 కిలోమీటర్ల దూరంలో బంబోరా (Bambora) గ్రామంలో ఉంది. పైన ఎలాంటి కప్పు లేకుండా నిర్మితమైన ఈ ఆలయం చతురస్రాకారంలో ఉంటుంది.భక్తులు ఆమెను కులదేవతగా, శక్తి స్వరూపిణిగా ఆరాధిస్తారు.

పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. నెలకు రెండు మూడు సార్లు ఇడాన మాత అగ్నిని స్నానంగా తీసుకుంటారు. ఆ సమయంలో దేవాలయంలోని అమ్మవారి విగ్రహం మినహా అక్కడున్న ప్రతి వస్తువు అగ్నికి ఆహుతి అవుతాయి.మంటలు 10 నుంచి 20 అడుగుల వరకు ఎగిసి బడతాయి.

ఈ దృశ్యాన్నిచూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తుంటారు. ఆలయంలో మంటలు ఎగిసినపుడు వచ్చే జ్వాలలకు అమ్మవారి అలంకరణ కూడా స్వాహా అయిపోతుంది కానీ విగ్రహానికి ఏమికాదని స్థానికులు చెబుతుంటారు.భక్తులు ఈ మంటలను చూసి అమ్మవారు అగ్నిస్నానం ఆచరిస్తుందని నమ్ముతారు. తరచుగా ఈ మంటలు వస్తున్నందున ఆలయ విస్తరణ జరగలేదు.

ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు కారణంగా అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు.ముఖ్యంగా పక్షవాతం, మానసిక ఆందోళనకు  గురైన రోగులు  ఇక్కడకు వచ్చి అమ్మవారి ఆశీర్వదాలు పొందుతారు. ఇక్కడున్న అమ్మవారే స్వయంగా జ్వాలాదేవి రూపాన్ని ఆవహిస్తుందని  చెబుతుంటారు.

ఇక్కడకు వచ్చే భక్తులు అమ్మవారి అగ్నిని చూడటమే కాకుండా.. అక్కడున్న త్రిశూలాన్ని పూజిస్తారు. ముఖ్యంగా సంతానం లేని వారు త్రిశూలానికి ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారిని మొక్కితే  కోరుకున్న కోరికల వేరవేరతాయని భక్తుల నమ్మకం.

ఈ మంటలు ఎలా ? ఎందుకు మండుతున్నాయో ?కనుగొనేందుకు చాలా ప్రయత్నాలు జరిగేయి. కానీ కారణం ఇతమిద్దంగా ఎవరూ చెప్పలేకపోయారు. కొందరు శాస్త్రవేత్తలు, పరిశోధకులు భూగర్భం నుండి వెలువడే మీథేన్ వంటి సహజ వాయువుల వల్ల ఈ మంటలు అకస్మాత్తుగా ఉద్భవిస్తుండవచ్చని అభిప్రాయపడ్డారు.

అయితే, ఈ వాయువులు కేవలం అమ్మవారి విగ్రహం వెనుక మాత్రమే ఎందుకు వస్తాయి, ఆలయం అంతటా ఎందుకు వ్యాపించవు అనే దానికి స్పష్టమైన ఆధారాలు లభించలేదు.మరికొందరు పరిశోధకులు గాలిలోని ఉష్ణోగ్రత మార్పులు లేదా సహజమైన ఉష్ణ రసాయన చర్యల (Thermal reactions) వల్ల ఇలా జరగవచ్చని భావిస్తారు.

కానీ దీనికి సంబంధించి ఎటువంటి ప్రేరకాలు అక్కడ కనిపించకపోవడం విశేషం. మంటలు 20 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడి, చుట్టూ ఉన్న వస్త్రాలు, కానుకలను దహనం చేసినప్పటికీ, రాతి విగ్రహం మాత్రం ఎందుకు దెబ్బతినడం లేదు అనేది సైన్స్‌కు సవాలుగా మారింది.దీంతో ఇప్పటికి ఈ మిస్టరీ అలాగే ఉండిపోయింది.

సమీప రైల్వే స్టేషన్ ఉదయపూర్ సిటీ రైల్వే స్టేషన్, ఇది ఆలయానికి సుమారు 63 కి.మీ దూరంలో ఉంది. అక్కడ నుంచి బస్సులు,టాక్సీ లు ఉంటాయి. ఉదయపూర్ నగరంలో లేదా బంబోరా సమీపంలో అనేక బడ్జెట్ హోటళ్లు,గెస్ట్ హౌస్‌లు అందుబాటులో ఉన్నాయి. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!