తుర్లపాటి నాగభూషణ రావు…………………………………..
నాగబంధం అనే ప్రయోగం నిజమేనా ? కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం లోని నేలమాళిగల్లో ఆరో గదికి నాగబంధం వేశారని… ఈ నాగ బంధమే అక్కడి నిధి నిక్షేపాలను కాపాడుతుందని పదేళ్ల క్రితం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నాగ బంధం విషయం లో పలు అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమైనాయి.నాగ బంధం ఉందని కొందరు అంటారు.
అంతా ట్రాష్ అని మరికొందరు అంటారు. కానీ నాగ బంధం వేయడం సాధ్యమే అని కేరళ వాసులు చెబుతుంటారు.కేరళలో ఇప్పటికి తాంత్రిక విద్యలు తెలిసిన వారు కొంతమంది ఉన్నారు. వారిలో కొందరి తాతలు, తండ్రులు ట్రావెన్కోర్ ఆస్థానంలో పనిచేసినవారే. వారి పూర్వీకులకు ఈ నాగబంధన విద్య తెలుసని అంటారు. అక్కడివారు చెప్పిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
నాగబంధం అన్నది మొత్తం నిధి నిక్షేపాలకు వర్తిస్తుంది. 16 వ శతాబ్దం లో ప్రయోగించిన నాగబంధం ఆ ఒక్కగదికే వర్తించదు. నేలమాళిగ లోని అయిదు గదులను తెరిచి అందులోని సంపదను గుర్తించినపుడే నాగబంధం తన ప్రభావం చూపించింది. సంపద వెలుగు చూసిన సమయంలోనే ఒకరికి మాతృవియోగం సంభవించింది.
మరొక సభ్యునికి కాలు విరిగింది. అయిదు గదులను తెరిచిన తర్వాత ఆరోగదిని తెరవాలనుకున్నారు. అయితే ఆ గది తలుపులపై నాగుపాముల చిహ్నాలు కనిపించడంతో సాహసించలేకపోయారు . ఈ లోగా సుప్రీం కోర్టు 5 గురు సభ్యులతో కమిటీ వేయడంతో ఆరోగది తెరవడం ఆగిపోయింది.
మొదటిగది తెరిచినప్పటి నుంచే నాగబంధం తన ప్రభావాన్నిచూపింది. ఇందుకు దృష్టాంతం గా నిధులపై కోర్టులో కేసు వేసిన ఆజన్మ బ్రహ్మచారి సుందరాజన్ కన్నుమూసారు. అపార నిధి నిక్షేపాలు అయిదు గదుల్లో ఉండగా, కేవలం ఆరో గది కే వేశారని అనుకోకూడదు. ఎక్కడ వేసినా అన్ని గదులకు వర్తిస్తుందని అంటారు.
ఈ నాగ బందాన్ని ఒక సారి ప్రయోగిస్తే అది వేల సంవత్సరాలైనా పనిచేస్తూనే ఉంటుందట. ఇంకా చెప్పాలంటే సర్పజాతి ఉన్నంతవరకు నాగబంధం శక్తి పనిచేస్తుందని అంటారు. నాగ బంధం వేసేటపుడు అన్నిరకాల పాములకు ఆవాహన చేస్తూ మంత్రాలతో వాటిని పూజిస్తారట. అప్పటి నుంచి ఆ పాములు నిధి నిక్షేపాలను కాపాడతాయని అంటారు.
అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అలాంటి శక్తివంతమైన నాగబంధమే ఉందని అంటారు. తాంత్రిక శక్తి తెలిసినవారే ఈ బంధాన్ని ప్రయోగించగలరు. ఇది కొద్దీ మంది సిద్ధులకే సాధ్యమని చెబుతారు. ఈ బంధం గురించి తెలిపే గ్రంధాలు ఏవీ లేవట. ఈ నాగబంధాన్ని గరుడ మంత్రాల ద్వారా విచ్చిన్నం చేయవచ్చని అంటారు.
కేవలం మంత్రం తంత్రం తెలిసిన సిద్ధ పురుషులకు మాత్రమే ఇది సాధ్యమని అంటారు. గరుడ మంత్రాల పఠనం ద్వారా వచ్చే శబ్ద తరంగాలు పాములను దూరంగా తరిమి కొడతాయట. అయితే ఈ ప్రయోగం రాజవంశీయులు చేయలేదు. ఆ అవసరం లేకుండా 2020 లో సుప్రీం తీర్పు ఇచ్చింది. రాజ వంశీయులు ఇష్టపడితేనే ఆరోగది తెరవాలని కోర్టు స్పష్టం చేసింది. వారికి ఆరో గది తెరవడం ఇష్టం లేదు. దాంతో ఆరోగది .. నాగ బంధం విషయం మరుగున పడిపోయాయి.
READ IT ALSO …………………… ఆ ‘ఆరోగది’ మిస్టరీ ఇక వీడదేమో!