శివుడు ‘శిక్ష’ అనుభవించాడా ?

Sharing is Caring...


Miracles of Arunachaleswara………………..

అరుణాచల ఆలయ ప్రాంగణం లో ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. వారి దృష్టి ఆలయంలోని హుండీపై పడింది. ఆ పిల్లలిద్దరు హుండీ లోని పైసల్ని ఎవరూ లేనపుడు సన్నని రేకుతో లాగి తీసారు.  అందులో ఒకడు  ‘ఒరేయ్ ఎవరన్నా మనల్ని చూస్తున్నారేమో – చూడరా’ అన్నాడు. 

రెండవవాడు చుట్టూ చూసి, ‘ఆ శివుడే ఇంతేసి గుడ్లు ఏసుకొని చూస్తున్నాడురా’ అన్నాడు కొంచెం భయంగా. ఇద్దరు అరుణాచలేశ్వరునికి  ఎదురుగా నిలబడి ‘మా దొంగతనం బయట పడకుండా చూచే బాధ్యత నీదే స్వామీ. అందుకు గాను  పటిక బెల్లం లో మూడవ వంతు నీకిస్తాము. ముగ్గురం సమానంగా తీసుకుందాం’ అన్నారు.

అప్పటి నుంచి  ప్రతీ రోజు హుండీలో డబ్బులు తీసుకుంటున్నారు ..వాటితో కొనుక్కువచ్చిన పటిక బెల్లం అరుణాచలేశ్వరునికి పెడుతున్నారు. ఆశ్చర్యం గా శివుని ముందు పెడుతున్న పటిక బెల్లం మాయం అయ్యేది. స్వామి వారు తింటున్నారని పిల్లలు సంబర పడేవారు.

ఒకరోజు అనుకోకుండా ఆలయ పూజారి ఆ ఇద్దరు పిల్లలను పట్టుకొని ఆలయ అధికారి కి అప్పగించాడు. ఆఇద్దరూ పదేళ్ల పసి వాళ్ళు. వీళ్ళను ఎలా శిక్షించాలి అని  అధికారి ఆలోచించాడు .. కాసేపటి తర్వాత ‘అరేయ్ పిల్లలు మీరు ఇద్దరు అంతరాలయం లో 108 ప్రదక్షిణలు చేయండి.. ఇదే మీకు శిక్ష’ అన్నాడు. పిల్లలు ఇద్దరు ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు.

ఆలయ పూజారి, అధికారి దూరంగా కూర్చొని పిల్లల ప్రదక్షిణాలు చేయడం చూస్తున్నారు వినోదంగా. ఇంతలో ఆ పూజారి..  అధికారి ఒక్కసారిగా తృళ్ళిపడ్డారు.కళ్ళు నిలుపుకుని  పిల్లల్నిమరోసారి చూసారు. ఆ ఇద్దరి పిల్లలతో పాటు, మూడవ పిల్లవాడు ప్రదక్షిణ చేయడం చేయడం కనిపించింది.మూడవ పిల్లవాడు మెరిసిపోతున్నాడు. మాయమవుతున్నాడు. మళ్ళీ కనిపిస్తున్నాడు.. 

ఇది గమనించి అధికారి మెల్లగా లేచి పిల్లల్ని సమీపించాడు. టక్కున మూడవ పిల్లవాడిని గట్టిగా వాటేసుకున్నాడు. అంతే .. మరుక్షణంలో మూడవ పిల్లవాడు కాంతిరేఖ గా మారి గర్బాలయంలోకి వెళ్లి మాయమై పోయాడు.’అద్భుతం స్వామి’ అంటూ నమస్కరించాడు.

అరుణాచలేశ్వరుడు దొంగ పటిక బెల్లం మూడవ వంతు తిన్నాడు కదా! అందుకని పరమేశ్వరుడు వారితో కలసి ప్రదక్షిణ చేసాడన్నమాట.ఆ అధికారి పిల్లల్ని బుజ్జగిస్తూ ”  అసలేం జరిగింది ” అని అడిగాడు. పిల్లలు ‘శివుని వాటా’ గురించి చెప్పారు. అది విని వారు ఆశ్చర్యం.. ఆనందం లో మునిగిపోయారు.

సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు కూడా పిల్లలతో వాటా పంచుకున్నందుకు శిక్ష అనుభవించాడన్న మాట.నిష్కల్మష ప్రేమకు, నిర్మల  భక్తి కి అరుణాచలేశ్వరుడు ఎపుడూ బందియే ! అరుణా చల శివుడు కాంతి రూపం లో ఉంటాడని, అది అగ్ని లింగం అని శాస్త్రవచనం చెబుతోంది.

ఆ పరిసర ప్రాంతాలలో, కొండపైన అరుణాచలేశ్వరుడు  కాంతి రూపం లో, కాంతి స్తంభం రూపం లో భక్తులని అనుగ్రహించిన సంఘటనలు అనేకం .
ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!