‘బాలి’ అను అనకాపల్లి ఆర్టిస్ట్ కళా.. కమామీషు !(2)

Sharing is Caring...

Taadi Prakash ……………………………

అందుచేత అందుకు – చిత్రకారులూ మీసాలు దువ్వుకోవడం, జుట్లు సవరించుకోవడం. బూట్లకు లేసులు బిగించడం, ఇది పరమావధి అనుకోకుండా కళారంగంలో తమకు తాము అన్వేషించుకుంటే దొరకవల్సింది దొరుకుతుంది. అప్పటికీ దొరక్కపోతే ప్రాప్తి లేదన్నమాట. పురాణం గారు సుతారంగా, సంక్షిప్తంగా చెప్పారు.

నిజానికిది సుదీర్ఘంగా లాగి లెంపకాయ కొట్టడమే. బాలి కాలం నాటి ఆర్టిస్టుల్లో చాలామంది కిరసనాయిలు తహశీల్దార్లు కాకుండా ఉండడానికే స్ట్రగుల్ అయ్యారు. ఆర్టిస్టులుగా ఉండడానికి తపనపడ్డారు. ఉన్న ఉద్యోగాలు మాని, కొత్త ఉద్యోగాలు చేయకుండా త్యాగాలు చేశారు. కానీ బతకడం, తిండి తినడం, పిల్లల్ని పుట్టించి, వాళ్లకి తిండి పెట్టాల్సిన ఖర్మ కళాకారులకి కూడాపట్టింది.

అందుకని కిరసనాయిలు తాశీల్దార్లుగా మారాలని మాలో కొందరిని బతుకు ఆదేశించింది.చూస్తూ చూస్తూ తాశీల్దార్లవలేము. అలాగని అమాంతంగా మైకలేంజెలోలు కూడా కాలేకపోయాము. కనుక కాస్త అదీ ఇదీ కలగలిపి ప్రముఖ కిరసనాయిలు కళాకారులుగా తయారయ్యాం. ఈ లిస్టులో ఘనత వహించిన నేను ముందుంటాను.

పెద్దవాళ్ళూ.. గొప్పవాళ్ళయిన చంద్ర, గోపి, బాలి లాంటివాళ్లు ఇదే కోవకి చెందుతారు. పనితనంలో, గీతలో, ఊహలో ఎవరి స్పెషాలిటీ వాళ్లకుంది. 1960-70 దశకాల్లో తెలుగు పత్రికా ప్రపంచాన్ని పరిపాలించిన మహారాజులు వీళ్లు. అందులో బాలి స్థానం సుస్థిరం…దేశంలో ఏ రాష్ట్రానికేనా వెళ్ళి ఇది మా తెలుగు ఇలస్ట్రేషన్ అని సగర్వంగా చూపించుకోవచ్చు.

క్రోక్విలను ఆయన వాడినతీరు చూపించి మా తెలుగువాడే అని మీసాలు దువ్వొచ్చు. (మీరు అనకాపల్లి వాళ్లయితే “ఈడు మా అనకాపిల్లోడే” అని గొప్పలు పోవచ్చు). ఆయన కార్టూన్లలో కూడా చిత్రమైన ఎడ్జి ఉంటుంది. బాలి అమ్మాయిలూ, అబ్బాయిలూ మనందరికీ నేటికీ పత్రికల ద్వారా తెల్సినవాళ్ళే. యాభై ఏళ్ల జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే అనేకమంది సాధించలేక ఫెయిలయితే.. తాను మాత్రమే సాధించగలిగిన గీతని చూసి బాలి నిక్షేపంగా గర్వపడొచ్చు.

అది క్రెడిట్. 60-70 దశకాల బిడ్డలైన బాలి, చంద్ర, గోపి అందరికీ గొప్ప గొప్ప ప్లస్ లు ఉన్నాయి. పెద్ద మైనస్ లూ ఉన్నాయి. ఆంధ్రాని అప్పుడొక భూతం ఆవహించింది. బాపూ భూతం. ఆ భూతం గీత అందర్ని ఖండించి, ఊగించి, శాసించింది. అప్పుడే కుంచెలు పట్టుకుంటున్న గోపి, చంద్ర, బాలిలను అది ఉక్కిరిబిక్కిరి చేసింది. అది వాళ్ల కుంచె గీతనీ, తలరాతనీ కొత్త ఇండియన్ ఇంక్ తో గీసింది.

వాళ్ల కుంచెకీ, పాళీకి కొత్తదారి చూపింది. కానీ కొన్నేళ్ల తర్వాత ఓ దశాబ్దం తిరిగాక అదే గుదిబండ అయ్యింది. పురాణం గారు చెప్పినట్లు నిజమే అనిపిస్తుంది. ఇక పెరిగేది లేదని ఇప్పుడు వీళ్లు మొరాయిస్తున్నారు. ఒకనాటి కొత్త వింత అయిన సెన్సేషన్ ఈనాడు పాతబడింది.

ఓ కొత్త గీత వచ్చి పత్రికల పేజీలని తన మేజిక్ టచ్ తో మార్చేస్తుందని 80వ దశకమంతా ఎదురుచూశాం. ఏమీ జరగలేదు. ఈ ముగ్గురికీ గీతలో ఉన్న సుపీరియారిటీ మరోడికి వచ్చేట్టు లేదు. వాళ్లు ఎప్పటిలాగే బాపూ శవాన్ని భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడుస్తున్నారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!