Garuda Puranam ………………
గరుడ పురాణం లోని పంచ ప్రేతాల కథ ఇది.శ్రీ మహావిష్ణువు స్వయంగా గరుత్మంతుడి కి చెప్పిన కథ. విష్ణు మహిమ విస్తారంగా కనిపించే కథను వినాలని ఉందని వినతానందుడు అడగగా అతనిని అనుగ్రహించి విష్ణుమూర్తి చెప్పాడు ఈ కథను. పూర్వకాలంలో సంతప్తకుడు అనే తపోధనుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు.
ఆయన తన తపోబలం వల్ల పాపరహితుడు అయ్యారు. ఈ సంసారం పేరులోనే గాని తత్త్వంలో సారం లేదని తెలుసుకుని అడవులలోకి పోయి వైఖానస మునుల వృత్తినే తానూ అనుసరిస్తూ అరణ్యంలోనే చరిస్తుండేవాడు. బాహ్య చిత్తవృత్తులను అదుపులో పెట్టుకొని తద్వారా ఇంద్రియాలపై విజయం సాధించే ఉద్దేశ్యంతో తీర్థయాత్రలకుబయలు దేరాడు.
కానీ, దారి తప్పి ఒక చీమలు దూరని, కాకులు కూడా దారి తప్పితే పట్టుకోలేని మహారణ్యంలోనికి వెళ్ళిపోయాడు. అతనికి నలువైపులా బ్రహ్మాండంగా పెరిగిన చెట్లూ, లతలూ పొదలూ కనిపించాయి. దాంతో ఆయనకు దారీ తెన్నూతోచలేదు. సాధు, క్రూర జంతువులూ, పక్షులూ, రాక్షస పిశాచ గణాలూ మాత్రమే అక్కడున్నాయి. నర సంచారం లేదు.
ఆయనకు భయమనిపించలేదు.కానీ ఏమి చేయాలో తోచలేదు. కానున్నది కాక మానదు కదా, ఏదో ఒకటి జరుగుతుందిలే అనుకుంటూ ఒకవైపు సూటిగా సాగిపోయాడు. కొంతసేపటి తర్వాత కీచురాళ్ళ అరుపులు కర్ణకఠోరంగానూ,…….గుడ్లగూబల ధూత్కారాలు భయంకరంగానూ వినిపించసాగాయి.అయినా ఆగలేదు కానీ ఒక చోట అతి జుగుప్సాకర దృశ్యాన్ని చూసి నిలబడిపోయాడు.
అడుగు ముందుకు పడలేదు.అక్కడొక మర్రి చెట్టుకి ఒక శవం వేలాడుతూ వుంది. దానిని అయిదు ప్రేతాత్మలు పీక్కు తింటున్నాయి. ప్రతి ప్రేతమూ చూడడానికి చాలా భయంకరంగా వుంది. ముఖం మీద తప్ప ఇంకెక్కడా మాంసం లేదు. చేతులు, కాళ్ళు, అన్ని అంగాలూ ఎముకల మీద చర్మం కప్పినట్టుంది. ముఖంలో కళ్ళు లేవు.. వాటికి బదులు రెండు గోతులున్నాయి.
ఆ గోతులలోకి జారిపోయిందో, జారిపోతానని భయపడి పారిపోయిందో గాని ముక్కు అసలే లేదు. నెత్తిపై జుట్టు లేదు. బ్రాహ్మణుడు వాటిని చూసి భయపడి పోయాడు. ఆ ప్రేతాలు మాత్రం ఆయనను చూడగానే పిచ్చి ఆనందంతో గెంతులేస్తూ “వీడిని నేను తింటా … అంటే .. నేను తింటా” అంటూ ఆయన వైపు పరుగు తీశాయి.
ఆయన కాళ్ళను రెండు ప్రేతాలూ….చేతులను రెండు ప్రేతాలూ పట్టుకోగా అయిదవ ప్రేతం ఆయన తలను పట్టుకుంది. అవన్నీ భయంకరంగా అరుస్తూ అలా పట్టుకొనే గాలిలోకి లేచాయి. అంతవరకూ తింటున్న శవంలో ఇంకా మాంసం వుండిపోవడంతో దానినలా వదలడం ఇష్టం లేక కిందికి వచ్చి దానిని కాళ్ళలో ఇరికించుకొని మళ్ళా పైకి లేచాయి.
అపుడా ఆ బ్రాహ్మణుడు విష్ణుదేవుడిని ప్రార్థిస్తూ తనను రక్షించమని వేడుకున్నాడు. జగన్నాయకా! శరణు..శరణు ..నన్ను కాపాడు. దేవాధిదేవా, చిన్మయా, సుదర్శన చక్రధారీ, హరీ! నన్ను కాపాడు. అంటూ వేడుకున్నాడు. మొసలి నోట చిక్కిన ఏనుగును చక్రం ద్వారా రక్షించిన సామజవరగమనా.. నన్ను ఈ ప్రేతాల బారినుంచి కాపాడు తండ్రీ ..అంటూ మరెన్నో విధాల విష్ణు అవతార తత్త్వాన్ని కీర్తిస్తూ ఆర్తితో అరుస్తూ పిలిచాడు.
ఆ తపస్సంపన్నునిపై ప్రేమతో కూడిన జాలి కలుగగా విష్ణువు స్వయంగా బయలుదేరాడు. ఆ దరిదాపులకు చేరగానే అతనిలోని ఏ తపశ్శక్తి ఆ విషయాన్ని తనకి చేరవేసిందో గాని అతడు భయాన్ని వదిలేసి ఆ ప్రేతాల మూపులపై పల్లకీలో రాజులాగా సుఖంగా నిద్రిస్తున్నట్టు కనిపించాడు.
విష్ణువు ఆ గుంపు వెనకే వెళ్ళగా అక్కడ మణిభద్రుడను యక్షరాజు కనిపించాడు. అతనికి ఈ ప్రేతాల సంగతేదో చూడమని కనుసైగ చేశాడు..వెంటనే అతడా ప్రేతాలకే దుఃఖాన్నీ, భయాన్నీ కలిగించే ప్రేతరూపాన్ని ధరించాడు. వాటి కనులు కలవరపడేలా, గుండెలు గుభిల్లుమనేలా పెద్ద భుజాలతో, బుసలు కొడుతున్న తాచు పామంత నాలుకతో, భయంతో కంపించేలా వాటి యెదుట నిశ్చలంగా నిలబడ్డాడు.
ఆ ప్రేతాలు భయం నుండి తేరుకునేలోగా రెండింటిని చేతులతో ..రెండింటిని కాళ్ళతో ఒక ప్రేతాన్ని నోటితో ఒడిసి పట్టి భయంకరమైన పిడిగుద్దులతో వాటి ఒళ్ళు హూనం చేసేశాడు. వాటి నుండి బ్రాహ్మణుని విడిపించి ఆ మణిభద్ర యక్షుడు మాయమైపోయాడు.మణిభద్రుని దెబ్బలతో …. విష్ణు దయతో ఆ ప్రేతాల పాపాలు నశించాయి.
బ్రాహ్మణుని ఎదురుగా మోకరిల్లాయి. హే విప్రదేవా! మమ్మల్ని క్షమించండి. ఆ శ్రీహరి కరుణ, యక్షస్పర్శ .. మీ దర్శనం వల్ల మాకు పూర్వస్మృతి కలిగిందని చెప్పుకున్నాయి. ఆ ప్రేతాల దీనాలాపనను చూసి మనసు కరిగిన బ్రాహ్మణుడు వాటిని అడిగాడు ..బాబూ! మీరెవరు? ఇదంతా ఏమిటి? ఏదైనా మాయా లేక నా చిత్త భ్రమా? అని.
స్వామీ! ఇది మాయా కాదు భ్రమా కాదు. మేం ప్రేతాలం. మా పూర్వ జన్మ దుష్కృత్యాల వల్ల ఇలా మాకు ప్రేత యోని ప్రాప్తించింది అని వినయంగా చెప్పాయి. ప్రేతములారా! మీ పేర్లేమిటి? మీరేం చేస్తుంటారు? మీకీ దుర్దశ ఎలా ప్రాప్తించింది? నా పట్ల మీ ప్రవర్తనకి, అందులోని మార్పుకి కారణమేమి? అని ఆ బ్రాహ్మణుడు అడిగాడు.
ద్విజోత్తమా! మీ ప్రశ్నలన్నిటికీ ప్రత్యుత్తరాలిస్తాము. ‘మా పేర్లు ….. పర్యుషిత, సూచీముఖ, శీఘ్రగ, రోధక, లేఖకులు.సామాన్య మానవులే అనుకొని మిమ్మల్ని పట్టుకున్నాం. మీరు యోగిరాజని, విష్ణుభక్తులని తెలిశాక పూజిస్తున్నాము. మీ స్పర్శ మాత్రాననే మా పాపాలన్నీ ఎగిరిపోయాయి’ అని చెప్పాయి.
‘మీ నామధేయాలు విచిత్రంగా వినిపిస్తున్నాయి. ఇవి అర్థం లేనివని నాకనిపించడం లేదు. మీరు నాకు మీ గురించి వివరించండి’ అని బ్రాహ్మణుడు ఆదేశించాడు. వెంటనే ఆ ప్రేతాలు ఒక్కొక్కటి తమ కథలను చెప్ప సాగేయి …… ఇదండీ పంచప్రేతాల కథ.
మిగతాది పార్ట్ 2 లో