Financial crimes…………………………………
నేరస్థులు ఇటీవల కాలంలో తెలివి మీరి పోతున్నారు. రకరకాల పద్ధతుల్లో ప్రజలను మోసగించి దోచుకుంటున్నారు. తమిళనాడులో ఒక ఆర్ధిక నేరగాడు ఒక ఫేక్ బ్యాంక్ ను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు దోచుకున్నాడు. 8 బ్రాంచీలు కూడా ఏర్పాటు చేసి డిపాజిట్లు, ఉద్యోగాల రూపేణా కోట్లు కొల్ల గొట్టేశాడు ఆ ఘరానా మోసగాడు.
విదేశాల్లో ఎంబీఏ చదివి, ఆ తర్వాత అక్కడే ఓ బ్యాంకులో పనిచేసి ఆ అనుభవంతో వచ్చి ఉత్తుత్తి బ్యాంకు ఏర్పాటు చేసి జనాన్ని నిలువునా ముంచేశాడు. చివరికి గుట్టురట్టయి పోలీసులకు చిక్కాడు. ఈ వ్యవహారంపై చెన్నై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నకిలీ బ్యాంకు ద్వారా రైతులు, నిరుద్యోగులకు రుణాలు ఇస్తామంటూ ఈ ముఠా మోసం చేసింది.చెన్నై అంబత్తూర్ లేడాన్ వీధిలో రూరల్ అండ్ అగ్రికల్చరల్ ఫార్మర్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (RAFC BANK) ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడ కెళ్ళి కూపీ లాగారు. స్థానిక తిరుముల్లైవోయాల్ కు చెందిన చంద్రబోస్ రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతి పొందినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి ఆ బ్యాంకు నడుపుతున్నారు.
అలాగే మదురై, ఈరోడ్, దిండుగల్, విరుదాచలం, కళ్లకుర్చి, నామక్కల్ తదితర ప్రాంతాల్లో మరో 7 శాఖలు కూడా ఉన్నట్లు తేలింది. ఇందులో సుమారు 200 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ డబ్బులు తీసుకుని వివిధ ఉద్యోగాల్లో వారిని నియమించారు.
ఈ బ్యాంకు శాఖల్లో 6.5 శాతం వడ్డీతో వ్యవసాయ రుణాలు ఇస్తామంటూ అందుకు ప్రతిగా వేలాదిమంది నుంచి భారీగా డబ్బు వసూలు చేశారు. అలాగే, ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లు, పొదుపు ఖాతాలకు అధిక వడ్డీ ఇస్తామని నమ్మబలికారు. దీంతో ప్రజలు బ్యాంకు శాఖల్లో భారీగా డబ్బు డిపాజిట్ చేశారు. ఇదంతా చూసి పోలీసులే ఆశ్చర్య పోయారు. నిందితుడు చంద్ర బోస్ లండన్లో ఎంబీఏ పూర్తి చేసాడు.
అక్కడి బ్యాంకులో పని చేసిన చంద్రబోస్, ఆ అనుభవంతో తమిళనాట నకిలీ బ్యాంకును ప్రారంభించాడు. అందుకు అవసరమైన మెషీన్లను సైతం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాడు. ఒక్క అంబత్తూరు శాఖలోనే ప్రజల నుంచి రూ. 3కోట్ల వరకు డబ్బులు సేకరించాడు. మిగిలిన శాఖల్లో ఏ మేరకు డబ్బు సేకరించారన్నదానిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.
ఈ బ్యాంకు శాఖల ఏర్పాటులో చంద్రబోస్ కు సహకరించిన మరికొంతమంది కోసం కూడా పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు ఇందులో ఉద్యోగాలు పొందేందుకు లక్షలు గుమ్మరించిన ఉద్యోగులు, ఈ బ్యాంకులో డబ్బు దాచుకున్న బాధితులు ఇపుడు లబోదిబోమంటున్నారు.
ఇలాంటి బ్యాంకులు ఇంకా ఎన్ని ఉన్నాయో ఏమో ? కొన్నేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్ని అనుమతులతోనే కోపరేటివ్ బ్యాంకులు పెట్టిన కొందరు వ్యక్తులు ఖాతాదారులకు కుచ్చు టోపీలు పెట్టారు.