తపస్సు అంటే ??

Sharing is Caring...

What is penance?? ………………………………..

బొబ్బిలికి సమీపంలోని కలువరాయి అగ్రహారానికి చెందిన గణపతిశాస్త్రి భగవత్సాక్షాత్కారానికై ఎన్నో చోట్ల తపస్సు చేశారు. కాని సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలో రమణ భగవాన్ ను విరూపాక్ష గుహ వద్ద కలుసుకున్నారు.

రమణుల వారి పాదాలను పట్టుకుని వలవలా ఏడ్చి ‘‘చదువవలసినదంతా చదివాను……వేదాంతశాస్త్రాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకున్నాను. మనసారా జపం చేశాను. అయినా ఇప్పటి వరకు తపస్సంటే ఏమిటో తెలియలేదు. అందువల్ల మీ పాదాలను శరణుజొచ్చాను.తపస్సు స్వరూపాన్ని తెలియజేయండి’’ అని అర్థించారు.

మౌనంగా ఆయన వైపు చూస్తూ స్వామి ఇట్లా సమాధానమిచ్చారు. ‘‘ ‘నేను’ అనే భావమెక్కడి నుంచి ఉదయిస్తోందని చింతన చేస్తే మనస్సు అందులో విలీనమైపోతుంది అదే తపస్సంటే. ఒక మంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఆ మంత్రోత్పత్తి స్థానంపై మనస్సుని కేంద్రీకరిస్తే మనస్సు అందులో లీనమైపోతుంది.

అదే తపస్సంటే.’’ ఈ ఉపదేశానికి గణపతి మనస్సు ఉప్పొంగిపోయింది. వేదకాలం తరువాత ఇటువంటి ఉపదేశం ఎవ్వరూ ఇవ్వలేదని అనిపించిందాయనకి. వెంటనే ఆశువుగా అయిదు శ్లోకాలు చెప్పారు.

స్వామి పరిచారకుని వద్ద నుంచి ఆయన పేరు వెంకటరామన్‌ అని తెలుసుకుని ‘భగవాన్‌ శ్రీ రమణమహర్షి’ అని నామకరణం చేశారు. మోక్షానికి మార్గం చూపే వారు మహర్షులు – ఈ నామకరణానికి అదే కారణం. గణపతిశాస్త్రి బ్రాహ్మణస్వాముల కన్నా ఒక ఏడాది పెద్ద వారైనా రమణులని తన గురువుగా స్వీకరించారు.

తన శిష్యులందరికీ రమణుల వారి ఔన్నత్యం గురించి చెప్పారు. మరి కొంత కాలానికి రమణులను స్తుతిస్తూ కొన్ని శ్లోకాలనూ, వారి బోధలకు సంబంధించిన గ్రంథాలనూ రాశారు. గణపతి శాస్త్రిని శ్రీరమణులు ‘నాయన’ అనేవారు.

ప్రతి మనిషీ ఎప్పుడూ సంతోషంగా ఉండాలనీ, ఆ సంతోషం బయటి ప్రపంచంలో దొరుకుతుందనీ ఆరాటపడుతూ, వెతుక్కుంటూ ఉంటాడు. శ్రీరమణులు చెప్పిందేమిటంటే.. ‘మనం ఈ వెతుక్కోవడానికి కారణం మన మనసు. అది ఆలోచనల పుట్ట. ఒకదాని తర్వాత ఒకటిగా ఆలోచనలన్నీ.. ప్రవాహంలా వస్తుంటాయి.

ఈ ఆలోచనలన్నిటికీ మూలం ‘నేను’ అనే భావం. ఈ‘‘నేను’’ అంటే ఏమిటి? ఎక్కడ్నుంచి ఉదయిస్తుంది? అని ఆరా తీస్తే మనసు తన మూలమైన ఆత్మలో విశ్రమిస్తుంది. అప్పుడు ఆనందంగా ఉంటుంది. 

గాఢంగా నిద్ర పోయామనుకోండి. నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత.. ‘నాకు ప్రపంచమే తెలియలేదు. నా ఇల్లు కూడా మరచి పోయాను’ అంటాం.దీనంతటికీ కారణం.. కలలు కూడా లేని గాఢ నిద్రలో..మనసు తన మూలంలో విశ్రమించడం. మేల్కొని ఉండగా కూడా ఆ స్థితిని అందుకోవచ్చ’ని రమణులు బోధించారు.

అందుకోసం.. ‘ఆత్మవిచారం’ అనే మార్గాన్ని సూచించారు. నిరంతర అభ్యాసం వల్ల మనోనిశ్చలత వృద్ధి అవుతుంది. మనం పూజలు చేస్తాం. తీర్థ యాత్రలకు వెళ్తాం. దేవాలయాలకు వెళ్తుంటాం. వీటి వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. ఒక్కొక్కసారి శాంతి లభిస్తుంది. రమణ మార్గాన్ని అభ్యసించే వారికి ప్రశాంతత సిద్ధిస్తుంది. ఇదే శ్రీరమణులు బోధించిన  ఆత్మ విచారణ మార్గం.

———— రాధిక

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!