మిస్ అవుతున్న ‘చిన్నారులు’ ఏమై పోతున్నారు ?

Sharing is Caring...

Are missing cases increasing?………………………….

పాపం, పుణ్యం, ప్రపంచమార్గం… కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ… ఏమీ ఎరుగని పూవులు..అయిదారేడుల పాపలు .. మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే అవి తమకే అని ఆనందించే కూనలు ..అలాంటి చిన్నతల్లులకు ఎంత కష్టం వచ్చింది.

చెంగు చెంగున లేడి పిల్లల్లా ఎగురుతూ …ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో మానవ మృగాల వేటకు బలవుతున్నారు. బయటకు అడుగు పెడితే చాలు మాటు వేసి కాటు వేస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆడపిల్లలు దుర్మార్గుల కామాగ్నికి బలవుతున్నారు. ఆడపిల్లల అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతోంది. ఎన్నడూ లేనివిధంగా ఆడపిల్లల అక్రమ రవాణా పెరుగుతోంది. ప్రభుత్వ రికార్డులు కూడా ఇదే చెబుతున్నాయి.

దేశంలో ప్రతి ఏడాది లక్షల్లో పిల్లలు మిస్ అవుతున్నారు ..కానీ నమోదు అయ్యే కేసులు వేలల్లోనే కనిపిస్తున్నాయి. (కొంతమంది తల్లితండ్రులు పరువు పోతుందని కేసులు నమోదు చేయరు) మిస్ అయ్యే వారిలో అధిక శాతం మైనర్ బాలికలే ఉంటున్నారు. అలాగే మిస్సింగ్ కేసులలో మహిళలు కూడా ఉంటున్నారు. మిస్సింగ్ బాలికలను వేశ్యాగృహాలకు అమ్మివేస్తున్నారు. అక్రమ రవాణా కేసులు కూడా అనూహ్యంగా పెరుగుతున్నాయి.

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో కూడా మిస్సింగ్ కేసులు బాగానే ఉంటున్నాయి.మిస్ అయిన అమ్మాయిల్లో కొందరిని ఢిల్లీలోని రెడ్‌లైట్ ఏరియాలకు అమ్మివేస్తున్నారు. అలాగే మనదేశం నుంచి ఉక్రేయిన్, ఖజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, నేపాల్, థాయిలాండ్, మలేసియా తదితర దేశాలకు తరలి వెళుతున్నారు. అక్కడ వీరంతా బానిసత్వంలో మగ్గిపోతున్నారు.

కరవుతో అల్లాడుతున్న బుందేల్‌ఖండ్, మహారాష్ట్ర, బీహార్, కర్నాటక తదితర రాష్ట్రాలలో చిన్నారులను పోషించలేక వందలాది రూపాయలకే అమ్మేసుకున్న ఉదాహరణలున్నాయి. పోలీసులు పట్టుకుంటున్నపుడు అమ్మాయిల తరలింపు తగ్గుతోంది … ఆ తర్వాత మళ్ళీ మామూలే. ఆడపిల్ల కాలు బయటకు పెట్టిందంటే ట్రాప్ చేసేందుకు ప్రయత్నించేవాళ్లే ఎక్కువ.

2019 – 2021 మధ్య, భారతదేశంలో 13.13 లక్షలకు పైగా మహిళలు, బాలికలు అదృశ్యమయ్యారు మధ్యప్రదేశ్‌లో అత్యధిక సంఖ్యలో తప్పిపోయిన కేసులు ఉన్నాయి. ఈ డేటా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) రూపొందించింది. జూలై 26, 2023న రాజ్యసభలో హోం వ్యవహారాల సహాయ మంత్రి ఈ డేటాను సభకు సమర్పించారు.

అమ్మాయిల అక్రమ రవాణాదారులు సోషల్‌మీడియాను  ఉపయోగించుకుంటూ డబ్బులు ఆర్జిస్తున్నారు. చట్టాలు బలహీనంగా ఉండటం వల్ల ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. వేలాది కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉంటున్నాయి.అమ్మాయిల అక్రమ రవాణాను అరి కట్టేందుకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ (AHTU ) ను ఏర్పాటు చేయగా వాటిలో చాలావరకు చురుగ్గా పనిచేయడం లేదు.

జూలై 11, 2023 నాటికి మన దేశంలో 788 యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు (AHTUలు) ఉన్నాయి, వాటిలో 30 బోర్డర్ గార్డింగ్ ఫోర్సెస్‌లో ఉన్నాయి. AHTUలను ఏర్పాటు చేయడానికి,బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. AHTU లను నిర్వహించడానికి సిబ్బందిని నియమించే బాధ్యత రాష్ట్రాలదే.

నిర్భయ నిధి ఇప్పటికే ఉన్న AHTUలను బలోపేతం చేయడానికి, కొత్త వాటిని స్థాపించడానికి నిధులను అందిస్తుంది. కాగా CSRbox, Tafteesh సంస్థలు నిర్వహించిన అధ్యయనంలో AHTUలలో 27% మాత్రమే చురుగ్గా పనిచేస్తున్నాయని తేలింది.మానవ అక్రమ రవాణా కేసులను స్వతంత్రంగా నమోదు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు AHTU లకు అధికారం, వనరులను ఇవ్వలేదని కొంతమంది అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇక 18ఏళ్లు కూడా నిండని అమ్మాయిలు దాదాపు మూడు మిలియన్ల మంది పైగా సెక్స్ వర్కర్లుగా నమోదు కావటం దేశంలోని దౌర్భాగ్య స్థితికి అద్దం పడుతోంది.ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య లైంగిక పరిశ్రమలలో ఒకటిగా మారింది. 

———-KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!