అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన కేంద్రమంత్రి !

Sharing is Caring...

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పై అనుచిత వ్యాఖ్యలు చేసి కేంద్ర మంత్రి నారాయణ రాణే  చిక్కుల్లో పడ్డారు. సీఎంకు స్వాతంత్య్రం వచ్చి ఎన్నేళ్లు అయిందో కూడా తెలియదని … అలాంటి వ్యక్తి చెంప పగలగొట్టాలని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. శివసేన కార్యకర్తలు కేంద్ర మంత్రి పై కేసులు పెట్టారు. దీంతో పోలీసులు కేంద్రమంత్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో తనను అరెస్ట్ చేయకుండా .. రక్షణ కల్పించాలని కోరుతూ కేంద్ర మంత్రి  బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మంత్రి తరఫు న్యాయవాది న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని మంత్రి కోర్టును అభ్యర్థించారు ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే ఈ పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు.

అత్యవసర విచారణ కావాలంటే ముందు కోర్టు  రిజిస్ట్రీ డిపార్ట్మెంట్లో దరఖాస్తు చేసుకోవాలని ..కోర్టు సూచించింది. అప్పుడే పిటిషన్ ను పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో మంత్రి న్యాయవాది ఆ పనిలో పడ్డారు.  జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కేంద్ర మంత్రి నారాయణ రాణే సోమవారం రాయగడ్ జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం ఠాక్రేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ఆగస్టు పదిహేను న  ఠాక్రే చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రికి స్వాతంత్య్రం ఎపుడు వచ్చిందో కూడా తెలియకపోవడం సిగ్గుచేటు అంటూ మంత్రి విమర్శించారు.

స్వాతంత్య్ర దినోత్సవం నాడు సీఎం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మధ్యలో వెనక్కి తిరిగి స్వాతంత్య్రం వచ్చి ఎన్నేళ్లయింది ఆయన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.. ఆ రోజు నేను అక్కడే ఉండి ఉంటే  ఆయన చెంప పగలగొట్టేవాడిని అని మంత్రి  రాణే విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి.

కాగా రాణే ఇటీవలే కేంద్ర క్యాబినెట్ లో చేరారు. ఇవాళ ముంబైలోని రాణే ఇంటి వద్ద శివసేన కార్యకర్తలు నిరసనకు దిగారు. బిజెపి కార్యకర్తలు అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. కేంద్రమంత్రి నారాయణ రాణే గతంలో శివ సేన సభ్యుడే. తన రాజకీయ జీవితాన్నిశివసేన నుంచే రాణే ప్రారంభించారు. ఆ సమయంలో బాల్ ఠాక్రే శివసేనకు నాయకత్వం వహించారు. రాణే 1990 లో మహారాష్ట్ర అసెంబ్లీలో సేన ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే కొద్దీ కాలమే పదవిలో ఉన్నారు.  2005 లో రాణే శివసేన నుంచి బయటకొచ్చి కాంగ్రెస్ లో చేరారు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!