Taadi Prakash …………………………………………….
Srisri Vs Arudra, C Naare, Dasaradhi, Sosu—————-
మనందరం ఎంతో మంచివాళ్ళం. మర్యాదస్తులం! నవ్వి, చెయ్యి కలిపి పలకరిస్తాం. వినమ్రంగా మాట్లాడతాం. ‘రా, కాఫీ తాగుదాం’ అంటాం. జ్యోతిలో మొన్న సోమవారం వచ్చిన నీ కవిత అబ్బో చంపేశావ్ గా అంటాం. “ఆదివారం సాక్షిలో నీ కథ టూమచ్ గురూ, ఇంకెవ్వరూ నీలా రాయలేరు” అని అతనూ అంటాడు.
మనం మొహమాటస్తులం. సిగ్గుపడే వాళ్లం. ఎవర్నీ పల్లెత్తు మాట అనం. ఎవడైనా చెడు మాట్లాడినా వినం. మంచితనానికి ప్యాంటూ చొక్కా వేసి టక్ చేసినంత హుందాగా వుంటాం. మనం సహ్రుదయులం…ఉదారులం. మిత్రుడికి సిగరెట్ యిచ్చి, అగ్గిపుల్ల గీసి వెలిగిస్తాం. వాడి బిర్యానీ బిల్లు కూడా పే చేస్తాం.
కవిత్వం రాయడం మొదలుపెట్టి మూడేళ్లు అయిపోతోంది, ఇంకా ఎవడూ మహాకవి అనడేం అని ఎదురుచూస్తాం.మనం కల్తీ లేని కెరీరిస్టులం. ఎవడు పొగిడినా వాడి తప్పుల్ని మన్నిస్తాం. ఎవడు వొంగినా వాడి భుజాల మీద ఎక్కేస్తాం! మర్యాద అనే కొమ్మకి పూసిన మల్లెపూల్లాగా పరిమళిస్తాం! చిటికెడు గౌరవం కోసం… ఆనక సాహిత్య అకాడమీ అవార్డు కోసం పరితపిస్తాం!
పరువు ముఖ్యం. ప్రతిష్ట సౌఖ్యం! కనక మన నిశ్చితాభిప్రాయాల్ని పెదవి దాటనివ్వం. పొగడ్త అనే రంగురంగుల పూలతేనె రుచికి అలవాటు పడినవాళ్ళం. సున్నితమైన వాళ్లం. విమర్శని అస్సలు తట్టుకోలేని వాళ్లం. పొగడ్తని కాదనలేని బిడియస్తులం!
నలభై, యాభై ఏళ్ల క్రితం నిర్మొహమాటస్తులైన పెద్దలు కొందరు వుండేవాళ్లు. కె.వి. రమణారెడ్డి, రాచమల్లు రామచంద్రారెడ్డి, బండి గోపాలరెడ్డి (బంగోరె) లాంటి వాళ్లు ఘాటైన పదాలతో నిజాన్ని నిక్కచ్చిగా చెప్పి తెలుగు సాహిత్య విమర్శకి గొప్ప గౌరవం తెచ్చారు. ఇక్కడ 1970 వ సంవత్సరం చాలా ప్రధానమైనది. అది మహాకవి శ్రీశ్రీ షష్టి పూర్తి సంవత్సరం. విప్లవ రచయితల సంఘం పుట్టిన ఏడాది.
అభ్యుదయ రచయితల సంఘం (అరసం) అనే రివిజనిస్టుల నుంచి విప్లవకారులం అంటూ కొందరు విడిపోయారు. అలా కకావికలైపోయిన కవులంతా “నువ్వు దరిద్రుడివి అంటే నువ్వే దగుల్బాజీవి”అని నోరారా తిట్టుకున్నారు. వూరుకుంటారా! కవిత్వాలు రాసుకున్నారు. కొంత చీప్ గా, చిల్లరగా వెవ్వెవ్వే అని వెక్కిరించుకుంటూ దిగజారుడు విమర్శలతో రెచ్చిపోయారు.
కవులు వీధిరౌడీలుగా మారి తన్నుకుని, కలాలతో పొడుచుకుని రాసుకున్న రక్తచరిత్ర… గురజాడ, శ్రీశ్రీ, ఆరుద్ర, నారాయణబాబు, సోమసుందర్, సినారె, మల్లారెడ్డి, దాశరథి, విశ్వనాథ, కృష్ణశాస్త్రి, తిలక్ లాంటి మహానుభావులకు సంబంధించినది అయినందువల్ల మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం.
తిట్టు కవిత్వంతో చెలరేగిపోవడంలోనూ శ్రీశ్రీ యే పయనీర్. పద్యాలతో, పన్ లతో, అంత్యప్రాసలతో అవమానకరమైన వ్యాఖ్యలతో శ్రీశ్రీ, సాటి కవుల్ని ఉతికి ఆరేశారు. మన సినిమాల్లో తిట్టినా, పెట్టినా సూర్యకాంతం కే చెల్లింది అన్నట్టు .. కవిత్వంతో ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా శ్రీశ్రీ … ఆడిందే పాట.
పాడిందే ఆట.“నువ్వు స్వయంగా అపాయాల్లోకి వెళ్ళు ఎరువు తెచ్చుకున్న అభిప్రాయాల్ని తగలబెట్టడానికి వీలుగా ఒక అగ్గిపెట్టె నీతో తీసుకువెళ్లడం మర్చిపోకు” అని శ్రీశ్రీ 1957లోనే మనకి చెప్పినా … ఆయనెపుడూ పది లీటర్ల పెట్రోలు డబ్బాతోనే దాడికి దిగేవాడు.
విశ్వనాథ సత్యనారాయణ అపూర్వ రచన ‘వేయి పడగలు’ పై కత్తి దూసిన శ్రీశ్రీ … “వేయి పడగలు… లక్ష పిడకలు… లక్క పిడతలు… కాగితప్పడవలు… చాదస్తపు గొడవలు “- అంటూ నరికి పోగులుపెట్టాడు. “కష్టంగా రాయడమంత సులభమైన పని లేనట్టే, సులభంగా రాయడమంత కష్టమైన పనికూడా లేదు” అన్నాడు శ్రీశ్రీ.
“అడుగుజాడ గురజాడది, అది భావికి బాట మనలో వెధవాయత్వం, మరిపించే పాట” అని శ్రీశ్రీ అంటే, “భాషలో, భావంలో, ఇతివృత్తంలో, ఛందస్సులో విప్లవాత్వకమైన మార్పులు తెచ్చినవాడు గనుకా, తన తరువాతి కవులకు మార్గదర్శకుడైనాడు గనుకా గురజాడ నిస్సందేహంగా తెలుగు కవిత్వ చరిత్రలో ఒక యుగకర్త” అని రా.రా. అన్నారు.
‘వజ్రాయుధం’ తో వాసికెక్కిన ఆవంత్స సోమసుందర్, 1970 లోనే విశాలాంధ్ర దిన, వార పత్రికల్లో కొన్ని వ్యాసాలు రాశారు. “గురజాడ రాచరికవాది అనీ, రాజభక్తి పరాయణుడనీ” విమర్శించారు. “శ్రీశ్రీ కూడా అంత గొప్ప కవేం కాద”నీ అన్నారు. “నోటికి వచ్చిన బూతులన్నీ కాగితాలపై ఎక్కించి అదే విప్లవ కవిత్వమని దబాయించే స్థితి ఏర్పడింద”నీ సోమసుందర్ ఆరోపణ.
1970 లోనే విశాఖలో జరిగిన శ్రీశ్రీ షష్టి పూర్తి సభలో కవి జ్వాలాముఖి మాట్లాడుతూ, సోమసుందర్ ని “బృహన్నల” అని తిట్టారు. “ఆయన్ని కొజ్జా అని నిందించడం బాధాకరమైన విషయమే” అంటూ సి.వి (చిత్తజల్లు వరహాలరావు) అచ్చతెలుగులో ఎత్తిపొడిచారు.
వీళ్లంతా “విప్లవ కవిత్వ వికృత శిశువుల”ని సోమసుందర్ ఎదురుదాడి చేశారు. వొళ్ళు మండిన శ్రీశ్రీ – ‘సోమా, సుందర దోమా… రామ రామ… సుకవితామతల్లికి ప్రవాస సీమ’ అని జోకేశారు. దాంతో, “అన్నయ్యకి ఆఖరి జాబు” అని సో.సు. రాస్తూ, “ఇంతగా పతనం అయిపోతావు అనుకోలేదు, మహాకవికి ఇంత దుర్గతా! ఇక ఉత్తరం రాయను – ఇట్లు సో.సు.
“ఆఖరి జాబుకి తొలి జవాబు” అని శ్రీశ్రీ తిప్పికొడుతూ “డియర్ సోదరా, సోమసుందరా! మూడోరేటు భావకవిగా ప్రారంభించి అయిదోక్లాసు సబ్జెక్టివ్ గా మారిన నీ తిరోభివృద్ధి గమనిస్తూనే వున్నాను .. అవును, నాలుగేళ్ల కిందటే అయితే ఇంతకన్నా బాగా అఘోరించేది నీ రాత గర్భస్రావాల్లాంటి నీ కవనాల్ని చూసి నిన్ను గోడ్రాలివనన్లే నేను(కడుపు నిలవలేదు, పాపం నువ్వేం చేస్తావు) …
పెంపుడు కుక్క కిష్టమైన పదార్థం నీ మెదడులోనే వుందంటున్నాను ఫర్వాలేదు, ఫ్లషవుట్ చేస్తానుగా — ఈలోగా… వచన కవిత్వం విని విని రుచిచెడ్డ శ్రవస్సుల కపురూపపు పద్యాల్ రచియించర, ప్రచురించర శుచి తెలియని కండ చీమ, సుందర దోమా- “ఇట్లు … యువర్స్ ఫ్రెటర్న్ లీ, శ్రీశ్రీ అని తిట్టిపోశారు
pl read it also………………….. తిట్టు కవిత్వం లోనూ శ్రీశ్రీ యే పయనీర్! (part2)
No Responses