The horoscope has changed……………………………………….
బ్రిటన్ ప్రధాని కాబోతున్న రిషి సునాక్,ఆయన సతీమణి అక్షత కోట్లకు పడగలెత్తిన దంపతులు. బ్రిటన్ కుబేరుల జాబితాలో ఆ ఇద్దరు 222 వ స్థానంలో ఉన్నారు. అక్షత బ్రిటన్ రాణి కంటే సంపన్నురాలు. ఇక అక్షత భారత సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ అధినేత కుమార్తె అన్న సంగతి తెల్సిందే.
రిషి గురించి చెప్పుకోవాలంటే యస్వీర్ .. ఉషా సునక్ దంపతులకు రిషి జన్మించారు. రిషి తండ్రి వైద్య వృత్తి చేసేవారు.. తల్లి చిన్నఫార్మసీని నడిపేవారు. సునక్ తాతలు బ్రిటీష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్లో జన్మించారు. ఈ ప్రాంతం ఇపుడు ఇండియాలో భూభాగంలో లేదు. తర్వాత రిషి తల్లి తండ్రులు తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లారు. తూర్పు ఆఫ్రికా నుండి 1960లలో UKకి వలస వచ్చారు.
ముగ్గురు తోబుట్టువులలో రిషి సునక్ పెద్దవాడు. సోదరుడు సంజయ్ సైకాలజిస్ట్ , సోదరి రాఖీ కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసులో హ్యుమానిటేరియన్, పీస్ బిల్డింగ్, UN ఫండ్స్ ప్రోగ్రామ్స్ హెడ్గా పని చేస్తున్నారు.
సౌతాంప్టన్లో జన్మించిన రిషి సునాక్ పాతికేళ్లకే మిలియనీర్ అయ్యారు. విద్యార్థిగా ఉన్న సమయంలో రిషి సౌతాంప్టన్లోని ఓ భారతీయ రెస్టారంట్లో వెయిటర్గా కూడా పనిచేశారు. అదే ఆయన మొదటి ఉద్యోగం.రెస్టారెంట్ లో వెయిటర్గా చేసేందుకు ఆయనేమి సిగ్గు పడలేదు.టేబుళ్లను అమర్చడం, వాటిని తుడవడం, బిల్లుల తాలూకూ సొమ్ము సేకరించడం వంటి పనులు చేసేవారు.
రిషి ఉన్నత విద్యాభ్యాసం అమెరికాలో పూర్తి చేశారు. స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత గోల్డ్ మాన్ శాక్స్ లో కొంత కాలం పని చేశారు. రెండు హెడ్జ్ ఫండ్స్లో పార్టనర్గా కూడా ఉన్నారు. అక్కడే ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె అక్షత పరిచయం కావడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. తర్వాత రిషి బ్రిటన్లో పలు వ్యాపారాలు ప్రారంభించారు.
ఇక అక్షతకు ఒక్క ఇన్ఫోసిస్లోనే బిలియన్ డాలర్ల విలువైన వాటా ఉంది. ఇన్ఫోసిస్ కంపెనీలో అక్షత షేర్ల విలువ సుమారు 430 మిలియన్ పౌండ్లు. అక్షత కుటుంబం అమెజాన్తో కలసి 900 మిలియన్ల పౌండ్ల విలువైన జాయింట్ వెంచర్ను ఇండియాలో ఏర్పాటు చేసింది. అలాగే అక్షత UK-ఆధారిత వెంచర్ క్యాపిటల్ కంపెనీని నడుపుతున్నారు. మరో ఐదు ఇతర UK కంపెనీలలో ఆమె డైరెక్టర్ గా ఉన్నారు.
అక్షత, రిషి సునక్లకు లండన్లోని కెన్సింగ్టన్లో 7 మిలియన్ పౌండ్ల విలువైన ఫైవ్ బెడ్రూమ్ హౌస్ ఒకటి ఉందని, కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో ఓ ఫ్లాట్ కూడా ఉందని సండే టైమ్స్ చెబుతోంది. అక్షత వివిధ బిజినెస్లలో కూడా ఇన్వెస్ట్ చేశారు. రిషి సునక్తో కలిసి ఆమె 2013 లో కేటమరన్ వెంచర్స్ను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీలో ఆమె డైరెక్టర్గా పనిచేస్తున్నారు.
అంతేకాకుండా అక్షత డిజైన్స్ పేరుతో సొంతగా ఫ్యాషన్ లేబుల్ను కూడా ఆమె క్రియేట్ చేశారు. అక్షత మూర్తికి ఇన్ఫోసిస్లోని వాటాలకు అదనంగా 300 మిలియన్ పౌండ్ల వ్యక్తిగత సంపద ఉందని బ్రిటన్ మీడియా అంటోంది.
అక్షత మూర్తికి బ్రిటన్లో నాన్–డొమిసైల్ స్టేటస్ ఉంది. అంటే ఆమె పర్మినెంట్ అడ్రస్ బ్రిటన్ కాదు. దీంతో అక్షతకు విదేశాల్లో సంపాదించే మొత్తానికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఈ కారణంగా తనపై విమర్శలు రావడంతో విదేశాల్లోని ఆస్తులు, బిజినెస్ల ద్వారా వచ్చిన ఇన్కమ్, డివిడెండ్స్, క్యాపిటల్ గెయిన్స్పై కూడా యూకేలో ట్యాక్స్ కడతానని అక్షత ప్రకటించి ఆ వివాదానికి ముగింపు పలికారు.
ఇక రిషి 2015 నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. ఎంపీగా ఎన్నికైనారు. బోరిస్ జాన్సన్ మంత్రివర్గంలో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు. కరోనా రిలీఫ్ ప్యాకేజీ కి భారీగా నిధులు కేటాయించిన క్రమంలో సునక్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించింది.
సరిగ్గా 48 రోజుల క్రితం బ్రిటన్లో అధికార కన్జర్వేటివ్ పార్టీలో ప్రధాని పదవి కోసం లిజ్ ట్రస్, రిషి సునాక్ ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో ట్రస్ విజయం సాధించారు. అయితే లిజ్ రాజీనామా కారణంగా పార్టీ రిషి నే ఎన్నుకుంది.