ఆఖరి ఉత్తరం !!

Sharing is Caring...

(50 దాటిన వారందరు తప్పక చదవాల్సిన ఓ జరిగిన కథ…)

పది రోజుల నుండి బంధువులు, పిల్లల తోటి, కర్మకాండలతో  హడావిడిగా ఉన్న ఇల్లు ఒక్కసారి అందరూ వెళ్లిపోవడంతో నిశ్శబ్దం అయిపోయింది.ముప్పై ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి,ఎందరికో విద్యాబోధన చేసి, పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి,రెండు సంవత్సరాల క్రితమే పదవీ విరమణ చేసి, హాయిగా కాలక్షేపం చేస్తున్న వెంకటేశ్వర్లు సార్ సడన్ గా కాలం చేయడంతో భార్య పార్వతమ్మ ఒంటరి అయిపోయింది.

పిల్లలందరూ వెంకటేశ్వర్లు సార్ రాసిన వీలునామా చదువుకుని హాయిగా ఎవరిళ్లకి వాళ్లు వెళ్లిపోయారు.ఇక మిగిలింది భార్య పార్వతమ్మ…. ఆ ఇంటిలో ఒంటరిగా అయిపోయింది.పిలిస్తే పలికే నాధుడే లేడు.ఈ శేష జీవితం ఎలా గడపాలా అని ఆలోచనలతో భార్య పార్వతమ్మ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది.

కడుపున పుట్టిన పిల్లలు వీలునామా ఎలా అమలు జరపాలో ఆలోచించుకుంటున్నారు గానీ, భర్త పోయి పుట్టెడు దుఃఖంలో ఒంటరిగా ఉన్న అమ్మ గురించిన ఆలోచన ఏ ఒక్కరికి లేదు.
వెళ్లి వస్తాo…
“ఆరోగ్యం జాగ్రత్త,”
 “సమయానికి మందులు వేసుకో”,
“ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్” …..
అంటూ పిల్లలు మాట వరసకు జాగ్రత్తలు చెప్పి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.మొట్ట మొదటిసారి విపరీతమైన భయంతో పాటు దిగులు వేసింది.

కళ్ళనుండి అప్రయత్నంగా కన్నీళ్లు జారాయి… ఇంతలో….. పోస్ట్ అని కేక వినబడింది.
‘ఎవరు రాసుంటారబ్బా ఈ ఉత్తరం’ అనుకుంటూ అప్రయత్నంగా ఫ్రమ్ అడ్రస్ చూసి ఆశ్చర్యపడింది.దాని మీద ఫ్రమ్ అడ్రస్ తన భర్త వెంకటేశ్వర్లు గారిదే. చనిపోయిన వ్యక్తి ఎలా ఉత్తరం రాశారనుకొంటూ కవర్ ఓపెన్ చేసి ఉత్తరం చదవసాగింది.

” ప్రియమైన పార్వతికి… నువ్వు ఆశ్చర్య పడతావని నాకు తెలుసు.నేను బతికున్న రోజుల్లో రాసిపెట్టిన ఈ ఉత్తరాన్ని ఢిల్లీలో తెలంగాణ భవన్ లో పనిచేస్తున్న మన బిడ్డలాంటి నా ప్రియ శిష్యుడు సుబ్రహ్మణ్యం కిచ్చి…. నేను చనిపోయిన తర్వాత పోస్ట్ చేయమని చెప్పాను. నా మనసులోని మాట నేను  బతికినన్నాళ్ళు చెప్పలేకపోయా.

మరణం ఎవరికి ముందు వస్తుందో ఎవరికి తెలుస్తుంది ? భర్త పోయిన భార్య ఈ లోకంలో బతకడం చాలా కష్టం. ముందుగా పిల్లలందరూ దూరంలో ఉంటారు. ఒంటరిగా బ్రతకాలంటే నీకు చాలా మానసిక ధైర్యం కావాలి. ఒకవేళ పిల్లల దగ్గరకు వెళ్లినా ఈ ఆధునిక కాలంలో కొడుకు, కోడలు ఉద్యోగాల్లో ఉండటం వల్ల, వాళ్ల కుటుంబ వ్యవహారాల బాధ్యతలు నీ నెత్తి మీద రుద్దబడుతాయి. వయసు మీరిన నీకు వంట వార్పు చేయడం చాలా కష్టం.

తప్పని పరిస్థితుల్లో తెలియకుండానే కుటుంబ బరువులు మరింత పెరుగుతాయి. ఒంటరిగా ఉంటే…. ఆర్థిక భరోసా ఎంత ఉన్నా బ్యాంకుకు వెళ్లి డబ్బు తీసుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది.. డబ్బు చాలా చెడ్డది.. మంచి వారిని కూడా మాయల మరాఠీలు గా చేస్తుంది. ఇక విషయంలోకి వస్తే పిల్లలందరి పేరున రాసిన వీలునామా చెల్లదు.

ఎందుకంటే నా ఆఖరి వీలునామా నీ పేరు మీద ఉంది. ఏదో వాళ్ళని సంతృప్తి పరచడానికి అలా రాశాను కానీ నాకు వాళ్ల మీద నమ్మకం లేదు. కాలం అలా ఉంది మరి. ఎంతోమంది స్నేహితుల జీవితాలు చూసాను. చనిపోయి రోజులు కూడా గడవక ముందే బ్యాంకుల చుట్టూ తిరిగే స్నేహితుల భార్యలను చూసి మనసంతా కకావికలమైపోయేది.

నా ఆఖరి వీలునామా ప్రకారం ఆస్తంతా నీ పేరు మీద ఉంది. వీలునామా కాగితం లాకర్లో నీ నగల పెట్టెకింద పెట్టాను.ఇంకొక కాపీ సీల్డ్ కవర్లో ఉంచి బ్యాంకు లాకర్ లో ఉంచాను. ఏదైనా అవసరమైతే నా ప్రియ శిష్యుడు తెలంగాణభవన్ సుబ్రహ్మణ్యం కు ఫోన్ చెయ్. వాడికి చాలా వివరాలు చెప్పాను.

ఆర్థిక స్వేచ్ఛ గనక స్త్రీకి ఉంటే ప్రపంచమంతా ఆమెను లోకువగా చూడదు.పిల్లలు మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నా… ఏదైనా పరిస్థితులు బాగా లేనప్పుడు నువ్వు ఎవ్వరిని అడగక్కర్లేదు.బ్యాంకు బాలన్స్ అంతా జాయింట్ అకౌంట్ లోనే ఉంది . ఒక్కసారి నువ్వు బ్యాంకుకు వెళితే పనిచేసే పెట్టే నా శిష్యుడు నరేష్ బ్యాంకు మేనేజర్ గా మన ఊరికి బదిలీ అయి వచ్చాడు. వాడు సహాయం చేస్తాడు.

ఏ పిల్లల ఇంటికెళ్ళినా నీకు స్వతంత్రం ఉండదని నాకు తెలుసు. సున్నితమైన నీ మనసు బాధపడుతుంది.నేను కట్టిన ఇంట్లో, నేను సంపాదించిన సొమ్ముతో నీ శేష జీవితాన్ని చక్కగా గడుపు. మానవపరిణామక్రమంలో వచ్చిన జీవితానికి నా చివరి శ్వాస వరకు తోడుగా నిలిచిన నీకు చాలా రుణపడి ఉన్నాను.

వీలునామా మార్చానని పిల్లలకు కోపం రావచ్చు. ఇన్నాళ్ళూ నీతోటి  చాకిరీ చేయించుకుని నిన్నుదిక్కులేని దానిగా, జీతం లేని పనిమనిషి లాగా చేసే అవకాశం ఉంటుందని నేను ఇలా చేస్తున్నాను. మన పిల్లలను కంటికి రెప్పలా పెంచాము.మంచి మంచి చదువులు చెప్పించాం. ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పెళ్లిళ్ల తర్వాత వాళ్లకున్న బాధ్యతల వల్లో, మరే కారణమో తెలియదు కానీ వాళ్ల ప్రాధాన్యత  అంశాల్లో మనం లేము. నేనది గుర్తించాను.

మన కొడుకు మనల్ని బాగా చూసుకోవాలని అనుకున్నా కోడలి ఒత్తిడి వల్ల వాడు మనల్ని వాళ్ళతో ఉండమని మాట మాత్రం కూడా అడగలేకపోతున్నాడు. కూతురి పరిస్థితి సరే సరి. వాళ్ళ పిల్లల పెంపకానికి, అవసరమైనప్పుడల్లా వాళ్ళ పని మనిషిగా నిన్ను ఉపయోగించుకొని , ఈ అవసాన దశలో నీ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇవన్నీ నేను గమనించాను.

ఎంతోమంది తల్లిదండ్రులు అనాధ శరణాలయాల్లో దిక్కుమొక్కు లేకుండా జీవనం గడుపుతున్నారు.తమ సొంత కొడుకులు, కూతుర్ల ఇళ్లల్లో జీతం లేని వంట మనుషుల్లాగా బతుకు వెళ్ళదీస్తున్నారు. కాలం పెట్టే పరీక్షకి మనం ఎదురొడ్డి నిలవాలి. కానీ అధైర్య పడకూడదు. ఒకరు ముందు ఒకరు వెనక…. అంతే !

ఓపిక ఉన్నన్నాళ్ళు ధైర్యంగా, ఇష్టమైన పనులు చేస్తూ బతుకు.ఇన్నాళ్లూ ఎన్నో బాధ్యతలు మోసిన నేను ఒక్కసారిగా నిన్ను వదిలి వెళ్ళిపోతే…మీద పడే బాధ్యతలు నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తాయని తెలుసు. దీనికి భయపడకు. అన్నీ సర్దుకుంటాయి. కాలమే అన్నింటికీ పరిష్కారం చూపుతుంది.

భాగస్వామికి ఏ లోటు లేకుండా చేయడమే మనలాంటి పెద్దలు చేయవలసిన పని.జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంటుంది. కష్టమైనా, సుఖమైనా నింపాదిగా ఎదుర్కో.
బాధ్యతలన్నీఒంటిచేతి మీద నెట్టుకుంటూ వచ్చి బిడ్డలని ప్రయోజకులను చేసిన నువ్వు, ఇప్పుడు వచ్చిన ఈ కష్టాన్ని అధిగమిస్తూ, ఆనందంగా కాలం గడపడమే నీ చేతుల్లో ఉన్న విషయం.

నేను బతికున్నరోజుల్లో ప్రతి సమస్యకి నీతో చర్చించి సలహా తీసుకునే వాడిని. ఇప్పుడు నువ్వు సలహా అడగడానికి నేను లేను.సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవడమే నీ బాధ్యత. ఇక నీ కాలక్షేపానికి చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచి ఉచితంగా చదువు చెప్పు.అవసరమైతే పేద పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టు. నీకు మానసిక సంతృప్తి కలిగే ఏ పనైనా సరే స్వచ్ఛందంగా చేయగలిగిన ఆర్థిక స్వేచ్ఛ నీకు కలిగించాను.
ఇట్లు…
ప్రేమతో…
నీ భర్త ..
ఎప్పుడో విధి కలిపిన బంధం , చనిపోయిన తర్వాత కూడా తన వంతు బాధ్యతని ఉత్తరం ద్వారా చెప్పిన భర్తకి మనసులో ధన్యవాదాలు చెప్పుకుంటూ…. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే కొంగుతో తుడుచుకుంటూ….ఎదురుగా గోడపై ఉన్న భర్త ఫోటోకు హృదయపూర్వకంగా నమస్కరించింది వెంకటేశ్వర్లు భార్య పార్వతమ్మ.

కర్టసీ .. unknown writer (whatsapp లో వచ్చింది .. రచయిత పేరు తెలిస్తే చెప్పండి) 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!