ఈసారి కుంభమేళా ముప్ఫైరోజులు మాత్రమే!

Sharing is Caring...

హిందువులు అత్యంత పవిత్ర మహా క్రతువుగా భావించే కుంభ‌మేళా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వ‌ర‌కు మాత్రమే జరుగుతుంది. కుంభ‌మేళా నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి మార్చి చివ‌రినాటికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తుంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాను గతంలో జనవరి నుండి ఏప్రిల్ వరకు నిర్వహించేవారు. ఈ సారి కరోనా దృష్ట్యా 30 రోజులు మాత్రమే నిర్వహించనున్నారు. కోవిడ్ పరీక్షలు చేయించుకుని .. రిపోర్టులు తీసుకెళితేనే  అనుమతి ఉంటుంది. 

ప్రపంచం నలుమూలల నుంచి తండోపతండాలుగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించే మహాక్రతువునే  ‘కుంభమేళా’ అంటారు.  వేదకాలం నుంచి ఈ కుంభమేళాలు జరుగుతున్నాయని పురాణాలు చెబుతున్నాయి. క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో గ్రీకుల నాగరికత నుంచి కుంభమేళాను స్వీకరించారని కూడా అంటారు. యునెస్కో కూడా ఈ కుంభమేళాను ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది.భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం ‘కుంభం’ అనేది ఒక రాశి. ‘మేళా’ అంటే కలయిక లేదా జాతర. కుంభరాశిలో నిర్వహించే ఉత్సవం కావడంతో దీన్ని కుంభమేళాగా పిలుస్తారని హిందూ ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి.ఈ కుంభస్నానాలు ప్రయాగ, ఉజ్జయినీ, నాసిక్, హరిద్వార్‌లలోనే జరుగుతాయి. కుంభ స్నానాలు ఆచరిస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని హిందువుల నమ్మకం.

క్షీరసాగర మథనం సమయంలో ఉద్భవించిన అమృత కలశం కోసం దేవతలు, రాక్షసులు కలబడుతుండగా  ఆ కలశం ఒలికి నాలుగు చుక్కల అమృతం ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లలోని నదుల్లో పడ్డాయట. అందువల్ల ఈ నాలుగు ప్రదేశాల్లో ఒకచోట ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. దీనిని సాధారణ కుంభమేళా అంటారు. ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాను అర్ధ కుంభమేళా అనీ, 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని పూర్ణ కుంభమేళా అని అంటారు. 12 పూర్ణ కుంభమేళాల తర్వాత చేసే దాన్ని మహా కుంభమేళా అంటారు. అంటే 144 సంవత్సరాలకు ఒకసారి చేసే కుంభమేళాను మహా కుంభమేళా అని వ్యవహరిస్తారు. ఈ కుంభమేళాల కి ఎన్నో లక్షలమంది అఘోరాలు, సాధువులు, హిందూ ధర్మాల పట్ల విశ్వాసం గల వారు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు.

కుంభమేళా అంటే హిందువులందరికీ పండగే. ముఖ్యంగా పితృతర్పణాలు వదిలేందుకు, పూజలు చేసేందుకు దేశం నలుమూలల నుంచీ ఎంతోమంది భక్తులు వస్తుంటారు.  ఈ మేళా భిన్న సంస్కృతీ సంప్రదాయాల మేళవింపుగా గోచరిస్తుంది. ఆ భిన్నత్వాన్ని కనులారా తిలకించేందుకు, పుణ్య స్నానాల కోసం  వచ్చే భక్తులతో ఈ ప్రాంతమంతా జనసంద్రం గా మారుతుంది. వీరందరికి  మామూలు హోటళ్లలో గదులు దొరికే అవకాశం ఉండదు. అందుకని ప్రభుత్వమే  ప్రైవేటు భాగస్వామ్యంతో ‘టెంట్ సిటీ’ ని ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి.సౌకర్యాలను బట్టి గుడారాల అద్దె నిర్ణయిస్తారు. వీటిని ఆన్‌లైన్‌లోనూ బుక్ చేసుకోవచ్చు. ఈ ఏర్పాట్ల గురించి ప్రభుత్వం ప్రకటిస్తుంది. 
కుంభమేళాకు తరలి వెళ్లే భక్తులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్టలు చేయించుకోవాలి. రిపోర్టులో నెగిటివ్ వస్తేనే అనుమతి ఉంటుంది. కోవిడ్ ‌ రిపోర్టు లు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఉండదు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!